పుట:కాశీమజిలీకథలు -09.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

ఆ విషయమున వారిరువురకు సంవాదము జరిగినది. ఆ శకుంతమేదియుఁ జెప్పలేకపోయినది. తరువాతకథ వచ్చిన పక్షి యెందన్నదో యరసి తెప్పించి దాని వలన నందలి నిజానిజంబులు గ్రహింపవలయునని నిశ్చయించుకొనిరి.

అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించుటయుఁ దరువాతి వృత్తాంతము పైమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.

174 వ మజిలీ

కల్పలత కథ

మహేంద్రనగరాధీశ్వరుండైన వసుపాలునకుఁ గల్పలతయను కూతుఁ రొక్కరితయే యుదయించినది. అమె మిక్కిలి చక్కనిదని వర్ణించుటకంటె నట్టి సౌందర్యవతి మనుష్యలోకమున నిప్పటికిఁ బుట్టలేదని చెప్పిన సులభముగాఁ దెలియును. అప్పుడుమిఱేఁ డప్పడఁతి చెప్పినదే విధివాక్యముగా నెంచుచు నమ్మించుఁబోడి యేమి కోరినను దెప్పించి యిప్పించుచుండును. ఆ బాలికారత్నమునకుఁ జిన్నతనము నుండియుఁ బక్షిజాతియందుఁ జాలప్రీతిఁ గలిగి యున్నది. ఎక్కడ నెట్టి వింతపిట్ట లున్నవని విన్నను నెంత రొక్కమైన నిప్పించి తెప్పించుచుండును. వింతపక్షులను దెచ్చినవారికి వారు కోరిన వెల నిప్పింతునిని దేశదేశములయందుఁ బ్రకటించియున్నది. పుళిందుని ప్రఖ్యాతిఁ విని యందుగల పక్షిజాతి నంతయుఁ బంపుమని వార్తనంపినది. అందప్పు డేమియు బక్షులు లేకపోవుటచే నందలి పులుగులు సంప్రాప్తించినవికావు.

ఒకనాఁడు సత్యవంతునికిఁ జిక్కక పారిపోయిన రెండవపక్షి యొకబోయవానికి దొరికినది. వాఁ డాపిట్టం బట్టుకొని దానియాకారసౌష్టవమున కచ్చెరువందుచు మహేంద్రనగరంబున వింతపక్షుల కెక్కుడు వెలయిచ్చి కల్పలతయను రాజపుత్రిక కొనుచున్నదను వార్తవిని యానగరంబునకుం బోయి యందలి రాజపురుషుల కత్తెఱం గెఱింగించెను.

వారు వానికి జెప్పి పంజరముతో గూడ నాపతత్రమును రాజపుత్రిక యంతఃపురమున కనిపి వాఁడు చెప్పినవెలఁ దెలియఁజేసిరి. ఆ పక్షిం జూచినతోడనే యాచేడియ వేఱుమాట పలుకక వాఁడు సెప్పినవెల కిబ్బడిగా నిచ్చి యంపి దానిరత్నపంజరముఁ బెట్టించి ముద్దుపెట్టుకొనుచుఁ బలురకములఁ బండ్లఁ దినిపించి మెల్లగాఁ మాటాడించుటయు నాపతంగ మిట్లనియె.

రాజపుత్రీ! కల్పలతా! రాజపుత్రీ! కల్పలతా? అని రెండుసారులు పిలిచినది. దాని కంఠమాధుర్యము కచ్చెరువడి యప్పడఁతి దాపునకు వచ్చి యేమి పతంగపుంగవా? నన్నుఁ జీరుచుంటివి. నాపేరు నీకెవ్వరు. సెప్పిరి? నీ కీమాటల