ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారి ప్రసంగం
2019, జూలై 12వ తేది.
పరిచయ పలుకులు
అధ్యక్షా మరియు గౌరవనీయులైన సభ్యులారా !
మీ సమ్మతితో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఈ సభా సమక్షంలో ఉంచుతున్నాను.
1. ఇది నా మొట్టమొదటి బడ్జెట్. ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిగారికి నేను రుణపడి ఉంటాను. గౌరవనీయ ముఖ్యమంత్రిగారికి, సభాపతి గారికి, సభకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
2. యథాతధ స్థితిని మార్చేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిగారికి ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన మన రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంతమంది ఈ తీర్పును వ్యాఖ్యానించడానికి వివిధ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కొంతమంది ఇంకా వివరణల కోసం వెదుకుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రిగారు పేర్కొన్నట్లుగా, ప్రధానంగా రెండు అంశాల కారణంగా ఈ తీర్పు వెలువడిందని నేను నమ్ముతున్నాను. అవి, నమ్మకం మరియు విశ్వసనీయత.
3. మహాత్మాగాంధీ కలలుగన్న భారతదేశం గురించి ఆయన అన్న మాటలను గుర్తుకుతెస్తున్నాను.
“ఈ దేశ నిర్మాణంలో తనకు కూడా ఒక పాత్ర ఉన్నదని ఈ దేశంలోని ప్రతి పేద వ్యక్తి అర్ధం చేసుకోవాలి. ఆర్ధిక, సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తి నివసించగలిగేలా ఉండాలి”
1