పుట:కాశీమజిలీకథలు -02.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

కాశీమజిలీకథలు - రెండవభాగము

అని యున్న పత్రికను పలుమరు పఠించి దాని కల్పనకు వెఱగందుచు నోహో! ఈపత్రిక వ్రాసిన చిన్నది మిగుల చతురయు విద్వాంసురాలు నగును. ఈవృత్తమూలమున మదీయవృత్తాభిఖ్యల తెఱగెరుంగనగు నని వ్రాసినది. అభిఖ్య యనగా పేరు. వృత్తము వసంతతిలక కావున దానిపేరు వసంతతిలకయై యుండవచ్చును. దానిలోనున్న యర్థము సౌందర్యము, సంగీతము, మంచివంశము, మంచిస్వభావము, మంచివిద్య మొదలైన గుణములు. ఒక్కొక్కటి యున్నను పురుషుని గొప్పఖ్యాతి గలవానిగా జేయును. అన్నిగుణములు నొకచోట నుండినచో నేమి చెప్పదగినది. అట్టి పురుషుని ఏకామిని వరించదు, అని యున్నదిగదా! అట్టి పురుషుడవు నీవనియు నిన్ను వరించుటచేత నావృత్తము మంచిదేకాని చెడ్డదికాదనియు మరియు నా విద్యాదిగుణసంపతి దీనిమూలముననే తెల్లమగుచున్నదనియు ప్రౌఢముగా వ్రాసినది. కానిమ్ము దీని మరిగొంత పరీక్షించి చూచెదంగాక యని మఱల నొకపత్రికలో నీ క్రిందిశ్లోకము వ్రాసితిని.

శ్లో॥ జగమిషుభిః పరదారాన్ సిద్ధ్యాయతి ప్రత్యవాయ పరిహారాః॥
      ప్రాగేవచింతనీయా లబ్దావసరోహి దుర్జయోమదనః॥

ఇట్టి శ్లోకమువ్రాసి పత్రికముడిచి యా చిలుకముక్కున కందిచ్చితిని. అదియెంతనేర్పరియో చక్కగా నాచీటిని ముక్కునబిగియ గఱచుకొని రివ్వున నెగిరి పోయెను. నేను దాని మక్కువకు మిక్కిలి సంతోషించితిని. నేనును దానిపోయిన వలను చూచుచుండ నదియుంబోయి కొంతసేపటికి మరల నాయొద్దకు వచ్చి వ్రాలినది. అప్పుడు దానిముక్కుననున్న పత్రిక మరల నరసిపుచ్చుకొని విప్పి చదుకొన నందు ఆర్యా పరశబ్ద ముత్కృష్టార్థముగా భావించినచో దక్కిన శ్రమ లేమియు నుండవు కదా?

అని వ్రాయబడియున్నది. నన్ను బరదారగా భావించవద్దనియు స్వదారగా స్వీకరింపవలనియు సూచించుచున్న యాయుత్తరము చూచుకొని నేను మరల నీ భావము భాగవతమైనది కాని క్రియాభావమగునని వెఱచుచుంటినని వ్రాసి యంపుటయు భావము దిరమైయుండ గ్రియాభావ మెన్నడును కానేరదని దానికి ప్రత్యుత్తరము వ్రాసినది. ఈరీతి నుత్తరప్రత్యుత్తరములచేత మాకు బరిచయము గలిగిన పిమ్మట నొకనాటిరాత్రి నేనామేడమీద గూర్చుండి సంగీతము పాడుకొనుచుండగా నొకనెలతుక వచ్చి నాకు నమస్కరించిన నీవెవ్వతెవని యడిగితిని. అది ఆర్యా! నేను వసంతతిలక సఖురాలను. నాపేరు త్రిలోత్తమయండ్రు, మారాజపుత్రిక తమసంగీతరసంబు శ్రుతిపుటంబులగ్రోల నుత్సుకముజెంది యిక్కడి కరుదెంచినది. ప్రవేశింప ననుజ్ఞయిత్తురే యని సవినయముగా బ్రార్ధించిన నాలించి ఏమనుటకుదోచక యొక్కింతతడపు ధ్యానించి యిట్లంటి.