పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెనుకబడిన తరగతుల సంక్షేమం

38. వెనుకబడిన తరగతులకుచెందిన విద్యార్థుల కోసం రాష్ట్రంలో 692 బాలుర వసతిగృహాలు, 201 బాలికల వసతిగృహాలు పనిచేస్తున్నాయి. వీటిలో 12,743 మంది బాలురు, 23,296 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షఫలితాలు 90.87 శాతం కాగా, ఈ వసతిగృహాల విద్యార్థులు 93.78 శాతం ఫలితం సాధించారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసించడానికి వీలుగా ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలోనూ బాలురకోసం, బాలికల కోసం ఒక్కొక్క హాస్టల్ చొప్పున నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

39. పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల పథకంలో భాగంలో అర్హులైన బి.సి. విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజు చెల్లించబడుతున్నాయి. అర్హులైన ఇబిసి విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించబడుతున్నది.

40. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యావంతులయిన నిరుద్యోగ యువత వివిధ పోటీపరీక్షల్లో తక్కిన వారితో దీటుగా పోటీ పడడానికి రాష్ట్రం లో 13 బిసి స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచితశిక్షణ అందజేయబడుతున్నది.

41. బిసి విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల పాఠశాలలు 31 నడుస్తున్నాయి. వాటిలో 17 బాలుర కోసం, 14 బాలికల కోసం నడుస్తున్నాయి. 2013-14 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఈ పాఠశాలల విద్యార్థులు 98.99 శాతం ఉత్తీర్ణత సాధించారు.

17