పుట:అహల్యాసంక్రందనము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

33

     రూపమై తేసరే, చూపరకనులకు
                    నిర్వాణసౌఖ్యంబు నింపవలదె
తే. కాంతయైనంత సరియె నిష్కాముఁ డైన
     మౌనివరునైన మరునిబందానుగాఁగఁ
     జేయవలవదె యిటువంటి చిన్నిచాన
     ముజ్జగంబులలోఁ గాన బుధనిధాన!8
మ. “కుదురై యొప్పులకుప్పయై తనువునం గోరంత యొచ్చెంబు లే
     నిదియై నొవ్వని జవ్వనంబు గలడై నిద్దంపుటొయ్యారియై
     మదనోజ్జీవితయై గరాగరికయై మాణిక్యపుంబొమ్మయౌ
     మదిరాక్షిన్ సృజియింతు నే నొకతె మ న్మాహాత్మ్యమున్ జూడుమా!"9
క. అని పలికి పద్మగర్భుఁడు
     తనగురుఁ డగు బద్మనేత్రుఁ దలఁచి ప్రయత్నం
     బొనరఁ జతుర్దశలోకీ
     వనితాజనతాతిశయిత వైఖరి యెసఁగన్.10
సీ. చందురులో మైల జలజంబులో దువ్వ
                    యూడ్చి పోఁద్రోచి రెం డొకటి సేసి
     అరుణాశ్మకాఠిన్య మమృతపాండుగుణంబు
                    నుడిగించి యారెంటి నొకటి సేసి
     అరులజో డెడయించి గిరులప్రతాపంబు
                    పెకలించి యారెంటి నొకటి సేసి
     యిభతుండచాంచల్య మిల ననంటులజాడ్య
                    మొడిచి యారెంటిఁ దా నొకటి సేసి
తే. కులుకునెమ్మోము కెమ్మోవి గుబ్బచన్ను
     లరిదియూరులు నిర్మించి యంగజునకు
     వింతకైదువుగా నొక్కదంతిగమన
     నబ్జభవుఁడు సృజించె నహల్య యనఁగ.11