తెలుగువారి జానపద కళారూపాలు/బౌద్ధయుగంలో వర్థిల్లిన కళలు

వికీసోర్స్ నుండి

బౌద్ధ యుగంలో వర్ధిల్లిన కళలు

హీనయాన, మహాయాన:

శాతవాహన రాజులు గాఢమైన హిందూ మతాభి మానులై నప్పటికీ దేశంలో బౌద్ధ మతం విరివిగా వ్యాపించింది. వ్యాపారులు, రైతులు, వివిధ వృత్తుల పనివారు చాలావరకు బౌద్ధమతాన్ని అభిమానించారు. బ్రాహ్మణులు మాత్రం హిందూమతాన్ని, హిందూ దేవతలను ఎక్కువ ఆరాధించారు, శాతవాహన రాజులు మాత్రం వివిధ మతాల వారిని సమాన దృష్టితో చూశారు. ఆనాడు రాజులకు రైతులకు వృత్తి పని వారల మధ్య వర్గకలహం తీవ్రంగా వుండేది. గ్రామ జీవితంలో పీడించేవారు, పీడింప బడే వారు వుండే వారు. కుల భేదాలను, వర్గ భేదాలను నిరసించి సర్వ సమానత్వాన్ని బోధించడం వల్ల పీడిత ప్రజానీకానికి బౌద్ధ మతం ఒక్క ఆశాజ్యోతిగా నిలబడింది. అందువల్ల ఆనాటి కార్మికులు, రైతులు ఇతర పీడిత ప్రజానీకమంతా బౌద్ధమతాన్ని గాడంగా అభిమానించారు. ముఖ్యంగా శిల్పులు బుద్ధునిపై గల తమ భక్తి భావాన్ని ప్రదర్శించడానికి బౌద్ధ విగ్రహాలను చెక్కి పూజించడం మొదలు పెట్టారు. కాని బుద్ధుని విగ్రహరూపంలో పూజించ వచ్చునా, కూడదా అన్న మీమాంసలో బౌద్ధులలో హీన యాన, మహాయాన ఆనె రెండు విభాగాలు ఏర్పడ్డాయి. మహాయాన శాఖవారు పూజించవచ్చునన్నారు, హీనయానవారు వ్వతిరేకించారు. కాని క్రమేపి మహాయాన శాఖ అభివృద్ధి చెంది ప్రపంచమంతటా బౌద్ధమతం వ్యాపించింది.

కళలు పండిన నాగార్జున కొండ:
కాని ఆర్థిక వ్వవస్థలో అణగి పోతున్న పీడిత ప్రజాసామాన్యానికి బౌద్ధమతం సాంఘిక, ఆర్థిక సమానత్వం కలిగిస్తుందని మొదట్లో ఆశించారు. కాని అలా జరుగ లేదు. బౌద్ధమతంలోని సమానత్వ సిద్ధాంతాలన్నిటినీ అహింసా సూత్రాలతో బంధించడం వల్ల రాజరిక వ్వవస్థకు భంగం కలుగదని భావించిన రాజులందరూ బౌద్ధమతాన్ని

స్వీకరించారు. అంతేకాక ప్రారంభంలో వర్ణ వ్వవస్థను వ్వతిరేకించిన బౌద్ధమతం క్రమేపి వర్ణ వ్యవస్థతో కూడా రాజీపడింది. ఈ విధానం వల్ల వివిధ జాతులకూ చెందిన వారు వారి కులాచారాలను అనుసరిస్తూ బుద్ధుని దేవునిగా ఆరాధించారు. శిల్పులు శిల్పాలను చెక్కారు. చిత్రాలను చిత్రించారు. సంగీత, సృత్యాలతో వారి ఆనందాన్ని వెల్లడించారు. ఇలా బుద్ధుని ఆరాధించే వారందరికి నాగార్జున కొండ కేంద్రమై అక్కడ శూద్రతీర్థం అనేది ఏర్పడింది. బౌద్ధమతంలో వచ్చిన ఈ పరిణామాలను ఆచార్య నాగార్జునుడు మరికొంత ముందుకు తీసుకు వెళ్ళారు.

నాగార్జున లలితకళానిలయం:

ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దుల మధ్య ధాన్య కటకం (నేటి ధరణికోట) ను రాజధానిగా పరిపాలించిన యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో వుండి దేశ దేశాలు సంచారం చేసి చివరి రోజుల్లో నాగార్జునుని కొండ మీద ఆశ్రయం నిర్మించుకొని ఇక్కడే మరణించిన ఆంధ్రుడు.

