తెలుగువారి జానపద కళారూపాలు/వినోదాల విప్రవినోదులు

వికీసోర్స్ నుండి

వినోదాల విప్ర వినోదులు

ఈనాటి ఆంధ్రదేశంలో ఎక్కడో చెదురు మదురుగా విప్రవినోదం ప్రచారంలో వుందని చెప్పలేం కానీ 1600 __1700 సంవత్సరాలలో ఈ వినోదాలు వ్వాప్తిలో వున్నాయి అంటే అది విజయనగర సామ్రాజ్య కాలం.

విప్రులనగా బ్రాహ్మణులు. వారు వినోదం చేయడం వలన విప్రవినోదమని పేరు వచ్చింది. బ్రాహ్మణులలో ఒక తెగ బ్రాహ్మణులు దేవతో పాసన వలననో, మంత్ర తంత్రాల వలనో, ఒక విచిత్రమైన గారడీలు చేస్తూ వుంటారు. అష్టావధానాన్ని కూడ చేస్తూ వుంట్ఘారు. ఆంధ్రదేశంలో ఈ వినోదం చేసేవారు అక్కడక్కడా వున్నారు. గుంటుపల్లి ముత్తరాజనే విప్రవినోది గోలకొండ సుల్తానుల తుది కాలంలో వున్నట్లు సురవరం ప్రతాప రెడ్డిగారు తెలియజేస్తున్నారు.

చాటువు

సంతత మారగించు నెడ సజ్జన కోటుల
పూజసేయు శ్రీ మంతుడు గుంటుపల్లి
కుల మంత్రి శిఖామణి ముత్త మంత్రి దౌ
బంతియె బంతి గాక కడుపంద గులా
ముల బంతులెల్ల దూల్ బంతులు దుక్కి
టెల్ల యెడ బంతులు విప్రవినోది
గారడీ బంతులు సుమ్ము ధరాతలంబునన్.

అని వర్ణించాడు. ఈ విధంగా ఆ కాలంలో విప్ర వినోదాలు జరుగుతూ వుండేవి. విప్రవినోదం చేసేవారు ఆంధ్ర దేశమంతటా వున్నట్లు మనకు ఆధారా లున్నాయి.

మాణిక్యాల పురం విప్ర వినోదులు:

తెలంగాణాలో ఈ విప్ర వినోదులు కరీంనగర్ జిల్లా మాణిక్యాల పురంలో వున్నట్లు తెలుస్తూంది. వీరి వృత్తి విప్రులను యాచించడమే. వీరి ప్రదర్శనం కూడ ఇంద్రజాలమే. వీరి దళ సభ్యులు నలుగురుంటారు. వీరి ప్రదర్శనం విప్రుల ఇండ్లలోనూ, విశాల బహిరంగ స్థలాల్లోనూ కూడ ప్రదర్సిస్తారు. వీరి ప్రదర్శన సామాగ్రి అయిదు శాలువలు, ఒక కొయ్య అలమారా, ఒక తాళపత్ర గ్రంథం, రెండు జతల తాళాలు. ప్రదర్శనం విశాల ప్రదేశంలో ఒక చిన్నపందిరిలో జరుగు తుంది. పందిరి చుట్టూ శాలువలు కడాతారు. ఆ తెరల మధ్య ఖాళీ అలమారా వుంచుతారు. ఇరువురు వ్వక్తులు చెరో ప్రక్క చేరి తాళాలతో భజన చేస్తారు. ఇంతలో ప్రేక్షకులు గుమి కూడతారు. తెరలన్నీ ఎత్తి ఖాళీ అలమారా చూపిస్తారు. తరువాత దళ సభ్యుడు ప్రాచీన తాటాకుల గ్రంథంతో తెరల మధ్యకు వెళతాడు. ఒక పావు గంట వరకూ ఆయన బయటకు రాడు. ఈ లోగా భజన జరుగుతూనే వుంటుంది. లోపల ఏం జరుగుతూందో అనే ఆసక్తి ప్రేక్షకులలో రేకెత్తిస్తుంది.

ఇంతలో తెరను తొలగిస్తారు. అదివరకు ఖాళీగా వున్న అలమారాలో దేవతా విగ్రహాలు, దీపారాధన కుందులూ, పుష్పాలూ, ఫలాలూ, పిండివంటలూ, గంట, శంఖం వివిధ పూజా పాత్రలు అనేక రకాల పిండి వంటలు ప్రత్యక్షమౌతాయి. అలాగే ఒక మామిడి టెంకను పాతి పెట్టి పది నిమిషాల్లో అడుగు ఎత్తున పెరిగిన మామిడి మొక్కను చూపిస్తారు. ఈ ప్రదర్శనం ప్రేక్షకులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. ప్రదర్శనానికి ముందే అలమారాలను పరీక్షించ వచ్చు. అంతే కాక వీరు ఇంటింటికి తిరుగునప్పుడు విగ్రహాలను, కప్పలను చిలకలను, విభూతిని అరచేతిలో సృష్టించి ఇంద్రజాల మహేంద్రజాల విద్యను ప్రదర్శిస్తారు.

రాయలసీమ విప్రవినోదులు:

విప్రవినోదులు జాతర్ల లోనూ, తిరునాళ్ళలోనూ, గుడారాలను నిర్మిస్తారు. ఈ గుడారాల్లో రామాయణం మొదలైన కథలను అత్యద్భుతంగా చిత్రిస్తారు.

వీరు గొప్ప మాటకారులు, హాస్య ప్రియులు. చెప్పింది చెప్పకుండా చెపుతారు. ప్రేక్షకులను తమ హాస్య ప్రసంగాలతో ఆనందంలో ముంచెత్తుతారు.

వీరు భలే తమాషాలు చేసి, ప్రేక్షకులను ఆనంద పరుస్తారు. వీరు ముందు మన పేరు అడిగి తెలుసుకుంటారు. దూరంగా వుండే తమ జట్టు వారికి అర్థమయ్యే రీతిలో, పద్యాలద్వారా, సైగలు ద్వారా, మన పేరును తెలియ చేస్తారు. వారు అక్కడ నుంచే మన పేరులను వారితోనే చెప్పించి చుట్టూ మూగిన ప్రేక్షకులను ఆశ్చర్య చికితుల్ని చేస్తారు.

వీరు రాయల సీమ ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా ప్రదర్శనలిచ్చే వారు. ఈ నాడు వీరి జాడవున్నట్లు అధారాలు లేవు.

విప్రవినోదుల రోప్ ట్రిక్:

విప్రవినోదులు ఆ రోజుల్లో రోప్ ట్రిక్ ను చేసేవారు. అంటే ఒక త్రాడును ఆకాశంలో ఎగరేస్తే అది అలాగే నిలబడితే, దానిమీద మనిషి ఎక్కి అంతర్ధాన మయ్యేవాడట. ఎలా మాయమయ్యేవాడో వివరంగా ఇంద్ర జాలం శీర్షికలో వివరించ బడింది.

ఇలా ఆరోజుల్లో రోప్ ట్రిక్ చేసే విప్రవినోదులు, కృష్ణా నదీ ప్రాంతంలో నివసించేరారట. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో ప్రదర్శించిన ఒక అద్భుత కార్యం. ఆ కాలంలో మన దేశానికి వచ్చిన విదేశీయు లెందరో ఈ అద్భుతమైన ఇండియన్ రోప్ ట్రిక్ ను ఎంతగానో ప్రశంచించారు. ఇది విప్ర వినోదుల విద్య.