పుట:కాశీమజిలీకథలు-05.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

కాశీమజిలీకథలు - ఐదవభాగము

ఆ శిశువును గ్రహించి యాలక్ష్మి దేవా? యీతండు నీకుమారుండు గైకొనుమని పలుకుచు వాని నాశ్వేతకేతున కిచ్చినది. అమ్మునియు బాలజనోచితకృత్యములన్నియు వానికి నిర్వర్తించి యాతండు పుండరీకమునం బుట్టుటచేఁ బుండరీకుఁడని నామకరణముచేసి యతనికి సమస్తవిద్యలను నేర్పెను. ఆ శ్వేతకేతుసూనుండే యీతండు. మరియు నీ కుసుమగుచ్చము క్షీరసముద్రజాతమగు పారుజాతతరువునం బుట్టినది. పత్రవిరుద్ధముగా నీపూవీతని శ్రవణసంగత మెట్లయ్యెనదియుం జెప్పెద నాకర్ణింపుము. ఈ దివసము చతుర్దశియని యీతండును నేనును దేవలోకమునుండి కైలాసగతుఁడగు శితికంఠు నారాధించుటకై నందనవనము మీదుగా బోవుచుంటిమి.

అప్పుడా నందనవనలక్ష్మి యీ పారిజాతమంజరిని హస్తమున ధరించి వచ్చి యీతనికి మ్రొక్కుచు నిట్లనియె ఆర్యా! త్రిభువనదర్శనాభిరామమగు నీ రూపమున కిది యనురూపమైనది. దీని శ్రవణావసంతముగాఁ దాల్చుము పారిజాతము, జన్మము సాద్గుణ్యము నొందునని పలుకగా నితం డాత్మస్తుతివాదమునకు లజ్జించుచుఁ గన్నులు మూసికొని యామెమాటఁ బాటింపక నడువఁదొడంగెను.

అప్పుడాదేవియు నీపూవుందాల్చి విడువక వెంట వచ్చుచుండుటఁ జూచి, నేను మిత్రుఁడా? దీన దోష మేమి? యిది యద్దేవి యనుగ్రహపరిగ్రహముకాదా! గైకొనుమని పలుకుచు నితం డిచ్చగింపకున్నను నేనుఁ బుచ్చుకొని బలాత్కారముగా దీని నతని శ్రవణాభరణముగా నిడితిని ఇదియే దీని వృత్తాంతమని చెప్పి యతండూరకుండెను.

పిమ్మట నప్పుండరీకుఁడు మందహాసోపశోభితవదనారవిందుఁడై నన్నుఁ జూచి కామినీమణి! నీకీ ప్రశ్నాయానముతోఁ బనియేమి? కావలసినచో నీ పుష్ప గుచ్ఛమును బుచ్చుకొమ్మని పలుకుచుఁ దన చెవియందున్న లతాంతమును దీసి నా శ్రవణపుటంబున నుంచెను.

నాకప్పుడు తత్కరతలస్పర్శలోభంబునంజేసి యవతంసస్తానమున నా పూవు రెండవ హృదయములాగున దోచినది. అతండును మత్కపోలతలస్పర్శసుఖంబున వడంకుచున్న కరతలంబునుండి జారిపడిన జపమాలికను సైతము సిగ్గుచేత గురు తెరుంగడు.

నేనప్పుడా జపమాలికను నేలంబడకుండ గ్రహించి విలాసముగాఁ దద్బుజపాశములచేఁ గూర్పఁబడిన కంఠగ్రహసుఖం బనుభవించుదానివలెఁ గంఠాభరణముగా మెడలో వైచుకొంటిని.

అట్టి సమయమున ఛత్రగ్రాహిణి నాయొద్దకు వచ్చి రాజపుత్రీ! మీతల్లి స్నానము జేసినది. ఇంటికిఁబోవు సమయమగుచున్నది. కావున వేగమ స్నానము చేయుమని పలికినది. ఆమాట విని నేను గుండె దిగ్గుమన నిష్టములేకున్నను నతిప్రయ