పుట:కాశీమజిలీకథలు -09.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

దీక్షి - అదిగో మృదంగధ్వని వినంబడుచున్నది. నాటకము ప్రారంభించిరి కాఁబోలు. మీరు చూడవత్తురా నేను బోవుచున్నాను బాబూ.

సోమ - నా కాయాసముగా నున్నది రాలేను.

అని వారు మాట్లాడికొనిన మాట లాలించి విక్రమార్కుండు బాగు బాగు. వీరి మాటలవలన రూపపతీ సుమనల గ్రామనామములు దెల్లమైనవి. వీరిని భార్యలతో గలుపుట యీమాటు సులభమేయని యాలోచించుచు వారివలన మఱల నా గ్రామములకు దారులడిగి తెలిసికొని యా వార్త వా రిద్దరికిఁ జెప్పి నేను రేపా రెండు గ్రామములకుఁ బోయి మీ భార్యల తావుల దెలిసికొనివచ్చెద. మీరిందే యుండుడు. కాలినడకం బోయిన జాలదినములు పట్టును. అశ్వయానమున నాలుగు మూఁడు దీనములలోఁ జూచి వచ్చెదనని చెప్పి యా రాత్రి గడిపి మఱునాఁడు గుర్రమెక్కి యరుగఁబోవు సమయంబున నేమిటికో యా కన్యదాత యా వీథికి వచ్చి గుర్రమును గురుతుపట్టి తనకు రసరసాయనము లిచ్చిన దివ్యపురుషుం డీతఁడే యని గ్రహించి విక్రమార్కుని బిగ్గరగా నాలింగనము జేసికొని మహాత్మా! ఈ వైభవమంతయు నీ దానమహత్వముననే కలిగినది. నే నెట్లుంటినో చూచితిరా ? మీరు సమయమునకు వచ్చితిరి. మా యింటికి రండని ప్రార్థించుచు నందున్న వారికెల్ల నతని వృత్తాంతము వెల్లడించెను.

జనులు గుంపులుగా మూగికొని వింతగాఁ జూడఁ దొడంగిరి. అప్పుడు విక్రమార్కుఁ డాలోచించి అయ్యా ! నేను మీ రెవ్వరో యెఱుఁగను. నేను మీ కేమియు నీయలేదు. నన్ను మీరు మఱియొకరనుకొను చుంటిరని గద్దించి పలికి గుర్రమెక్కి యవ్వలికిం బోయెను.

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ తరువాతి నివాసదేశంబున నిట్లు చెప్పఁదొడంగెను.

207 వ మజిలీ

విక్రమునిదేశయాత్ర కథ

మాణిభద్రుడు - ప్రేయసీ! నీ యక్కకూఁతురు త్రిపురసుందరికి వివాహసన్నాహ మంతయుం గావించి విక్రమార్కునిం దీసికొని వత్తునని జెప్పి యూరక వచ్చితివేల ? ఇంతకాల మెందుంటివి?

మదనమంజరి - ప్రాణేశ్వరా! నే నిందుండి యుజ్జయినీపురంబున కరిగితిని. అమ్మహారాజు గ్రామములో లేకపోయెను. ఉత్తరదేశమందలి వింతవార్తయేదియో విని దానింజూచుటకై బయలుదేరి దేశాటనము జేయుచున్నాఁడని వింటి. వెంటనే యతనిజాడలు దీయుచు నేనును వెనువెన్క నాతఁడు దిరిగిన దేశములన్నియుం దిరిగితిని. ఆహా ! ఆ మహారాజు గావించిన చర్యలు వినిన మఱియు విస్మయము గలుగు చున్నది.