పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

99. 2020 ఏప్రిల్ మాసాంతానికి 13,122 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించబడ్డాయి. రూ.2,503 కోట్ల మేరకు పెట్టుబడులు కలిగిన ఈ పరిశ్రమల ద్వారా 63,897 మందికి ఉద్యోగ అవకాశాలు లభ్యం కానున్నాయి. అదే విధంగా 36,810 కి ఉద్యోగ అవకాశాలు కల్పించగల 39 భారీ మెగా పరిశ్రమలకు సంబంధించిన 39 యూనిట్లు రూ. 24,170 కోట్ల పెట్టుబడితో నెలకొల్పబడ్డాయి.

100. అధ్యక్షా! సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (యం.ఎస్.యం.ఇ.) ప్రోత్సహించే దిశగా మొదటి అడుగుగా ప్రభుత్వం వన్ టైం రీస్టక్చరింగ్ (ఒ.టి.ఆర్) పథకాన్ని ప్రవేశపెట్టింది. డాక్టర్ వై.యస్.ఆర్. నవోదయం పేరిట ప్రారంభించిన ఈ పథకం యం.ఎస్.యం.ఇ.లు అభివృద్ధి చెందటానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు కోసం ఉద్దేశించబడింది. గత ప్రభుత్వము యం.ఎస్.యం.ఇ.లకు ఇవ్వవలసిన ప్రోత్సాహకాలు చెల్లింపు చేయకపోవడం వలన తగిన పెట్టుబడి లేక చాలా పరిశ్రమలు కష్టాల్లో ఉన్నాయి. ఈ సమయంలో పరిశ్రమలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజిని మంజూరు చేసింది. ఈ ప్యాకేజి క్రింద రూ.904.89 కోట్లు 11,238 యం.ఎస్.యం.ఇ.లకు తయారీ మరియు అనుబంధ యూనిట్లు ప్రోత్సాహకాల బకాయిలను రెండు దశలలో ఇవ్వటం, ఒప్పందం కుదుర్చుకున్న డిమాండ్ బదులుగా కొంత స్థిర డిమాండ్ 3 నెలల పాటు ఏప్రిల్, 2020 నుండి జూన్, 2020 వరకు చెల్లించటం, మూలధన ఋణాలు మరియు మార్కెట్ అందుబాటులో ఉంచటంలాంటివి ఉన్నాయి.

101. మనం కలకన్నట్లుగా కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ తయారీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ ను కంపెనీల చట్టం 2013 క్రింద ప్రారంభించింది. ఈ సంస్థ 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. అలాగే ఎన్.యం.డి.సి.తో ఓర్ ఒప్పందం చేసుకున్నాము.

102. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.2,075.56 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

38