పుట:అహల్యాసంక్రందనము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకామేశ్వరకవి సత్యభామాసాంత్వనమును బ్రకటించునప్పుడే మాకు, మధురనాయకుల యాదరణమున వర్థిలిన సారస్వతమును తెలుఁగునాట వ్యాప్తిగావించవలయుననెడి తలంపుగల్గినది. తంజావూరు మహారాజుల రాసిక్యము చలువను వెలసిన కావ్యగ్రంథములు, చాలకాలముక్రిందనే ముద్రితములై జనాదరణమును బడసినవి. మధురవాఙ్మయమునకు, మాయోపిన సేవలనొనరించి, యుధ్ధరించుటకు సారస్వతాభిమానుల ప్రోత్సాహ, ఆదరణముల నర్ధించెదము.

విజయరంగచొక్కనాథుని దళవాయిగా నుండిన వీరరాహూతుఁడు సముఖ వేంకటకృష్ణప్ప నాయకుఁడు, స్వయముగా కవియై, కవులను పోషించుచు, తెన యేలిక జాడలను, వదాన్యత్వవైఖరుల ననుగమించి, చిరప్రతిష్ఠనందినవాఁడు. అతనికృతులతో మిగుల నుత్తమమగు నహల్యాసంక్రందనము పాఠకులకు, శృంగారకావ్యగ్రంథమండలి తృతీయప్రచురణముగా నందించుచున్నారము. మఱియు, ననుబంధములుగా నాకవియే రచియించెనన్న రాధికాసాంత్వనమను నేకాశ్వాస శృంగారప్రబంధమును, వచన సారంగధర నుండి, యాతని రచనానైపుణిని జదువరు లెఱుంగుటకు రసవద్ఘట్టము నొకదానిని, వచన జైమినిభారతము నుండి, ఆంధ్రసాహిత్యపరిషదధిపతులు, శృంగారమయమని, తమప్రచురణమున విడిచిన భాగమును—నీమూఁటినిఁ గూడ చేర్చినారము.

గ్రంథపాఠపరిశోధనావసరముల మా కత్యంతము నుపకారకులైన మిత్రుల కియ్యెడఁ గృతజ్ఞతఁ దెలుపవలసియున్నది. శిరోమణి తిరుమల వేంకట రంగాచార్యులవారు (ఆంధ్రపత్రికాకార్యాలయము, మదరాసు.) ప్రాచ్యలిఖితభాండాగారమునందున్న రెండుప్రతులను బట్టి మా 'అహల్యాసంక్రందనము’ ను బరిష్కరించుట యే గాక, రాధికాసాంత్వనమును వాసి పంపినారు. శతాధికగ్రంథక ర్తలగు మద్దూరి శ్రీరామమూర్తి కవిగారు, తీరిక జేసికొని, మాకోరికను మన్నించి, ఆంధ్రసాహిత్య