పుట:కాశీమజిలీకథలు -09.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

క. ఓరీ? క్రూర నిశాచర!
   నారీమణిఁ బట్టి వచ్చు నరుల న్భుజ వి
   స్ఫారబలంబునఁ జంపు దెఁ
   రా రమ్మిఁక నీకు మూడెరా మృతి నాచేన్.

అని పలుకుచుఁ దాటాకువలె మడతవెట్టి యిమిడ్చి దాచి యుంచిన చంద్రహాసంబు దీసి చేతితో సాపుగ దుడినంత వజ్రాయుధమువలె నిలఁబడినది. దక్షిణహస్తంబున నాఖడ్గంబు ధరించి గిరగిరం ద్రిప్పుచు రౌద్రావేశముతో వానిపయిం బడి తన్ముష్టిఘాతంబులు గణింపక వానిం జిక్కఁబట్టి యిట్టట్టు కొట్టుకొనుచుండఁ దత్కంఠం బుత్తరించి పారవైచెను.

అప్పు డప్పడతి యొడ లెఱింగి లేచి యా రాక్షసకళేబరంబు జూచి యడలుచు నయ్యొడ యని యడుగుఁదమ్ములంబడి మహాత్మా! యీజెడుగు నామేన యౌవనము పొడసూపినది మొదలు నన్నావేశించి కష్టపెట్టుచున్నాఁడు. ఎందరినో పురుషసింహులఁ బొట్టం బెట్టుకున్నాడు ఇట్టి దుష్టుని గడియలో మడియఁజేసితివి. నీవు నన్గావ వచ్చిన భగవంతుఁడవు గాని మనుష్యు మాత్రుండవుగావు. నాకున్న సొత్తుతోఁ గూడ నీ యధీన నైతిని. నీయిష్టము వచ్చినట్లు చేసికొనుమని ప్రార్థించినది.

అయ్యతివమాటల కతండు సంతసించుచుఁ గానిమ్ము. నీవు నా యధీన వైతివిగదా. నేను జెప్పినట్లు నడుచుకొనవలయు. పిమ్మట విమర్శింతు నిప్పుడు నా కిత్తునన్న ధనం బిమ్ము. పనియున్నదని పలికిన నక్కలికి ముఱియుచు నతండుకోరిన ధన మిచ్చినది. దానిం బుచ్చుకొని యారాజు సూర్యోదయము కాకమున్ను సత్రంబునకు బోయి యావిప్రుల లేపెను.

వా రతనిఁ బునర్జీవితునిగాఁ దలంచి కౌగలించుకొనుచుఁ బుణ్యాత్ముడా? నీ వెవ్వఁడవో మే మెఱుఁగము. రాత్రి నీ నిమిత్తమై మేము పడిన సంతాప మేమని చెప్పుదుము. బ్రతికి వచ్చితి వింతియ చాలునని పలికిన నతండు నవ్వుచుఁ దాను దెచ్చిన ధనము జూపి వీని బేహారికిచ్చి నా గుర్రమును విడిపించుకొనిరండు. నే నీ లోపల హజారమునకుఁబోయి పేరు వ్రాయించుకొని వచ్చెదనని చెప్పి వారిని వర్తకునియొద్ద కనిపి తాను రాజపురుషులకడకుఁ పోయి యిట్లనియె.

నే నుత్తరదేశస్థుఁడ. మీ గుర్రపు పందెముల వార్తవిని యిందు వచ్చితిని. నాపేరు బలహారి యందురు. వ్రాసికొనుఁడని చెప్పినంత వారాపేరు వ్రాసికొని మూఁడు గంటలకు రమ్మని చీఁటి వ్రాసియిచ్చిరి. అతండు వెంటనే సత్రమునకు వచ్చెను. బ్రాహ్మణులు తెల్ల బోయి చూచుచు మా కా వర్తకుడు గుర్ర మియ్యనన్నాఁడు. మీరె రావలయునట. వానికి గుర్రము తిరుగా నిచ్చుట కిష్టములేదు, ఏమి చిక్కులుపెట్టునో యని పలికిన నంతతో నమ్మహారాజు వారిని వెంటఁబెట్టికొని బేహారి యింటికిం బోయి వడ్డీతో సొమ్ము తీసికొని గుర్రము నిమ్మని యడిగెను.