పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థిక సంవత్సరానికిగాను ఈ పథకం కింద రూ. 3,000 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

20. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో 1వ తరగతి నుండి 10వ తరగతి దాకా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు 3 జతల యూనిఫారములు, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, ఒక బెల్టు, స్కూలు బ్యాగ్ మొత్తం ఒక స్టూడెంట్ కిట్ గా 'జగనన్న విద్యాకానుక' పేర అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

21. పాఠశాలలలోనూ, అంగన్‌వాడీ కేంద్రాలలోనూ హాజరవుతున్న మన చిన్నారుల ఆరోగ్య ప్రమాణాల పెంపుదల పట్ల మన గౌరవనీయ ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ కనబరుస్తారో 'జగనన్న గోరుముద్ద' పథకం ద్వారా అర్థమౌతుంది. ఒక తండ్రి తన పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన, పుష్టికరమైన ఆహారం అందాలనీ ఎంతగా తపిస్తాడో అంత శ్రద్ధ కనబరుస్తూ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. పుష్టికరమైన ఆహారాన్ని అందించడం కోసం రూపకల్పన చేసిన ఈ కొత్త మెనూ 2020 జనవరి 21 నుంచి అమలవుతున్నది. ఇందులో బెల్లం చిక్కి పులిహోర, పొంగలి, కూరగాయల పలావు మొదలైనవి పిల్లలకి వడ్డించడం జరుగుతోంది. వీటితో పాటుగా మధ్యాహ్న భోజనం వండి పెట్టే వంట మనుషులకు ఇచ్చే నెలవారీ పారితోషికాన్ని రూ.1,000 నుండి రూ.3,000కు పెంచడం జరిగింది.

22. సెకండరీ మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖల నిమిత్తం 2020-21 సంవత్సరానికి గానూ మొత్తం రూ. 22,604 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

23. విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలను మెరుగుపరచడం కోసం 'జగనన్న విద్యాదీవెన', మరియు 'జగనన్న వసతిదీవెన' పథకాలను అమలు చేయడంతో పాటు, ఈ ప్రభుత్వం ఉన్నతస్థాయి నిపుణుల సంఘం వారి సూచనల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా ఇంజనీరింగ్ కరికులంను సరిదిద్దింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలోనూ, వాటి అనుబంధ కళాశాలలలోనూ ఈ కొత్త కరికులం 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు జరుగుతున్నది.

9