పుట:కాశీమజిలీకథలు-05.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

97

ద్వితీయుడు - అగునగుఁ దేజమొక్కటియే కాదు. గుణములు సైత మపూర్వములై కనంబడుచున్నవి. యయాతిరీతి నిచ్చుచున్నాఁడు గదా! అర్థజ్ఞానసంపత్తితో బృహస్పతిగతి సంభాషించుచున్నాఁడు శర్వుండువోలె నన్నియుం దానే తెలిసికొనుచున్నాఁడు యేమి చిత్రము.

తృతీయుడు :- మీ మాటలు యథార్ధములె అనన్యజనసామాన్యము లైనవి తరణపౌరుసశౌర్యధైర్యాది గుణములచే నీతండు పరమపురుషుండులాగున దోచుచున్నాడు.

చతుర్ధుండు :- మరియొక యద్భుతము గనంబడుచున్నది. కనిపెట్టితిరా ?

ప్ర :- అదియేమి.

చ :- ఇతండు సింహాసన మెక్కినది మొదలు ఋతువ్యతిరిక్తకాలంబునం దరువులు ఫలించుచున్నవి. మరియు గోవులు నెక్కుడుగా బాలిచ్చుచున్నయవి తలంచినప్పుడు వానలు గురియుచున్నవి సుఁడీ.

ప్ర :- అగునగు నదిమొదలు తగవులు నినంబడమిజేసి ప్రజలు ధర్మరతు లైరని తలంచెదను.

ద్వి :- ఇదియంతయు నీ మహారాజుగారి ప్రభావమే యని నిశ్చయింప వచ్చును.

ప్ర :- సందేహమేల

తృ :- ఇతండు సమసి పరలోకంబున నెవ్వరివలననేని వరములంది రాలేదు కదా.

ప్ర :- కాదు కాదు. పరకాయప్రవేశవిద్యానిపుణుడైన మహాత్ముడెవ్వడో వీని దేహమందు ప్రవేశించెనని తలంచెదను.

ద్వి :- అగు. జక్కగా గ్రహించితివి. కానిచో జచ్చినమనుజుం డెన్నడైనను జీవించునా?

తృ :- రాత్రి రెండుజాములవేళ వేటాడుచు జెట్టుక్రింద మూర్ఛనొంది పడెనని కింకరు లెరింగింప దేవీసహితులమై మనమందఱము పోయి చూచువఱకు దెల్లవారుచున్నది. పిమ్మట రాజపత్నుల శోకమోహములతో రెండుయాయములైనది. నే నతని దేహమంతయుం బరీక్షించి చూచినాను. శవమై మిక్కిలి విపరీతముగా గనంబడెను.

ద్వి :- కన్నులు తెల్లబడి చూచువారికి వెరపు గరపుచు మోము కళదప్పి యుండలేదా? యిది పరకాయప్రవేశలక్షణమే కానిచో నట్టివాడు తిరుగ జీవించుట కలలో వార్త గదా.