నాగార్జునుడు శూన్య వాదం - లేక మాధ్యమికవాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి బౌద్ధమతంలో ఒక పెద్ద మార్పును తీసుకువచ్చాడు. ఆంథ్రులలో విశేషంగా వ్వాపించిన బౌద్ధమతం ఆంధ్ర సంస్కృతి పరిణామంలో ఎంతో ప్రాముఖ్యం వహించింది. పండితుడయిన నాగార్జునుడు దాదాపు 30 దర్శనా గ్రంధాలను రచించాడు. ఆయన గొప్ప పండితుడు. ఆనాటి నాగార్జునుని కొండ బౌద్ధ ఆరామంలో విద్యాబోధన, ఉచిత వైద్య చికిత్సలతో పాటు శిల్ప, చిత్రలేఖనం, సంగీతం, నాట్యమూ నేర్పబడేవి. లలిత కళలకు నిలయమైన అనేక బౌద్ధ ఆరామాలు ఆనాడు ఆంధ్ర దేశంలో ___నాగార్జునుని కొండ, అమరావతి, ధరణికోట, జగ్గయ్య పేట, భట్టి ప్రోలు, నందిగామ, ఘంటసాల, గుడివాడ, గోలి, రామతీర్థం, శంఖరం మొదలైన ప్రాంతాల లోనే గాక, తెలంగాణాలోని, కొండాపురం, గుమ్మడిదుర్రు,ఫణిగిరి, గాజులబండ, అల్లూరు మొదలైన చోట్ల కూడ __ ప్రసిద్ధంగా వుండేవి.

అందాలు చిందిన ఆరామాలు:

అంతేగాక ఆంధ్ర దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలన్నీ ఒకప్పుడు బౌద్ధ ఆరామాలున్నచోట కట్టబడినవే. ఈ వైష్ణవ దేవాలయాల మీద సంగీత, నృత్య వాద్యాలకు సంబంధించిన శిల్పాలు చెక్కబడినాయి. బౌద్ధ ఆరామాలన్నిటిలోనూ వివిధ లలితకళలూ పోషింపబడినాయి. ఇందుకు ఉదాహరణలు ఇటీవలి నాగార్జునుని కొండ త్రవ్వకాలలో అనేకం బయటపడి, భద్రపరచబడ్డాయి. ఆ కోవకు చెందినదే శిథిలమైన నాగార్జునుని కొండ ఆరుబయలు రంగస్థలం.

అన్ని హంగులతో ఆరుబయలు రంగస్థలం:

ఈ మధ్య నాగార్జునకొండ త్రవ్వకాలలో ఈ ఆరుబయలు రంగస్థలం బయట పడింది. ఇది దీర్ఘ చతురస్రప్రాంగణం గల స్టేడియం. దీనికి నాలుగు వైపులా ప్రేక్షకులు కూర్చోవడానికి వీలుగా ఇటుకలతొ మెట్లు మెట్లుగా రాతి పలకలు వరచిన ఆసనాల వరుసలు ఏర్పాటు చేసి వున్నాయి. ఇది 56.3 పొడవు 17.3 వెడల్పు వుంది. ఇది విద్యార్థులు సమావేశమయ్యే సభారంగం కావచ్చు. ఈ రంగస్థలంలో నైరుతి మూలగా ఎత్తైన శిలా వేదిక వుంది. ఇది ప్రధానవక్త నిమిత్తమూ, సంఘారామాన్ని దర్శించటానికి వచ్చిన వారి నిమిత్తమూ ఏర్పాటు చేయబడింది. ఇది ఆరుబయలు రంగ స్థలం. దీనిలో కురిసిన వర్షపు నీరంతా బయటికి పోవడానికి ఒక పెద్ద తూము వుంది. రంగస్థలం మధ్య భాగంలో ఒక గుండ్రని స్తంభం లాంటి వేదిక వుంది. వక్తలు దీని మీద నిలబడి సభికుల నుద్దేశించి ఉపన్యసించేవారట. ఈ రంగస్థలంలో వున్న ఒక చిచిత్రం దీని మధ్యనిలబడి వుపన్యసిస్తే ఆ కంఠధ్వని స్పష్టంగా రెండు వందల అడుగుల దూరం వరకూ వినబడుతుంది. అంతే కాక ఆసన పంక్తి అంతకంతకూ ఎత్తవుతూ వచ్చిన కొలదీ ఆధ్వని మరింత స్పష్టంగా వినబడుతుంది. దీనిని బట్టి అదివరకే ఆ పరిసర ప్రాంతాల నుండి వచ్చే ప్రతి శబ్ద ధ్వనుల ననుసరించి ఈ ఆరుబయలు రంగస్థలం నిర్మింపబడి యుండ వచ్చునని పి.ఎస్.ఆర్.అప్పారావు గారు వారి నాట్య శాస్త్రంలో ఉదహరించారు

