పుట:కేయూరబాహుచరిత్రము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కేయూరబాహుచరిత్రము

క. ఓర్వం డెఱుఁగక యుండఁగ, నోర్వం డెఱుఁగంగఁ జూడకుండఁగ నోర్వం
     డోర్వఁడు సూడఁగ సుజనుం, డుర్విం దనవారి కైనయొప్పము లెందున్.275
వ. అని తగుమాటలాడి పెద్దయు వగచి మఱియు నప్పక్షి యి ట్లనియె.276
గీ. కాలఁజేతఁ బేదగావు నీయట్టివాఁ, డకట యుండఁదగిన యాలయంబు
     మున్ను జేసికొనని మోసాన నీ పాట్లు, పడఁగవలసె నిపుడు నడికిరేయి.277
క. అని పక్షి హితము చెప్పిన, విని వెంగలి యైనక్రోఁతి వీఁ డిరవున నా
     లును దాను నుండి నన్నొక, పినుఁగుం గాఁ దలఁచికాదె వ్రేలఁ దొడంగెన్.278
క. తనయింట దివియ యుండఁగ, నను గాయు మనండు నెగడి నాతోఁ గొఱమా
     లినమాటల నిసుమంతయుఁ, గొనకుంకఁగ నాడె నిట్టికుటిలుఁడు కలఁడే.279
చ. తన కఁటె యిల్లు గల్గె నఁటె తా దొర నాకఁటె యిల్లు లేదు! న
     న్పునఁ గడుం గ్రొవ్వె నీపులుఁగు పుచ్చెద దీనిమదం బటంచుఁ బె
     ళ్ళనఁ దరుశాఖ విర్చి కపియచ్చటి చేరువఁ బల్వలోదకం
     బునఁ బడవైచె నంత వెఱపుట్ట ఖగాంగన గూయుచుండఁగన్.280
వ. అప్పుడు.281
క. తడిసినయెఱకలు నీళ్ళం, బడి బెగడిన మనసు గలుగు ప్రాణేశ్వరి న
     య్యెడ నుడిపి తెచ్చి యొండొక, యెడకుం గొని యేగి పక్షి యిమ్ముల నుండెన్.282
క. కావున వివేకహీనుల, త్రోవం బోవలదు వారితోడి చెలిమి దా
     నేవెంటనైన నాపద, గావింపకపోదు సుమతికలితుల కైనన్.283
క. ధర దుష్టసఖులగుణములు, వెరవున నేమేని జేయవేచుట తప్పు
     ల్పరిగొలుపుట మర్మాంతర, పరిహాసము సేయుచునికి పంకజవదనా.284
వ. అని సుకుమారి యెఱింగించిన కథ యిరువురుం గొనియాడి రప్పుడు మకరం
     దిక యి ట్లనియె.285
క. ఇమ్ముగఁ జెలిమి యొనర్చినఁ, గుమ్మరిపుర్వులవిధంబు కుజనులు చూడన్
     సొమ్మిత్తురు తుదిముట్టినఁ, దమ్మిత్తురు నీతిపరులు తగుమిత్రులకున్.286
వ. అని మఱియు ని ట్లనియె.287
గీ. బుద్ధిమాలినకపి యొక భూమిపాలుఁ
     జంపె హితుఁడయ్యు, నొకదొంగ శత్రుఁడయ్యె
     విప్రునొక్కని గాచె వివేకి యగుట
     సుమతిపగ మేలు విమతి నెయ్యమున కంటె.288