పుట:కాశీమజిలీకథలు -09.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

కానిండు. మా యన్న పొందవలసిన సత్కారముల నే నందితిని. మీ కెల్లరకు నింత గౌరవము గలుగుట మా పూర్వపుణ్యసుకృతముగాక మఱియొండు గాదు.

ఇప్పుడు నే నతనికడకుఁ బోయి తద్భంధనప్రకార మెఱింగి శక్యమైనచో విడిపించెద లేనిచో మీ కొకజాబు వ్రాసెదఁ దగిన సైన్యముల సహాయ మీయుఁడు. ఇదియే మీరు వానికిఁ జేయు ప్రత్యుపకారమని పలికిన విని యమ్మహారా జిట్లనియె.

ఒహోహో! ఎంతమాట వింటిమి. మాకుపకారముఁ జేసినవాఁడు మీ యన్నయా? అతని పేరు రాజవాహనుఁడా? ఎట్లయిన మీ కుటుంబమున మాకు విశ్వాస ముంచక తీరదు. అయ్యసహాయశూరు నెట్లు పట్టికొనిరో యది యసంభవము. కానిండు. ఎప్పుడో యననేల? వలసిన దళములఁ దీసికొనిపోయి వాని విడిపింపుడు. అవసరమైన నేను గూడ వత్తునని పలికిన శ్రమణి యిట్లనియె.

దేవా| ఇప్పు డెవ్వరు రానక్కరలేదు. నే నొక్కరుండఁబోయి కార్యము సాధించెద. కానినాఁడు సేనం బంపుదురుగాక. మీ సహాయ మెప్పుడుం గావలసినదే యని పొగిడినది ఆ దివసంబెల్ల నొండొరుల చరిత్రములు చెప్పికొనుచుఁ దృటిగా వళ్ళించిరి. కోటలో నా రాత్రి యతనికి గొప్ప విందుఁ గావించిరి. అని యెరింగించి తరువాయికథ పై మజిలీయందు జెప్పఁ దొడంగెను.

181 వ మజిలీ

సునందుని కథ

శ్రమణి మరునాఁ డరుణోదయమునకు లేచి రాజు ననుమతి వడసి యెవ్వరిని వెంటఁ బెట్టుకొనక యస్వారూఢయై జయపురంబున కరుగుచుండెను. మఱి యొకనాఁ డొకచోట నీ ప్రాంతమందలి పల్లెలోఁ జిలుక శకునము చెప్పునని యెవ్వరో జెప్పినంత విని యా పల్లెకుంబోయి యొకచోట బసఁజేసి యందలి నిబంధన లన్నియుం దెలిసికొని మా యన్న రాజవాహనుఁడు వెంటనే విడువఁబడునా? అని ప్రశ్న మడిగి కులశీలనామాదులు వ్రాసి సొమ్ముతో గూడ నం దర్పించినది. ఆ ప్రశ్నమున కుత్తరము జెప్పుటకు నాలుగుదినములు గడవుఁజెప్పిరి.

శ్రమణి యన్నయుంబోలెఁ దానుగూడ నేమియుం దోచక యశ్వ మెక్కి సాయంకాలమున నుద్యానవన ప్రాంత భాగముల విహరింపుచుండెను. అప్పు డొక రాజకుమారుఁ డొకతోటలో గుర్రమెక్కి వచ్చుచు నెదురుపడియెను, ఒండొరులఁ జూచుకొనినప్పుడు రాజకుమారుఁడు శ్రమణి నెరింగినట్లుగా నవ్వుచు నా గుర్రమును నడిపించెను. రెండు గుర్రముల నొకచోట నాపి దిగినప్పుడు రాజపుత్రుఁ డోహోహో! నా మిత్రుఁడు రాజవాహనుఁడా! ఎవ్వరో యనుకొనుచున్నా నని పలుకుచు దాపునకు వచ్చి బిగ్గరగా గౌఁగలించుకొనియెను.