అమరావతీ శిల్పాల అందచందాలు:

ఆంధ్రుల నృత్యకళ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే శాతవాహనుల నాటికే అభివృద్ధి చెందిందనదానికి ఈనాడు అనేక ఆధారాలున్నాయి. అమరావతి, నాగార్జున కొండల్లో ఈనాడు కనిపించే అనేక పాలరాతి శిల్పాల్లో, అనేక నాట్య భంగిమలతో పాటు మన నాట్య సంప్రదాయాలన్నీ మలచబడి ఉన్నాయి.

ముఖ్యంగా అమరావతిలో దొరికిన శిల్పంలో ఒక బృంద నాట్య ముంది. బృందంలో ఉన్న ప్రతి నర్తకీ ఏదో ఒక భావాన్ని సూచిస్తూ వుంది. ఒక నర్తకి ప్రవేశిక నృత్యం చేస్తూ వుంది. మరో నర్తకి అలీడ స్థానంలో వుండి వ్యంసిత కరణాన్ని చుపుతూ వుంది. వేరో నర్తకి అర్థమత్తిల్లి స్థానంలో వుండి స్థలితాపశ్యత కరణాన్ని చూపూతూ వుంది.

మరొక శిల్పంలో ఆరుగురు నర్తకీ మణులు ఒక రాజు ముందు నృత్యం చేస్తున్నట్లు చూప బడింది.

భోదిసత్వుడు తెల్ల ఏనుగు రూపంలో భూమికి వచ్చే ఘట్టాన్ని చూపే శిల్పంలో ఆయనను అనుసరించి వచ్చే దేవతల బృందం వివిధ నాట్య భంగిమలలో కనిపిస్తున్నారని దిగవల్లి శివరావు గారు తమ 'కథలు -గాథల 'లో తెలియ జేశారు.

లలితవిస్తరం చెప్పిన లలిత కళలు:

బౌద్ధయుగంలో అనేకమైన రూపకాలు వెలిశాయి. బుద్ధుడు మొట్ట మొదటి నాట్యశాస్త్ర వేత్త అని బుద్ధుని తొలి జీవిత చరిత్ర 'లలిత విస్తరం' లో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. బుద్ధుడు తన రాజ గృహంలో విశ్రమించి నప్పుడు ఆయన శిష్యులైన మౌద్గల్యాయనుడు, ఉపతిష్కుడూ తమ నటనా కౌశల్యాన్ని చూపించారట. బింబిసారుని ఆస్థానానికి నాగరాజులు వచ్చినప్పుడు వారి గౌరవార్థం నాటకాలు ప్రదర్శించారట, రాజగృహంలో బుద్ధుని సమక్షంలో దక్షిణ దేశానికి సంబందించిన కువలయ అనే ప్రసిద్ధ నర్తకకురాలు బుద్ధుని జీవితాన్నే అభినయించిందట. బౌద్ధజాతక కథలలో నటులను గురించి కావలసినంత సమాచారం తెలుస్తూంది. పై వివరాలను బట్టి బౌద్ధ యుగంలో నాటక కళ ఎలా అభివృద్ధి అయిందీ సూక్ష్మంగా తెలుసుకోవచ్చును.

శాతవాహన రాజ్యవైభవం క్రీ.శ. 200 తో అంతరించింది. 400 సంవత్సరాల ఆ పరిపాలనలో సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖన ఎంతగానో ఆభివృద్ధి పొందాయి.

