పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

భోగము, భాగ్యమున్ గలిగి, పూర్వము నెవ్వరికైనఁ బ్రేమతోఁ
ద్యాగగుణంబు గల్గియును దానముసేయఁగ లేని గాసిచేఁ
దాఁకి దరిద్రభూత మటు తప్పక నేఁటికి వెంట నంటె; నూఁ
కో గతి యెవ్వ? రండ్రు, తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

89

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! పూర్వజన్మప్రారబ్దానికి నిదర్శనమైన ఈ సత్యాన్ని దయచేసి చిత్తగించు! మానవుడు వెనుకటి జన్మలో భోగ, భాగ్యాలతో తులతూగుతూ వుండికూడా, త్యాగగుణం లేనందువల్ల, ప్రీతితో (అర్హులైన వారెవ్వరికీ) దానం చెయ్యని పాపంచేత, ఈ జన్మలో ఆ జీవుణ్ణి దారిద్య్రమనే పిశాచం వెంటనంటడం తప్పదు. అలా దరిద్రుడయిన వాని మొఱను ఆలకించేవాళ్లుగానీ, వాడు దైన్యంతో విన్నవించే పల్కులను సానుభూతితో ఊకొట్టుతూ వినేవాళ్లుగానీ ఉండరు కదా! అప్పుడు తన పల్కులను వినేవారు లేరని చింతించి ప్రయోజనం లేదని అభిప్రాయం. (కాబట్టి, మానవుడు తనకున్నంతలో ప్రీతితో దానం చెయ్యడం ద్వారా ఇతరులకు సహాయం చేస్తూ పుణ్యాన్ని సంపాదించవలెనని సందేశం!)