పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23. వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి, అన్ని పాఠశాలలలో 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసనను ప్రోత్సహించడానికి పాఠ్య అంశాలతో కూడిన 9,52,925 ట్యాబ్ లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. దీని వలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవ్వడం ద్వారా, 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34 లక్షల 30 వేల మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు.

24. నూతన విద్యా విధానం 2020 కి అనుగుణంగా 14,255 అంగన్వాడీ కేంద్రాలు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి, మరియు 4,470 ప్రాధమిక పాఠశాలలు సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. ఈ విధానం ద్వారా బోధనా నాణ్యత మెరుగుపడి పిల్లలకు అర్హత కలిగిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను చేరువ చేయగలిగాము.

25. మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగ్లు, బూట్లు, పాఠ్యపుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల-కిట్లను అందించింది. 55,607 అంగన్వాడీ కేంద్రాలకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధించిన 26 అంశాలతో కూడిన ప్రీ-స్కూల్ కిట్లు పంపిణీ చేయబడ్డాయి.

26. మన బడి-నాడు నేడు పథకం 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు జూనియర్ కళాశాలలలో అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది. ఫర్నీచర్, త్రాగునీరు, మెరుగైన పారిశుధ్యం వంటి చక్కటి సౌకర్యాలతో కూడిన తరగతి గదులతో 15,715 పాఠశాలలు ఈ పథకం మొదటి దశ క్రింద పూర్తయ్యాయి. రెండవ దశ క్రింద 22,344 పాఠశాలలలో ఇప్పటి వరకు 7,163 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ పథకం వలన 99.81 శాతం పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము.

7