పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుండి 26 కు, రెవెన్యూ డివిజన్లను 52 నుండి 77 కి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్ నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంతోపాటు, ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తాయి.

17. పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి, మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీసు సబ్ డివిజన్లను మరియు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఉదాహరణకు, కుప్పం పోలీస్ సబ్-డివిజన్ ను ఆరు పోలీసు స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయటమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాలలో పర్యాటక పోలీసు స్టేషన్లు ప్రారంభించబడ్డాయి. భద్రతా మౌలిక సదుపాయాలు పెంచటం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది.

18. గడప గడపకు మన ప్రభుత్వము అనే కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చడం ద్వారా, బాధ్యతాయుతమైన పాలనను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన 58,288 పనులను 2,356 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేయగా, ఇప్పటివరకు 729 కోట్ల రూపాయలతో 17,239 పనులు పూర్తయ్యాయి.

19. రాష్ట్రంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా, స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం నాల్గవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి, ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది.

5