పుట:కాశీమజిలీకథలు-05.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

127

హస్తామాలకుని కథ

పిమ్మట దన కుమారునిసైత మతని పాదంబులకు నమస్కరింపజేసెను. అప్పుడు శంకరుం డతని లేవనెత్తుచు నాదరముగా నాగమనకారణం బడిగిన నతం డిట్లనియె. ఆర్యా! వీడు నా కుమారుండు వీనికి బదమూడేండ్లు దాటినవి. వీడు పుట్టిననాటంగోలె నిట్లే యుండెను. ఎవ్వరితో నేమియు మాటాడడు. ఎవ్వడు పల్కరించినను బల్కడు. మందమతియై యెద్దియో ధ్యానించునట్లుండును. రూపము తేజము నద్భుతమై యున్నవి. మొగముజూడ జంద్రబింబమును దిరస్కరింపుచున్నది. ఇది గ్రహదోషమో స్వభావమో పూర్వకర్మప్రారబ్దమో యున్మత్తవికారమో తెలియదు. వీని కక్షరాభ్యాసమైనం జేయలేదు. చదువుమాట చెప్పనేమి యున్నది. ఉపనయనసంస్కారము మాత్రము గావించితిని. ఆడుకొనుటకు బాలురు పిలిచినను వెళ్ళడు. వాండ్రు వీనింగొట్టినను గోపము జెందడు. వాని కిష్టమైనప్పు డెప్పుడో భుజించును. చెప్పినట్లు చేయడని వానిపై నాకు గోపము వచ్చును గాని కొట్టుటకు జేతులురావు. లేక లేక నా కీకొమరుండు గలిగె నిది యేమి పాపమో తెలియదు. ఎన్నియో వైద్యములు చేయించితిని. ఎన్నియో రక్షలు గట్టించితిని ఎన్నియో జపములు చేయించితిని యెందరికో సిద్ధులకు జూపించితిని. ఏ క్రియవలన నేసిద్ధుని వలనను నుపయోగము లేకపోయినది. నీవు పరోపకారపారీణుండవు. దయాళుండవని వింటిని. మృతుండైన విప్రకుమారుని బ్రతికించితివట. నీ చర్య లద్భుతముగా జెప్పుకొనుచున్నారు. నీ కటాక్షలేశము వీనిపయిం బ్రసరింపజేసితివయేని వీని మాంద్యము సడలిపోవును. మహాత్మా! వీని శిష్యునిగా ననుగ్రహింపుమని యనేకప్రకారముల బార్ధించి వాని నయ్యతిపతి పాదంబుల వెండియుం బడవైచెను.

అప్పుడు శంకరాచార్యుండు దయామేదురములగు దృష్టులు వానిపై బరగింపుచు శిరంబున జేయిడి, డింభకా! నీ వెవ్వడవు? జడునిభాతి నిట్లు బ్రవర్తించెద వేమిటికి? చెప్పుమని యడిగిన నతండు గురుండా! నేను జడుండగాను. జడంబు మత్సన్నిధిం బ్రవర్తింపుచున్నయది షడూర్మిషడ్భావవికారరహితంబగు తత్పదార్ధంబు నే నైతిని. ఈ నా యనుభవము మురువర్గమునకు గలుగుగాక యని యప్పు డాశుకవిత్వముగా బండ్రెండు శ్లోకములు రచించెను.

శ్లో. నిమిత్తంమనశ్చక్షురాది ప్రవృత్తా
     నిరస్తాభిలోపాధిలౌకాశకల్పః
    రవిర్లోకచేష్టానిమిత్తం యధాయ
    స్సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా 1
    యమగ్న్యుష్ణవన్నిత్యబోధస్వరూపం
    మనశ్చక్షురాదీన్యబోధాత్మకాని