పుట:కాశీమజిలీకథలు-05.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అప్పుడు మహాశ్వేత విస్మయముతో నీశారిక యేమనుచున్నదని మదనలేఖ నడిగిన నప్పడఁతి యిట్లనియె. దేవీ? యీశారికను గాళింది యను పేరుపెట్టి మా రాజపుత్రికయే పెంచుచుఁ బరిహాసమను పేరుగల యీ చిలుకకు స్వయముగాఁ బెండ్లి జేసి భార్యాభర్తలగాఁ బిలుచుచున్నది. నేఁటి ప్రాతఃకాలమునఁ గాదంబరీ తాంబూలకరండవాహిని యగు నీ తమాలికతో నేకాంతముగా నేదియో మాటాడుచుండ నా చిలుక జూచినదఁట. అప్పటినుండియు నిర్ష్యారోషకషాయితమతియై యీశారిక యీచిలుకం జూడదు. మాటాడదు చేరనీయదు. మేమెంత బ్రతిమాలినను బ్రసన్నురాలు కాకున్న దిదియే దీని వృత్తాంతమని చెప్పిన విని మందహాసము గావించుచుఁ జంద్రాపీడుఁ డిట్లనియె.

అగు నగు నీవార్త నిదివరకే మేము వినియుంటిమి. కాదంబరీదేవియొక్క తాంబూలకరండవాహినియగు తమాలికను వరించి పరిహాసమను చిలుక విరహవేదన చెందుచున్నదని లోకమున జనులు చిత్రముగాఁ జెప్పుకొనుచున్నారు. ఈ వృత్తాంతము కర్ణపరంపరచే రాజకుల మంతయు వ్యాపించియున్నది. సిగ్గుమాలిన యీ తమాలిక మూలమున పతత్రము కళత్రమును విడుచుట వామాచారమై యున్నది. అది యట్లుండ నిండచపలయగు నీదుష్టదాసినిఁ గాదంబరి యేమిటికి మందలింపదు? అగు నీశారిక నీ చిలుకకుఁ బెండ్లిజేయునప్పు డెన్నియో బుద్దులు గరపియే యుండునవి నిలిచియున్నవియా? స్త్రీలకు సాపత్నీపరిభవంబు ప్రధానకోపకారణంబు పెద్ద హేతువుగదా? ఇట్టి పరాభవములయందుఁ దఱుచు స్త్రీలు విషమైనం దిందురు. అగ్నినైనం బడుదురు. ఈశారిక గట్టిదియే! అట్టిపని యేదియుం జేయలేదు. ఇప్పుడు మనమీ చిలుకచే నీ తప్పు గావుమని దీనిం బ్రతిమాలింపఁ జేయుదము. అప్పుడు ప్రసన్నురాలై భర్తను మన్నించుగాక అట్లు మన్నింపదేని యీశారికదే తప్పుగా గణించి దీని విడిచివేయుదము పరాభవము జేసి విడిచిన దీని నెవ్వరాలాపింతురు? యెవ్వరు మన్నింతురు? ఎవ్వరు పోషింతురు? అదియే దీనికిఁ బ్రాయశ్చిత్తమని పలికిన విని కాదంబరీ పరిచారికలెల్లఁ దత్క్రీడాలాపము గ్రహించి నవ్వుకొనిరి.

అప్పుడా చిలుక యతని నర్మాలాపము లాలించి యిట్లు పలికినది. దూర్త! రాజపుత్రా! యీశారిక రాజకులసంపర్కమువలనఁ జతురమతియై యున్నది. నీవుగాని, యితరులుగాని దీనిని భయపెట్టజాలరు. ఇవి పరిహాసజల్పిదములని తెలిసికొనఁగలదు. ఈ వక్రోక్తులు దీనిముందరఁ బనికిరావు. కోపప్రసాదములయొక్క కాలకారణప్రమాణవిషయంబులఁ బాగుగా నెరుంగును. శృంగారభాషితముల కిది నెలవని పలుకుచున్న సమయంబునఁ గంచుకి యరుదెంచి ఆయుష్మతీ! మహాశ్వేతా! చిత్రరథుండును భార్య మదిరామహాదేవియు నీరాక విని మిగుల నానందించుచున్నారు. నీతో ముచ్చటించుటకుఁ దొందరపడుచు వేగఁ దీసికొని రమ్మనిరని పలికినది.

అప్పుడు మహాశ్వేత కాదంబరీ! నేను నీ తలిదండ్రులఁ జూడఁబోవు