పుట:కాశీమజిలీకథలు-05.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

కాశీమజిలీకథలు - ఐదవభాగము

యతివర్యా! నీకట్ల యుచితంబా మహాత్ములు శూరులు ధనస్సు నందువలెఁ గుటిలునియందుసైతము గుణము నారోపింతురు గదా మరియు లోకవిరుద్దంబగు కృత్యంబు శుద్ధమైనదైనను నాచరింప నిష్టములేకున్నయది. నన్ను బ్రతికించుట నీకేమి యబ్బురము భూతజాలము నెల్ల సంహరించి వెండియు సృష్టించు సామర్ధ్యము నీకుఁ గలిగియున్నది. నీ ప్రభావము నేనెరుంగుదును అయినను సంకల్పించిన వ్రతమును జీవితాంశం జేసి విడిచితినేని నిందాపాత్రుండ నగుదును. కావున న న్ననుగ్రహింప దలంచితివేని జన్మతారకఁబగు బ్రహ్మ ముపదేశించి కృతార్థునిం గావింపుము. పండితవర్యా! మండనమిశ్రుని ప్రఖ్యాతిని నీవును వినియుందువు. అతండు మదీయశిష్యుండే కాని నాకంటే నెక్కుడు విద్వాంసుం డయ్యెను. వైదికకర్మతత్పరుఁడై ప్రవృత్తిశాస్త్రములయందే నిరతుండై యుండెను. నివృత్తిశాస్త్రములయం దేమియు నా శక్తి లేదు. అతనియొద్దకుం జని వానిం జయించి వశంవదునిగాఁ జేసికొనుము. లోకమంతయు నీ చేతిలోని దగును. అతని భార్యయు మిగుల విద్వాంసురాలు. సరస్వతి యనియే తెలిసికొనుము. ఆమెను మధ్యవర్తినిఁగాఁ జేసికొని వాదమునకుఁ బూనుకొని జయించి యతనిచేతనే నీ భాష్యమునకు వార్తికములఁ జేయింపుము. కాశికాపురంబున విశ్వనాథుండువోలెఁ గాలంబున వచ్చితివి. తారకోపదేశము జేయము. కృపాత్మా! ముహూర్తకాలం బిందు వసియింపుము. యోగిధ్యేమగు నీ రూపముఁ జూచుచుఁ బ్రాణంబుల విడిచి కైవల్యంబందెదనని పలుకఁగా శ్రీ శంకరుం డంతఃకరణమున గరుణ యుప్పొంగ నమిద్ధసుఖప్రకాశమగు బ్రహ్మ ముపదేశించి మోహవిముక్తునిం జేసెను.

తదీయ సంవాదమాకర్ణించు నాడు గన వీతహోత్రుం డంతవరకు దహించుటమాని తద్బ్రహ్మోపదేశానంతరమున నొక్క మారత్తుషరాశిం బ్రజ్వరిల్లం జేయుటయు నా భట్టపాదుండు మాటాడుట యుడిగి కన్నుల మూసికొని చిత్తంబున నద్వైతతత్త్యధ్యానంబు సేయుచు మమతామోహశూన్యుండై బంధముల విడిచి కైవల్యము నొందెను. శ్రీ శంకరాచార్యుండును భట్టపాదునట్లు ముక్తినొందించి మాహిష్మతీనగర గమనోన్ముఖుండయ్యెను.

అని యెఱింగించి మణిసిద్దుం డప్పటికి కాలాతీతమగుట దదనంతరోదంత మవ్వలి మజిలీ యందిటులఁ జెప్ప దొడంగెను.