Jump to content

పుట:కాశీమజిలీకథలు-11.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

కాశీమజిలీ కథలు - పదునొకండవ భాగము


253 వ మజిలి

సుమతి ప్రమతుల కథ

మరునాడు కౌశికుం డుపాధ్యాయునికడకువచ్చి గురువరా! ఈ యూరిపాఱు లెట్టివారో చూచితిరా ? కాళిదాసకవి మనయింట గుడిచెనని మనకు వెలివేసిరట. విద్యార్థుల కెవ్వరికి వారమియ్యక పొమ్మనిరి. జ్ఞానతీర్థుల నెవ్వరు భిక్షకు బిలువ మింజేసీ నేటి తరువాత నాతడీయూరు విడిచి యెందేనిం బోయెనట. సభాపతి యీ యూరి విప్రుల కందఱకు మన యింటికిం బోవలదని తెలియజేసెనట. రచ్చలయందు గూర్చుండి మనల నాక్షేపించుచున్నారట. మన మిప్పుడేమి చేయవలయునో తెలియ దని చెప్పిన నాశ్రోత్రియుం డిట్లనియె.

ఔను. అతి గూఢమైన యా మహాత్మునిప్రభావ మెవ్వరికి దెలియగలదు? వారిశక్తి దెలిసిన పిమ్మట నా కించుకయు విచారములేకయున్నది. మనల వెలివేసి యేమిచేయగలను ? విద్యార్థు లందరు మా యింటనే కుడుతురుగాక, మీ రేమియు భయపడవలదని యభయహన్త మిచ్చెను. నాటినుండియు నంతే వాసు లందే భుజింపు చుండిరి.

బ్రాహ్మణాశీర్వాద మమోఘముకదా ! కొన్నిదినముల కతని యిల్లాలు చూలాలై శుభలగ్నంబున దివ్యతేజస్సమన్వితుం డగు పుత్రుం గనినది. మరియు గాలక్రమంబున మరియొక కుమారుఁడును నాడుపిల్లయు నామె కుదయించిరి. పెద్ద వానికి సుమతియనియు రెండవవానికి ప్రమతియనియు నాడుపిల్లకు బితృదత్తయనియు నామకరణములు వ్రాసిరి. దేవతా శిశువులవలె నా బిడ్డలు మువ్వురు నిరతిశయ సౌందర్యకళా విభ్రాజితులై బాలక్రీడల తలిదండ్రుల మిక్కిలి యానందము గలుగ జేసిరి. ఆ బిడ్డల తేజము బ్రాహ్మణ్యము మూర్తీభవించినట్లు మెఱయుచు జూపరకు వెరగు గలుగ జేయుచుండెను.

పితృదత్త బాలికయై యచ్చరపోలిక మెఱయుచున్నది. యౌవనంబున నెట్టిసోయగపు విలాసములు గలిగియుండునో యని ప్రజలక్కజ పడజొచ్చిరి. అగ్నీశిఖుడు యధాకాలమున బుత్రులకు నుపనయనము గావించి యథ్యయనము చెప్పుచుండెను. అక్కుమారు లిరువురు సులభముగా విద్యలు గ్రహింపుచుండిరి. యముడు కృతాకృతంబులు విచారింపడు. పెద్దవానికి పదమూడేడులు ముగియక మున్నె యగ్నిశిఖుండు పరలోక మలంకరించెను. దేవదత్త పుత్రప్రేమ యించు కయు లెక్క సేయక భర్తతో సహగమనము చేసి నాకములో గలిసికొనినది. వారి కప్పటికిని వెలితీఱలేదు. ఎవ్వరు వారింటికి రారు. వారి నెవ్వరు బిలువరు. అగ్నిమిత్రుడను బ్రాహ్మణుండు పితృసఖుం డగుట దిక్కులేని యా మువ్వురు బిడ్డలసేమ మరయుచు వారిని గులములో గలుపుకొనుమని సభాపతికి తెలియ జేయు