పుట:కాశీమజిలీకథలు-05.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

335


జండాలజాత్యనుచితములైన యాబోఁటి మాటలాలించి విస్మయము జెందుచుఁ జుగుప్ప విడిచి జీవితాశచే క్షుత్పిపాసోపశమనమునకై యశనక్రియ నంగీకరించితిని. మౌనము మాత్రము విడువలేదు.

అట్లు కొంతకాలము జరిగినంత నేను తరుణత్వము వహించిన పిమ్మట నొకనాఁడు ప్రాతఃకాలమున నిద్రలేచి చూచినంత నాదారుపంజర మేమైనదో తెలియదు. నేనీ బంగారుపంజరములో నుంటిని. ఆ కన్యక యిట్టిదివ్యరూపము గలదై యొప్పెను. దేవర జూచియే యున్నారుగదా! మరియు నామాలపల్లి యమరనగరసమానమై ప్రకాశించుచుండఁ జూచి నేను పుల్కనపురవాసపరితాపము విడిచి యాశ్చర్యమందుచు నిది యేమని మౌనము విడిచి యప్పఁడతి నడుగుదమని యెంతలో దలంచుచుంటినో యంతలో నీకాంతారత్నము నన్నిక్కడికిఁ దీసికొని వచ్చినది.

మహారాజా! ఈ సరోజానన యెవ్వతెయో యెందులకై యిట్లు చండాలరూపత్వము ప్రకటించినదో నన్నెందులకుఁ బట్టించినదో ఇప్పుడు న న్నిక్కడి కేమిటికిఁ దీసికొనివచ్చినదో నాకేమియుం దెలియకున్నది. దేవరవోలె నీకథ వినుటకు నేనుగూడ నుత్సుకము గలిగియుంటినని యా చిలుక చెప్పినది.

ఆ కథ యంతయును విని యమ్మహారాజు ఆ వార్త వినుటకు మిక్కిలి కుతూహలము గలవాఁడై వాకిటనున్న యా మాతంగకన్యం దీసికొనిరమ్మని ప్రతీహారి కాజ్ఞాపించెను. అదివోయి యిటు ర మ్మిటు రమ్మని పలుకుచు నా కలికిం దీసికొనివచ్చి యెదుర నిలిపినది అప్పు డావాల్గంటి భూమినంటకయే నిలువంబడి తన తేజంబున నన్నృపునిఁ బరాభవింపుచుఁ బ్రౌఢముగా నిట్లు పలికినది.

భువనభూషణ! రోహిణీనాథ! తారారమణ! కాదంబరీలోచనానందచంద్ర! ఈ దుష్టుఁడు తనయొక్కయు మీయొక్కయు వృత్తాంతమంతయు మీకు వినిపించెం గదా? జాబాలియాశ్రమము విడువవలదని తండ్రిగారిచే నియమింపబడియుఁ దదాజ్ఞ నుల్లంఘించి కామరాగాంధుండై మహాశ్వేతయొద్దకుఁ బ్రయాణమైనవార్తయు మీకు విదితమే.

నే నీదురాత్ముని గన్నతల్లిని, మహాలక్ష్మిని. వధూదర్శనోత్సుకుండై యరుగుచున్న కుమారుని దుర్వృత్తి దివ్యదృష్టింజూచి శ్వేతకేతుఁడు నన్నుంజీరి నీ పుత్రుం డింకను నధోగతిం బొందునట్లు తోచుచున్నది. పశ్చాత్తాపంబునంగాని వాని చిత్తవృత్తి యుపశాంతి వహింపదు. నీవు వోయి వానికిఁ గర్మపరిపక్వ మగుదనుక నొకచోటఁ గట్టిపెట్టి యనుతాపము గలుగునట్లు చేయుము. వేగమ బొమ్మని యాజ్ఞాపించుటయు నేనీ కల్పన యంతయుం గాంచితిని.