పుట:కాశీమజిలీకథలు -02.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనుని కథ

49

యట్లు మిమ్మెరుగక చెరబెట్టిరి గదా మఱియు దేవరకు గోరుచుట్టుపై రోకటిపోటునాటి నట్టి యార్తిపై దారుణంబగు నొకవార్త నెరింగించుచున్నవాడ వినుండు.

అల్లనా డడవిలో సింగపురొదవిని భయపడి చిత్రసేన సేనలంగూర్చుకొని తమయానతిలేకయే పురంబునకు బోవుచుండ నడుమదారిలో శబరసైన్యమెదురుపడి మనసైన్యమునంతయు బారదోలెను. మనభటులందరు బ్రాణభీతిచే దలయొకదారిని బారిపోయిరి. ఒక్కరితయే దిక్కుమాలియున్న యక్కలికిమిన్నను బల్లకీతోడనే వశము చేసికొని యక్కిరాతులు పోవుచుండ నేనదిజూచి యోర్వజాలక యొక్కరుండ నేమి సేయునని యించుక శంకింపక విడువుడు విడువుడు అని కేకలు వేయుచు వారివెంట బడితిని.

అప్పుడు నన్ను వాండ్రుపట్టుకొని రెక్కలుగట్టి యెచ్చటికో దీసికొని పోయిరి. కొన్నిదినములు నన్నెచ్చటనో దాచిదాచి తుద కీయూ రొకనాడు దీసికొనివచ్చి నన్నొకగృహస్తునికి విక్రయించిరి. ఆతఁడును నాకన్నము పెట్టుచు స్వేచ్చగా మాత్రము తిరుగనీయక నొక బందీగృహముననుంచి నిన్నటిదినమున నిచ్చటికి దీసికొనివచ్చెను. కారణమేమియో నాకు దెలియదు. దేవిగారినిసైత మీయూరే తీసికొనివచ్చినట్లు వాండ్ర మాటలవలన నూహించితిని. ఎచ్చటనున్నదియో నాకు దెలియదు. ఇంతపట్టు నా యెరింగినదని యాదూత చెప్పెను.

అప్పుడమ్మహారాజు మూర్ఛమునింగి నేలబడి యొక్కింతకు దెప్పిరిలి అయ్యో? నా ప్రేయసి యింటికి బోయి సుఖంబున్నదని యెంతయు సంతసించుచున్నవాడ అచ్చేడియయు నావలెనేయాతనము జెందుచున్నయది. కటకటా! కిరాతు లానాతి నెంతకష్టపెట్టిరో యిప్పుడెచ్చటనున్నదియో నాకైయెంత పరితపించుచండెనో అన్నన్నా పాపపువేటకారణంబునగదా యిన్ని యాపదలు తటస్థించినవి. దుర్నిమిత్తంబు లప్పుడే పొడగట్టినవి. శంకించుకొనియు మానితినిగాను. నాభాగధేయం బిట్లుండ మంచిబుద్ధి యేల పుట్టును? ఇప్పుడు చింతించుటకంటె కొంచపుపనిలేదు. లోకంబంతయు దైవాయత్తంబై యున్నది. గదా యతని యానతిలేక నేపనియు జరుగదు. తదనుగ్రహము గలిగెనేని ఇన్ని యాపదలు తృటిలో బాయగలవని ధైర్యము దెచ్చుకొని భక్తి పూర్వకముగా బరమేశ్వరుని ధ్యానించుచుండెను.

అప్పటి కర్ధరాత్రమైనది. అందరు నిద్రించుచున్నవారని తలంచి యందు గావలియున్న కళింగుడు పుళిందుడు ననువారలిట్లు సంభాషించుకొనిరి.

పుళిందుడు - కళింగా! యిటురమ్ము గ్రామవిశేషము లేమి? నీబావమరది పురసంరక్షకులలో నొక్కడగుటచే నీకు స్పష్టముగా దెలియును గదా. ఇచ్చటి వారందరు గాఢముగా నిద్రబోవుచున్న వారులే, మన మాటలను వినరు రహస్యములను జెప్పుకొనవచ్చును.