పుట:కాశీమజిలీకథలు-05.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

41

ఆ మాట విని యామె యతనిదైన్యము సహింపనోపక పుత్త్రుండెట్లైన బ్రతికి యుండినం జాలునని నిశ్చయించుకొని, "పుత్త్రా! నీకు సన్యాసమున కాజ్ఞయిచ్చితిని. పరమానందమును బొందుము. ఆ మకరమునకు సైతము నీ మతమే యిష్టమైనది కాఁబోలు. నిఁక నిలువనేల? వేగర"మ్మని పలుకఁగావిని శంకరుండాజలాంతరముననే మనసుచేత సన్యసించి యల్లననానక్రముఖమునుండి తప్పించుకొని భవబంధవిముక్తుండు వోలె నవలీలందీరంబుఁజేరి తల్లికి నమస్కరించెను.

సతీదేవి బాష్పజలములచే సన్యాసస్వీకారమున కభిషేకము చేయుచున్నది వోలె నతని శిరంబు దడుపుచుఁ దండ్రీ! మకర దంష్ట్రలు సోకి నీ యొడలెంత బడలినదోకదా. అయ్యయ్యో! అయ్యార్తి నెట్లు సైరించితివి. నీరేమైనం ద్రాగితివా యింటికిఁ బోవుదమురమ్ము. వైద్యుల రప్పించి తగిన చికిత్సం జేయించెదనని పలుకఁగా నవ్వుచు శంకరుం డిట్లనియె

శం — జననీ నీ యాజ్ఞచే నేను మానవసన్యాసము స్వీకరించితిని. ఇఁక నేనింటికి రాను. యతికిఁ గర్తవ్యమేదియో యది నాకుపదేశింపుము.

తల్లి - నీవు సన్యాసివై పోవుచుండ నన్ను రక్షించువారెవ్వరు! నాకేమి గతిఁజూపి యరిగెదవు?

శం — మదీయ పైతృకధనం బెవ్వరు దీసికొనుటకుఁ గర్తలో వారలే నిన్ను రక్షించుచుందురు.

తల్లి — ఓహో మంచిదారిఁజూపితివి. మదీయదేహపాతము ఫలహేతువుగాఁ జూచు జ్ఞాతులా నన్నురక్షించువారు? అన్నన్నా శంకరా యింతనిర్దయుండవైతివేమి. వ్యాధిపీడిత నయ్యెదనేని నన్నెవ్వరుజూతురు? నాకౌర్ధ్వ దైహిక క్రియలు గావించు వారెవ్వరు?

శం - రోగము వచ్చినప్పు డనువారములును మరణానంతరమున నపరసంస్కారమును దాయాదులే చేయుదురు అట్లు చేయనిచో లోకాపవాదను బొందరా!

తల్లి - లోకులకు వెరచిచేయు దాయాదుల యుపచారములు నాకుఁ బ్రీతి కరముగా నుండునా? నీవంటి పుత్త్రునింబడిసియు నీవలన సంస్కారమును బొందక యనాథవలె నే నెవ్వరిచేతనో సంస్కారమును బొందవలసినదా? కటకట? యెంత పాపాత్మురాలనైతిని.

శం — అమ్మా! నీకట్టి కోరిక యుండినచోఁ బ్రాణోత్క్రమణసమయంబున నన్నుఁదలంచుకొనుము. ఎంత దూరములో నున్నను యోగబలంబున దెలిసికొని వచ్చి నీ దేహసంస్కారము గావింతును.