తెలుగువారి జానపద కళారూపాలు/శాతవాహన తెలుగు చక్రవర్తులు

వికీసోర్స్ నుండి

ఆంధ్రరాజులు ఆదరించిన కళలు

శాతవాహన తెలుగు చక్రవర్తులు

'

ఆంధ్ర శబ్దం:

ఈనాటివరకు జరిగిన పరిశోధనల ఫలితంగా ఆంధ్రుల చరిత్ర ఒక వరుస క్రమంలో తెలుస్తూ వుంది. అనేక భూగర్భ పరిశోధనల ద్వారా ఎన్నో క్రొత్త విషయాలు విశదమౌతున్నాయి. క్రీ.పూ. 550 నుండి బౌద్ధులు ఆంధ్ర దేశం మీదుగా సింహళానికి ప్రయాణాలు చేసినట్లూ, అందుకు సంబందించిన గాథలు బౌద్ధ గ్రందాలలో వున్నట్లూ తెలుస్తూ వుంది. ఆంధ్ర అనే పదం అనేక ప్రాచీన గ్రంధాలలో ఉదహ్రింప బడి వున్నది.

భరతుడు నాట్యశాస్త్రంలో ముఖ్యమైన పదకొండు జాతి రాగాలలో ఆంద్రి ( నేటి రాగం) కూడ ఒక జాతి రాగమని పేర్కొన్నాడు ప్రాచీన గ్రంధమైన ఐతరేయ బ్రాహ్మణంలో ప్రప్రథమంగా ఆంధ్ర శబ్ధం ఉపాయోగ పరచ బడడమే గాక క్రీ.పూ. వెయ్యి సంవత్సరాల ముందుగానే రచించి బడిన భారత, రామాయణ గ్రంధాలలో కూడ ఆంథ్రుల ప్రశంస వుంది. ఈ నాటికి సుమారు నాలుగు వేల సంవత్సరాల నుండీ ఆంధ్ర జాతి ఒక ప్రత్యేక జాతిగా వినిపిస్తున్నదని చెప్పవచ్చు.

హాలుడూ, కళా పోషణా:

ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన రాజులలో శాతవాహన తెలుగు చక్రవర్తులు మొదటి వారు. వీరినే శాతవాహనులని, శాతకర్ణి రాజులని కూడ వర్ణించారు. క్రీ. పూ. 220 నుండి క్రీ.శ. 218 వరకూ అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల వరకూ 30 మంది శాతవాహన రాజులు ప్రతిష్టాన పురాన్ని రాజధానిగా చేసుకుని హైదరాబాదు సంస్థానంతో సహా కృష్ణా గోదావరి మండలం వరకు వ్వాపించి వున్న ప్రాంతాన్ని పాలించారు. ఆంధ్ర శాతవాహన రాజులలో 14 వ రాజైన హాలుడు ప్రతిష్ఠానపురం రాజధానిగా చేసుకుని దక్షిణాపథంతో పాటు సింహళాన్ని జయించి సప్త గోదావరి వద్దనున్న ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి వచ్చి, అక్కడ సింహళ రాజ పుత్రిక లీలావతిని వివాహం చేసుకున్నట్లు లీలావతి కావ్యంద్వారా తెలుస్తున్నది. హాలుడు తన ఆస్థానంలో కవి, పండిత, నాయక, శిల్పులను ఆదరించినట్లు తెలుస్తూ వుంది.

కళలను చెప్పిన గాథా సత్పశతి:


క్రీస్తుకు పూర్వమే ఆంధ్ర దేశంలో సంగీతం, నృత్యం, నాటకంతో పాటు అనేక వాద్య విశేషాలు ప్రచారంలో వున్నట్లు హాలశాతవాహనుడు రచించిన గాధా సప్తశతి తెలియజేస్తూ వుంది. హాలుడు గాథా సప్తశతిని మహారాష్ట్ర ప్రకృత భాషలో రచించినా తెలుగు దేశానికి సంబంధించిన అనేక కళా రూపాలను ఉదహరించాడు. ప్రాకృత భాషలో 700 గాథల్ని రసవత్తరంగా రూపొందించాడు. ఆంధ్రదేశపు ఆనాటి సాంఘిక జీవితాన్ని తెలుసుకోవడానికి ఇదే ముఖ్యమైన గ్రంథం. క్రీస్తుశకం ప్రథమ శతాబ్దంలో నాటి లలిత కళలకు సంబంధించిన ఈ క్రింది వివరాలు గాథా సప్తశతి తెలియజేస్తూ వుంది.

1. జనపచేను హరి తాల ( ఆంటె అరదళము ) మండిత ముఖంతో మెరసే నటివలె అందముగా ఉన్నదట. 2. గోపికల నర్తనాన్ని శ్లాఘించే నెపాన ఒక గోపిక వారి చెక్కిళ్ళమీద ప్రతిబింబిస్తున్న కృష్ణుని ముద్దు పెట్టుకున్నదట. (2_14) 3. నర్తించి నర్తించి, అలసటగొన్న వాలుగంటి మొదలైన వారితో కలయిక ఆహ్లాదకరమట. (3_50) 4. ముఖమున అన్నం వున్నంత వరకే మద్దెల మధురంగా పలికి అది లేనిచో విరసముగా మొఱుగునట. ( 3_53 )

పై పుదాహరణలతో పాటు గాథాసప్తశతిలో నాటకాలు, సంగీతం, మృదంగం, మురాజ, వీణ మొదలైన వాద్య విశేషాలు ప్రచారంలో వున్నట్టు కూడ తెలుపబడింది.

(పి.ఎస్.ఆర్. అప్పారావ్ )
నాట్యశాస్త్రం.