పుట:కాశీమజిలీకథలు-05.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

326

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మరునాఁడుదయంబున నూత్నతేజంబుతో నొప్పుచున్న చందాపీడునిం జూచి వెరగందుచుఁ గాదంబరి మదనలేఖతో నాతీ! యీతని మేనికాంతి యెంతవింతగా నున్నదియో చూచితివా? ప్రేమాతిశయంబున నాకే యిట్లుతోచుచున్నదేమో! నీవు గూడ విమర్శించి చూడుమని పలికిన విని మదనలేఖ యిట్లనియె.

రాజపుత్రీ! ఇందు నిరూపింపవలసిన దేమియున్నది. యీపనికిం జైతన్య మొండు కొరంతగా నున్నది. కాని యథాస్థితిగానే యున్నవాఁడు కపింజలుఁడు చెప్పిన మాట యథార్ధమని దీన స్పష్టమగుచున్న యది లేనిచో మృతుండైనవాఁ డిట్లుండుట యెందేనిం జూచియుంటిమా? ఇది శాపదోషముకాక మఱియొండు కాదని పలికి యక్కలికి నూరడించెను కాదంబరియుఁ బ్రతిదినము చంద్రాపీడమూర్తిని దేవతా విగ్రహమునట్లు త్రికాలములయందుఁ బూజింపుచు ధృతవ్రతయై శాపావసానకాల మరయుచుండెను.

మరికొన్ని దినంబులకుఁ దారాపీడుఁడు చారముఖంబుగాఁ దద్వృత్తాంత మంతయును విని మిక్కిలి పరితపించుచు మనోరమా శుకనాశు లనుగమింప విలాసవతింగూడి యుచిత పరివారములతో నయ్యాశ్రమమునకుఁబోయి యందు జంద్రాపీడుని యవస్థంజూచి పెద్దయుంబ్రొద్దు జంతించి శాపప్రకారమంతయు వినియున్నవాఁడు కావున నెట్టకే శుకనాశునిచే బోధింపఁబడి వైరాగ్యమును వహించి రాజ్యభారము మంత్రులయం దుంచి భార్యతోగూడ నా ప్రాంతమందున్న వనములో మునివృత్తిబూని కాలక్షేపము చేయుచుండెను.

అనిచెప్పి జాబాలి పక్కునవ్వి హారీతప్రముఖులగు మునులతో ననఘులారా! యాకథారసం బెంత వింతగా నున్నదియో వింటిరా? వక్తవ్యాంశమును విడిచి యతిదూరము చెప్పుకొని పోయితిని.

వినుం డాపుండరీకుండు కామోపహతచిత్తుండై తాను జేసిన యవినయదోషంబున దివ్యలోకమునకుఁ జెడి పుడమియందు శుకనాస తనయుండైన వైశంపాయనుఁడుగా జనియించెను.

వెండియు నతండు మహాశ్వేతచే శపియింపబడి యిట్లు చిలుక యోని యందు జనియించెనని యెఱింగించినంత నాకప్పుడు నిద్ర మేల్కాంచినట్లుగా జాతిస్మరణగలిగి బూర్వజన్మోపాత్తవిద్య లన్నియును స్ఫురించినవి మనుజుండువోలె స్పష్టముగా మాట్లాడుటయు సర్వవస్తుజ్ఞానము విద్యోపదేశకౌశలము మిక్కుటముగా లభించినది పెక్కేల? శరీర మొక్కండుదక్క తక్కిన చర్యలన్నియు మనుష్యుండు వలెనే చేయసామర్ధ్యము గలిగినది. అట్టి జ్ఞానము గలిగి నిజవినయశ్రవణంబునఁ గలి