పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

111


సీ.

బలితనూభవుఁడగు బాణాసురునిపుత్రి
        కలలోన యనిరుద్ధుఁ గలసి వేడ్కఁ
జిత్రరేఖను జూచి చెలువునిఁ దెమ్మన్న
        నళినాక్షి మాయచే నగరుఁ జొచ్చి
యనిరుద్ధుఁ దోడ్కొని యప్పురంబున కేగి
        యల యుషతోఁ గూర్చినట్టి వార్త
బాణాసురుఁడు విని బలములతో వచ్చి
        పన్నగాస్త్రంబులఁ బదిలముగను


గీ.

బంచబాణునితనయుని బద్ధుఁ జేసి
బయలుదేఱకయుండఁగఁ బ్రబలునైన
యట్టి దనుజులఁ గావలిఁ బెట్టినాఁడు
మనుమ నిటు దోడితెమ్ము నీ మహిమ మెఱయ.

127


వ.

అని పల్కిన.


సీ.

బలభద్రుఁ డప్పుడు పంతంబు లాడుచు
        ముసలంబుఁ ద్రిప్పెను మొక్కలమున
సమరంబులో దైత్యు సమయఁజేయుదు నంచు
        సాత్యకి లేచెను సంభ్రమమునఁ
బట్టినిఁ జెఱపట్టు ప్రబలుఁడౌ దానవుఁ
        బట్టి తెచ్చెద ననెఁ బంచశరుఁడు
బాణునిఁ గూల్చెద బాణాగ్నిచే నని
        సాంబుండు పలికెను సాహసమున


గీ.

మఱియు గృతవర్మ మొదలైన మనుజపతులు
శోణితపురంబునను గల్గు శూరవరులఁ
జెండుబెండాడి మిక్కిలిఁ జేవమెఱయ
నల్ల యనిరుద్ధుఁ దోడ్తెత్తు మనుచుఁ బల్క.

128