పుట:కాశీమజిలీకథలు-05.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

147

    యతులు పరకృత మఠదేవతాలయములఁ
    దిరుగుచుందురు మమతా విధేయులగుచు.

క. యతి కేమిగావలయు సం
   యతమే సౌఖ్యంబు పూజ్యులగు శిష్యజనుల్
   సుతలాత్మగతి కళత్రం
   బతిశయముగ దనువే గేహమై యొప్పంగన్.

గీ. కామవశునకు దుఃఖంబె కాని సుఖము
   లేశమైనను దలపోయలేదు లేదు
   పురుషునకుగానను విరక్తిఁ బూనవలయు
   దానఁ గలిగెడు సౌఖ్య మెద్దానలేదు.

వ. మహాత్మా ! అధ్యాత్మతత్త్వవేత్తలగు మీ వంటివారు యదృచ్ఛాలాభ సంతుష్టి నొందుచు గులశీలనామంబుల దెలియనీయక యజ్ఞజడమూకనులభాతి దోచుచు బరోపకారమునకే తీర్థాటనంబు గావింతురు. కాని తీర్థయాత్రవలన నించుకయుఁ బ్రయోజనంబు మీకు లేదు. విశేషించి తీర్థములే మీ పాదరేణువులు సోకి పవిత్రము లగుచుండును. మీరు కొన్ని దినంబు లిందుండుఁడు. భవదీయ దర్శన లాభంబునఁ బాపంబులంబాసి యభీష్ట సుఖంబులనొందఁ గలమని పలికిన విని పద్మపాదుండు వారి కిట్లనియె.

గీ. ఆకలియు దప్పిగొనుచు మధ్యాహ్నవేళ
   నన్న మిడియెడు సుకృతి యెందున్నవాఁ డ
   టంచు నతిధులు వెసనే గృహస్థుఁజేరి
   తృప్తివడయుదు రతని సతింపవశమె.

ఉ. స్నానముఁజేసి యగ్ని పరిచర్య నొనర్చుచు వేళలందుఁ గౌ
    పీనము దాల్చి వేదము జపించుచు దండము చేతఁబూని వి
    ద్యానిధి బ్రహ్మచారి జఠరాగ్ని జ్వలింపఁగ భిక్షఁగోరి యె
    వ్వాని గృహంబుజేరుఁ దలపన్మరి యట్టి గృహస్తుఁ డల్పుడే.

శా. వైరాగ్యంబు దృఢంబుఁజేసి పరతత్త్వజ్ఞానసంయుక్తి సం
    సారంబున్మదిరోసి క్రమ్మరెడు నా సన్యాసియున్నిష్ఠి నోం
    కారంబుం జపియించుచు నృతతమున్ ఘస్రార్థభాగంబునం
    జేరుంగాదె గృహస్థునింటి కుదరార్చిష్మచ్చిఖల్వెల్గఁగాన్.

గీ. వసుధ నెవ్వని యెన్నంబు వలనఁ దనువు
   బలియఁ దపమాచరించుఁ దాపసజనంబు