పుట:కాశీమజిలీకథలు -02.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భీమశర్మ యను బ్రహ్మచారి కథ

63

బ్రాహ్మణుడా! ఇది పారుజాతమువంటిది. దీనిని బయటనుంచినచో యోజనదూరము దీని పరిమళము వ్యాపించును. ఎన్ని దినములున్నను వాడక యిట్లే యుండును. ఇది భూలోకములో దొరుకునది కాదు. మిగుల వెలగలది. నీయందలి జాలిచే నీకిచ్చితిని. నీవు దీనిం దీసికొనిపోయి నీ కుటుంబమంతయు నెల్లకాలమును బోషించువానికే యిమ్ము పొమ్మని అతని కాకుసుమ మిచ్చి గుఱ్ఱమెక్కి మరల దారిం బడితిని.

ఆ మార్గము కొంతవరకు దూరుపుగాబోయి మరల నుత్తరమునకు మరలినది. అప్పుడు నేను బరిశీలించి అయ్యో! ఈ దారి మరల నుత్తరదిశకు గొనిపోవుచున్నది. అం దరణ్యమేకాని గ్రామములు లేవు. నే నెక్కడికి బోవలసియున్నదో నాకు దెలియకున్నది. నా ప్రాణనాయకుండెందున్నది ఎఱుంగరాదు. స్వప్నమునం జెప్పిన మహాదేవి మాటలనమ్మి యిట్లు గ్రుమ్మరుచుంటిని. దారితప్పి యిటు వచ్చితిని. వృద్ధబ్రాహ్మణుడు గనంబడినచోటనే వేరొక తెరవున్నది దానింబడిపోవలసినది అయినను మరల వెనుకకు బోనేల? ఈ మార్గముననే పోయి చూచెదనని పెక్కుగతుల దలపోసి యాదారినే గుఱ్ఱమును నడిపించితిని.

అట్లు సాయంకాలమువరకు నడిచినను జనపదం బేదియు గనంబడినదిగాదు. అప్పుడు మనంబు దిగులుపడి యోహో! ఇది మిగులయరణ్యప్రదేశము. ఇందు కౄరసత్వరములుండక మానవు. చీకటులు దెసల నాక్రమించుచున్నవి. శకుంతసంతానంబులు గురాయములకు జేరుచున్నయవి. నే నీఱేయి నెటుల వేగించుదాననో తెలియకున్నది. అయ్యో! నా కిట్టిచింత యేల జనింపవలయును ప్రాణత్యాగమునకు దెగించి యున్ననా కీమృగభీతి యేల? యెట్లయినను మేలేయగుంగాక అని మరల ధైర్యము దెచ్చుకొని యారాత్రి నివసింపదగు స్థల మరయుచు మరికొంతదూరము నడచితిని.

కోయపల్లెకథ

అంత నచ్చట పశువుల యార్పులు వినంబడినవి. దానింబట్టి యాప్రాంత మందెద్దియో పల్లె యున్నదని నిశ్చయించి యారొద అనుసరించి అల్లన అప్పల్లెలోనికి బోయితిని. అందున్న కోయదొరలందరు రక్కసులవంటివారే. నాడెద్దియో యుత్సవముచేయుచు నాబాలవృద్ధముగా నొకచావడిలో దీపము పెట్టి పెక్కురీతుల అడవివాద్యములు వాయించి మిక్కుటముగా ద్రాగి యాడుచుండిరి. వారిని జూచినంత నాగుండియ లవిసిపోయినవి. ఎట్టియాపదలోనున్నను మరణభీతి మాత్రము విడువదు సుడీ! వాండ్రు నన్ను జూడలేదు.