పుట:కాశీమజిలీకథలు -02.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

కాశీమజిలీకథలు - రెండవభాగము

చెప్పెను. ఇట్టిఅర్థముగల నా మాటకు వెంటనే యుత్తరము చెప్పిన యితందెంత బుద్ధిమంతుఁడో యోచింపుఁడు.

ఇంత సూక్ష్మబుద్ధికి మంత్రిత్వమిచ్చుట నా తప్పా! చెప్పుడని పలుకుటయు సభ్యులెల్లరు తెల్లబోయి యుల్లంబుల వారిరువుర బుద్ధికౌశల్యమును గురించి వేతెరంగులఁ మెచ్చుకొనదొడంగిరి. వీరగుప్తుడు మంత్రియై క్రమక్రమముగఁ దనవిద్యా ప్రభావమంతయు ధర్మాంగదునికిఁ జూపుటయు నతండు మరియు సంతసించుచుఁ దన రాజ్య భారమంతయు వీరగుప్తునియందే యుంచి యతఁడు చెప్పునట్లుగాఁ దాను నడుచుచుండెను. వీరగుప్తుఁడు మంత్రియైనది మొదలు దేశములో సుభిక్షముగా ఫలవంతముగా పాడిపంటలు నభివృద్ధిగావించుటచేతను, బ్రజ లతనిని మిక్కిలిస్తోత్రములు చేయఁదొడంగిరి.

అని చెప్పువేళకు వేళ యతిక్రమించుటయు నప్పుడు చెప్పుట మాని యయ్యతిశిఖామణి యవ్వలికథ తదనంతరావసథంబున నిట్లని చెప్పం దొడంగెను.

16వ మజిలీ

భక్తురాలి కథ

పట్టీ! వినుమట్లు చంద్రలేఖ వీరగుప్తాభిధానముతో ధర్మాంగదునిమంత్రిగా నుండి యొకనాడు నగరాలోకనకౌతుకంబు మీర నుచితపరివారముతో బట్టణమంతయు గుమ్మరుచుండ నొకవీథిదండను వాసంతికకోకిలకాకిలీనాదమును మేలమాడు కంఠస్వరముతో బాడుచున్న యొకచిన్నదాని గానము విననయ్యె. అగ్గానము చెవియొగ్గి విని చిత్తమునీరైపోవ నెద్దియో నిరూపింపనలవికాని యుత్సాహ మొకటి మనంబునం జనింప నిలిచిపరిచారకుం బిలిచి యోరీ! యీప్రాంతమందెచ్చటనో సంగీతము పాడుచున్నట్లు వినంబడుచున్నది. యరసిరమ్మని పంపిన వాడును బోయి సత్వరమువచ్చి అయ్యా! యీచేరువ దారకేశ్వరుని యాలయమున్నది యందొక భక్తురాలు పాడుచున్నదని చెప్పెను.

అప్పుడతండు మనమచ్చటికి బోవచ్చునా అని అడుగుటయు వాడు స్వామీ! సంశయమేల? దేవాలయమునకు బోవుట కెవ్వరి యానతి కావలయును? అదియును మనయధికారమునకు లోబడినదే. సందియము వలదు. రండుపోదము. ఎద్దియేని తలంచుకొని యాస్వామికి మీదుగట్టినచో దప్పక యాకార్యము కాగలదు. ఈ తారకేశ్వరునికి మ్రొక్కులు చెల్లించుటకుం బెక్కు దేశములనుండి ప్రజలువత్తురు. మీరు చూడదగినదేయనిన సంతసించుచు మంత్రి యాయాలయము లోనికి బోయెను. అచ్చట