పుట:కాశీమజిలీకథలు -02.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భక్తురాలి కథ

123

గలుగుననునది కలలో వార్తయే యైనను జెప్పెద వినుండని యల్లన పికస్వరముతో నిట్లనియె.

దేవా! నేను రామచంద్రనగర ప్రభువైన శూరసేనమహారాజు కూఁతురను. నాపేరు తిలోత్తమ అందురు. నేను జంద్రలేఖ యనుదానితో మైత్రిఁజేసి అదియు నేను నొక్కనాఁడు మాపట్టణబాహ్యోద్యానవనంబునకుఁ గ్రీడార్థమయి అరగి అందు నిద్రించి యుండగా నన్నుఁ గొందరు దొంగలు మంచముతోఁగూడ నెత్తికొనిపోయి యొకఅరణ్యములోనికిఁ దీసికొనిపోయిరి. ఉదయంబున నేను లేచి చూచువరకు మహారణ్యమును దొంగలు మాత్రము గనంబడిరి. అప్పుడు నేను వెఱచుచు మీ రెవ్వరు నన్నేటికి దీసికొని వచ్చితిరి. మీకు గావలసినపని యేమనియడుగఁగా వాండ్రు వెఱవక నాతోనిట్లనిరి.

మేము దొంగలము. బలసింహుఁడు నీతో సహవాసముగాఁ దిరుగుచున్న చంద్రలేఖను మంచముతోఁ గూడ తనయొద్దకు దీసికొనిరండని పంపెను. మేమును మీ యిరువురిలో గురుతుఁబట్టలేక నిన్నుఁ దీసికొనిపోయితిమి. నిన్నుఁజూచి అతఁడు జడియుచు దీనిని మరలఁ దీసికొనిపోయి యథాస్థానమందుంచి రెండవదానిం దీసికొని రండని పంపెను. కాని మేము మరల నీ మంచము మోచుకొని పోవుచుండగా దారిలో రాజభటుల యలజడి తగిలినది. దానికి వెఱచి యాదారిని విడిచి యీయరణ్యములోనికిఁ దీసికొనివచ్చితిమి ఇక మేమింటికిఁ బోవుటకు వీలులేదు. నీమూలమున మా కాపురములకు నీళ్ళుపోసికొంటిమి. కావున నీదగ్గిరనున్న వస్తువులన్నియు మాకిచ్చివేయుము. నీ విది మొదలు మేము చెప్పినట్లు నడువుము. మేము నిన్నొకచోట కొనినట్లు చెప్పుదుము. ఎవ్వరేని ఆడిగినచో నట్లు చెప్పుదునని ప్రమాణము చేయుము. లేనిచో నిన్నిప్పుడే సంహరింతుమని పలుకఁగా విని నేను విభ్రాంతురాలనై విధినిదూరుచు నప్పుడు మఱేమియు జేయునది లేక ప్రాణమునందు గల దీపునుబట్టి వాండ్రు చెప్పినమాట లన్నింటికిని నొప్పుకొని ప్రమాణము చేసితిని. ఆ చోరులు నా మేననున్న నగలన్ని యు నప్పుడే లాగికొని కాలక్రమంబున నా అరణ్యము విడిచి పట్టణములలో సంచరింపఁ దొడంగిరి. నేనును వాండ్రతో బానిసవలె వెంటనంటి తిరుగుచుంటిని

ఇట్లు గ్రుమ్మరుచుండ నొకపట్టణములో నొకవర్తకుడు నన్ను జూచి యా చోరులతో నీ చిన్నది యెవ్వతె అని అడిగెను. వాండ్రువానితో దీని మేము పారశీకదేశములో వేయి బంగారునాణెములకు గొంటిమి. ఎవ్వరికేని గావలసినచో నమ్మి వేయుదుము. అని చెప్పగా విని యా వర్తకుడు మిగుల ధనము గలవాడు కావున నప్పుడే యాసొమ్మిచ్చి వేసి నన్నుజూచి బోటీ! నిన్ను నేను గొంటిని. నీవు వీరు చెప్పినట్టి దానవగుదువా! నీవేమేమి పనులు జేయుదువని నన్నడుగఁగా నంతకుమున్ను నేను వారితో ప్రమాణికముచేసి యున్నదాననగుట నామాటకు సమ్మతించి లోకగర్హితములు కాక సజ్జనసమ్మతములైన పనులన్నియు జేయుదునని పలికితిని.