పుట:కాశీమజిలీకథలు -09.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    వారణస్యందన వాహనారోహణ
                క్రమమున మర్మకర్మముల దెలిసె

గీ. నృత్యగీతవిద్యాప్రౌఢి నిర్వహించె
    సకలదివ్యాస్త్రశస్త్రప్రశస్తి మించె
    దేజమున నొప్పి భట్టి ద్వితీయుడగుచు
    విక్రమాదిత్యు డసమానవిక్రముండు.

క. పూవునకు జన్మతోడనె
   తావుల్ ప్రణవించునట్లు తద్బాలునకుం
   భావమున సుగుణ పుంజము
   లావిర్భావంబు నొందె నద్భుతరీతిన్.

రాజపుత్రుండు మువ్వురమిత్రులతోఁ గూడికొని యొకనాడు కేళీలాలసుండై యుద్యానవనంబునకు బోయి విహరింపుచు గ్రీడాంతరమున నిట్లు సంభాషించెను.

విక్ర — భట్టీ! శ్రద్ధబట్టి గట్టిగా జూచుచుంటి వది యేమి పుస్తకము ?

భట్టి - మహాభారతసారము.

విక్ర - అందేమి యున్నది?

భట్టి — ఇందు బాండవుల పరాక్రమము అద్భుతముగా వర్ణింప బడి యున్నది.

విక్ర - చాలు. చాలు. పాండవులకు బరాక్రమ మున్నదా ?

భట్టి - అట్లనుచుంటివేల? అర్జునుడు మహావీరుడు కాడా? భీముని పరాక్రమ మేతన్మాత్రమే పరిహాసకల్పితమా ఏమి ?

విక్ర — కాదు. సత్యమే. పాండవులు వీరులే యైనచో శత్రువులు లక్కయింట బెట్టి నిప్పంటించినప్పుడు గుహామార్గంబునబడి రాత్రికి రాత్రికి నదులు దాటి యరణ్యము లతిక్రమించి మారువేషములతో బల్లెలజేరి బిచ్చమెత్తుకొని జీవింతురా? అయ్యయ్యో! ఈ పని క్షత్రియకులజులకెల్ల దలవంపులుగాదా?

భట్టి -- అన్నా! అప్పుడు వారు పిరికిపందలై పారిపోయిరందువా? ఏమి?

విక్ర - సందియమేలా! కానిచో నప్పుడే పోయి దుర్యోధనుం బట్టికొని కట్టి ధృతరాష్ట్రు నెదుటబెట్టి నీపట్టి యెట్టిపని చేయబూనెనో చూచితివా? అని యడిగిన తగినశాస్తి చేయనే చేయుదురు.

భట్టి - పోనీ పరాక్రమశాలి కాకున్నను సుగుణశీలియని యొప్పుకొందువా?

విక్ర - అతండు ప్రాకృతుడు వోలె విత్తసక్తుడుగాని విరక్తుడుకాడు.