252
కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము
నపారసంతోషముతో వచ్చి విక్రమార్కుని శక్తి కచ్చెరువందుచు వినుతింప దొడంగిరి.
అంతలో నా నగరాధీశ్వరుండు సుశీలుండను రాజు విక్రమార్కుని యమానుషతురంగారోహణసామర్థ్యము విని వెఱఁగందుచు పణద్రవ్య మర్పింప నవ్వీరు నిచ్చటికిఁ దీసికొనిరండని కింకరులం బం పెను. వా రాహయముతోఁ గూడ విక్రమార్కుని నూరేగింపుచుఁ బౌరకాంతలు సౌధంబులనుండి పుష్పవర్షము గురిపింప నన్నృపాలుని యోలగంబునకుఁ దీసికొనిపోయిరి.
నలువురు బ్రాహ్మణులు బేహారియు నతనివెంటఁ గొల్వున కేగిరి. మఱియు బౌరసామంతజానపదాదులు వేనవేలు సభనలంకరించిరి. అప్పుడా నృపాలుండు విక్రమార్కునిఁ బెద్దగా గౌరవించి వినుతింపుచు మహావీరా? మీదే దేశము? పేరేమి? ఎందు బోవుచు వచ్చితివని యడిగిన వెనుక యధికారులతోఁ జెప్పినట్లె చెప్పెను. అంతలో నా బేహారి నిలువంబడి మహారాజా! ఈతం డీ గుర్రము నా కమ్మివేసి సొమ్ము తీసికొనియెను. నా యనుమతి లేనిదే బలవంతమునఁ దీసికొనిపోయి పందెము గెలిచెను. పణము గెలిచినది నా గుర్రము. ఆసామ్ములో నాకుఁ గొంతలాభము రావలసియున్నది. ఇప్పింపుఁడని కోరిన నరేంద్రుం డిట్లనియె.
బలహారీ నీ గుర్ర మమ్మికొన నవసర మేల వచ్చినది? అమ్మి బలవంతముగాఁ దీసికొని రానేల? ఇందలి నిజమేమని యడిగిన నయ్యొడయండు వీరికంతయు దెలియును. వీరి నడుగుమని యా బ్రాహ్మణులం జూపుటయు రాజు మీరెఱింగినది చెప్పుఁడని పలుకగా నందొక వాచాలుండగు భూసురుం డిట్లనియె.
మహారాజా ! ఈతండు శిబిదధీచికర్ణాదుల మించిన వదాన్యుఁడు. ఈతని చరిత్రము వినిన మీరు మిక్కిలి వెఱఁగుపడుదురు. వినుండు -
సీ. ఎలమి గ్రుక్కెడు దాహమిచ్చిన పాఱున
కయంతబొసంగె దా హయమునమ్మి
యజ్ఞదక్షిణ నిత్తునని మాకు వరమిచ్చి
విటతఁ గైకొని చొచ్చె వేశ్యయిల్లు
బ్రహ్మరాక్షసుని వారవధూసమాశ్రితుఁ
బరిమార్చి దాని యాపద నడంచెఁ
దన వారువమునుఁ జేకొని వేళకట కేగి
ధృతిమీర రెండు పందెములు గెలిచె.
గీ. తద్ధనంబెల్ల మాకర్పితంబు సేసె
నిట్టి వితరణగుణశాలి యిట్టి సుమతి
యిట్టిసాహసశూరుఁ డెందేనిఁ గలడెఁ
గుణసముద్రుండు విక్రమార్కుండుగాక.
.