10
కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము
ఉ. ఏఁబదియారు దేశముల కేకశిరోమణియై నిరంతర
శ్రీ బహుళ ప్రజావితతిచే విలసిల్లి సముల్లసత్సువి
ద్వాబలదీప్తసత్కవియుతం బగుచుం దగు నాంధ్రదేశ ము
ర్వీబృషదుత్త రీయమున విశృతశైలనదీపురాఢ్యమై.
అయ్యాంధ్రదేశమధ్యభాగంబునుండియే కదా భద్రాచల రామాచల పట్టసాచల పద్మాచల ధవళాచలాది పుణ్యశైలవిరాజమానతీరంబగు గోదావరినది ప్రవహించుచు నేడుమార్గంబుల వారాశియుం గలియుచున్నది. అట్టి తెలుగుదేశమునకుఁ బశ్చిమోత్తరభాగంబున నిరంతరకాంతారసంవేష్టితకూటంబు లగు పర్వతకోటు లనేకములు విరాజిల్లుచున్నవి.
అందొకానొకశైలమూలంబున విశాలసమచతురంబగు భూభాగంబు తృణకాష్ఠజలపూర్ణంబై యొప్పుచుండెను. ఆ ప్రదేశమునకుఁ బ్రాగుత్తరదిగ్భాగంబుల సమున్నతశిఖరంబులగు భూధరంబులును, దక్కిన రెండుదిక్కుల మిక్కుటముగా నల్లికొనియున్న వెదురుపిండంబులును బెట్టనికోటలై కాపుగాయఁ దదభ్యంతరమున,
సీ. జలపూరితంబులై సెలయేరు లెప్పుడు
గిరికూటములనుండి క్రిందుజార
సంపూర్ణముగా సర్వసస్యంబు లింపార
ముక్కారు కేదారముల ఫలింప
ఫల దళ కుసుమ సంపన్నంబులగు నద్రి
కోన లొప్పార నుద్యానములుగ
బహువిధ మంటప ప్రాసాద గృహచిత్ర
శాలావళీ విశేషములు గ్రాల
గీ. నందుఁ పొలుపొందు పక్కణాభ్యతరమునఁ
గాపురముసేయుఁ బ్రథితవిఖ్యాతితోడ
దుందుభియనం దగు పుళిందుఁడు నిషాదు
లధికసంఖ్యాకు లెపుడు త న్నాశ్రయింప.
కిరాతచక్రవర్తియని ప్రఖ్యాతి వడసిన యా దుందుభి యా యరణ్యభూభాగంబుల కధికారియై శబరులం బాలింపుచు మహాపురంబువలె మెఱయుచున్న యప్పట్టణంబున వసించి పులిందిని యనుభార్యయందు రాజవాహనుండను కుమారుడు, శ్రమణి యనుకూఁతుల బడసి సంసారసుఖం బనుభవించుచుచుండె.
మఱియు నతండు ...........సాధనంబుల బూని అనుచరులతోఁ గూడికొని మహారణ్యమధ్యంబులకుం బోయి గోతులు ద్రవ్వి పగ్గంబు లొగ్గి యురులు బన్ని యుచ్చులు బిగించి చిక్కంబులం గట్టి గజసింహశరభశార్దూలాది క్రూరరసత్వంబుల పికశారికా