ఇక్ష్వాకులు చెక్కిన చక్కని శిల్పాలు:

శాతవాహన రాజ్యం చిన్నాభిన్నమైన తరువాత ఇక్ష్వాకు రాజులు పరిపాలించారు. ఈ వంశంలో ముగ్గురు రాజులు 52 సంవత్సరాలు మాత్రమే రాజ్య పారిపాలన చేశారు. వాసిష్టీ పుత్ర శాంతమాలుడు ఈ వంశకర్త. ఈయన కుమారుడు మాఠరీ పుత్ర వీరపురుష దత్తుని కాలంలోనే నాగార్జునుని కొండ శిల్పాలన్ని చెక్కబడినాయి. ఇక్ష్వాకు రాజులు లలిత కళలను పోషించిన ఆధారాలు మనకు ఎక్కువ లేవు. కాని శాతవాహనుల కళా సంస్కృతులను చాలవరకూ కాపాడింది వీరే. పల్లవ రాజులు ఆంధ్ర దేశంమీద దండెత్తడంతో ఇక్ష్వాకుల రాజ్యం పతనమైంది. నాగార్జున కొండ, విజయపురి నగరాలను నాశనం చేయడంతో ఆ నగరాల శోభ అంతరించింది. బౌద్ధ బుక్షువు లందరూ తరిమి వేయ బడ్డారు. బౌద్ధ చైత్యాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి.

పల్లవ సంగీతం:

శాతవాహన చక్రవర్తుల క్రింద సామంత రాజులుగా వుండి వీరు తరువాత స్వతంత్రులై పల్లవనాడును అనగా నేటి పలనాడు కేంద్రంగా చేసుకుని దక్షిణాన కంచి వరకు ఆక్రమించు కుని కంచిలో రాజ్యం స్థాపించారు. పల్లవుల రాజ్య పరిపాలనా కాలంలో మొత్తం 21 మంది పల్లవ రాజులు పరిపాలించారు.

వీరిలో మొదటి మహేంద్ర వర్మ క్రీ. శ. 600 నుండి 630 వరకు పరిపాలించాడు. సింహ విష్ణుని మరణానంతరం అతని పుత్రుడు మొదటి మహేంద్ర వర్మ కాంచీ పుర పల్లవ రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఈతడు పల్లవ వంశ పాలకులలో సుప్రసిద్ధుడు, ఇతడు కళాప్రియుడు. శిల్పకళా విద్యావిశారదుడు. సంగీత విద్యలో దిట్ట. అనేక బిరుదులు సంపాదించిన వాడు. రుద్రాచార్యుడనే విఖ్యాత సంగీత విద్వాంసునికి శిష్యుడు. ఈయన ఒక సంగీత గ్రంధాన్ని రచించి కుడిమియామలై అనే చోట శిలాక్షరాలను చెక్కించాడు. ఈయన సంగీతంలో ఎంత ప్రావీణ్యం కలవాడో సాహిత్యంలోనూ అంత గొప్పవాడు.

పల్లవుల తరువాత సాలంకాయనులు పశ్చిమ గోదావరి లోని వేంగిని రాజదానిగా చేసుకుని 300 నుండి 420 వరకు పరిపాలించారు. ఈ కాలంలో వర్థిల్లిన లలితకళా వికాసం ఎటువంటిదో ఎవరికీ తెలియదు.

విష్ణుకుండినుల సాహిత్య కళాపోషణ:

తరువాత విష్ణుకుండినులు 420 నుంది 630 వరకు, అమరావతిని రాజధానిగా పరిపాలించారు. గుంటూరు జిల్లాలోని వినుకొండ వీరి స్వగ్రామం. వినుకొండకే విష్ణుకుండిన అనే పేరు వచ్చింది. ఈ వంశలో మొత్తం 9 మంది రాజులు పరిపాలించారు. విష్ణుకుండిన రాజులు కేవలం సాహిత్య పోషకులే కాక కళాపోషకులు కూడాను. వీరు హిందూ గుహాలయాలను నిర్మించి వాస్తుశాస్త్రానికి ప్రాముఖ్యమిచ్చారు. విజయవాడ వద్ద మొగల్ రాజపురంలో బహుబాహువులు కలిగిన నట రాజమూర్తి శిధిలావస్థయందున్నప్పటికీ కళా దృష్టిలో మాత్రం నిరుపమానమైంది.

వీరి తరువాత ఆంధ్రదేశాన్ని పరిపాలించినవారు కళింగ రాజులు. వీరి పాలనలో లలితకళా వికాసం ఏటువంటిదో మనకు తెలియరావడం లేదు.