పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

రాజశేఖర చరిత్రము

మాట చెప్పి మరల వెళ్ళి యేమేమో సంగతులను మాటాడుచుండెను. ఇంతలో రాజశేఖరుడుగారు వచ్చి వారినందఱిని లోపలికి రండని పిలిచిరి. హరిశాస్త్రులు అమ్మవారి పెట్టెను. తీసికొని యిప్పుడే వచ్చెదనని చెప్పిపోయి గడియసేపు తాళి యిత్తడిపెట్టెను పట్టుకొని కుడిచేతి కొక రాగికడియమును దొడుగుకొని మరల వచ్చి, అలికి దిగవిడచియున్న చావడిలో నల్లని పచ్చని మ్రుగ్గులతో నొక్కవిగ్రహమును వేసి, దాని నాభిస్థానమునం దానుతెచ్చిన యిత్తడి పెట్టెను బెట్టి మూత తీసి 'జయజననీ' యని కేక వేసి కొంతసే పేమోకన్నులు మూసి కొని జపము చేసి , రాజశేఖరుఁడుగారివంక జూచి యొక తెల్ల కాగితము తెమ్మని యడిగెను. ఆ కాలములో కొండపల్లి కాగితములు తప్ప మఱియొకరీతి కాగితములు లేవు. రాజశేఖరుఁడు గారికుమారుఁడు లోపలికిఁ బోయి యొక తెల్లకాగితము దీసికొని వచ్చి యిచ్చెను. అప్పుడాకాగితము నందఱును జూచుచుండఁగాఁ సమానము లైన యెనిమిది ముక్కలుగాఁ జించి యం దొక్కముక్కను దనయొద్దనుంచుకొని తక్కిన యేడు ముక్కలను వారికిచ్చివేసి, తాను సాసించు దేవతయొక్క శక్తి చేత ఆకాగితపు ముక్కమీఁదికి వస్తువును దొంగిలించినవారి పేరు వచ్చునని చెప్పి, యా ముక్కను ఇత్తడి పెట్టెలోఁబెట్టి నిమిషమందుంచి యొక మంత్రమును జదివి యాముక్కను మరలఁ బయిటికిఁ దీసి తన చేతులోనే పట్టుకొని యందఱకును జూపి, దానిని క్రింద నుంచి మూలలను కుంకుము రాచి. హారతికర్పూరపు తునకతో దాని మిఁద బీజాక్షరములును యంత్రమును వేసి క్రిందనునిచి, యొకరొకరేవచ్చి దాని మిఁద జేయివైచి పొండని యాజ్ఞపించెను. స్పష్టముగా గనబడుచున్న యాతెల్లకాగితము మిఁద నెల్లవారును చేతులు వేసి పోయి యేమిజరుగునో చూత మనువేడుక