పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రముఖ ఆర్థిక వేత్త జె.యమ్. కీన్స్ మాటలలో…

"ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే,
ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చెయ్యడం, లేదా
అవే పనులు కొంచం మెరుగ్గా లేదా అధ్వాన్నంగా చెయ్యడం కాదు,
కానీ ఇప్పటి వరకు అసలు ఎవ్వరు చేయని పనులు చెయ్యడం.”

12. మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాల ప్రభావము మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

I. సుపరిపాలిత ఆంధ్ర

పాలనా వికేంద్రీకరణ - గడప వద్దకే ప్రభుత్వం

13. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకు వెళ్ళే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచీ ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారితను అందించడం జరిగింది.

14. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా, స్థానిక సంస్థలను బలోపేతం చేయడమైనది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానము, స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి, చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది.

15. దాదాపు 1 లక్ష 35 వేల మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం, 2 లక్షల 66 వేల మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము.

4