తెలుగువారి జానపద కళారూపాలు/మహత్యాల తిరుపతమ్మ మల్లేలాట

వికీసోర్స్ నుండి

మహత్యాల తిరుపతమ్మ మల్లేలాట


అమ్మా సత్తెం చూడండీ మల్లేలా, మాయమ్మా సత్తెం చూడండీ మల్లేలా, మల్లేలా, దేవర సత్తె చూడండీ మల్లేలా, మల్లేలా అంటూ దేవ పెట్టెను నెత్తిన పెట్టుకుని నాలుగు బజార్లు కలిసే చోట మన సమూహం మధ్య ప్రదర్శన లిచ్చే వారిని ఈ నాటికి ఆంద్ర దేశఫు పల్లెల్లో అక్కడక్కడా చూస్తూ వుంటాము.

భార్యా భర్తలైన స్త్రీ పురుషులు ఈ ప్రదర్శనాన్ని ఇస్తూ వుంటారు. స్త్రీ దేవర పెట్టెను నెత్తిన పెట్టుకుని నడుంకు కట్టుకున్న వీరణాన్ని వాయిస్తూ వుంటే, పురుషుడు కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, మోకాళ్ళ క్రింద వరకూ రంగు రంగుల గల కుచ్చీళ్ళు పోసిన లంగా కట్తుకుని, జుట్టును విరబోసి, ముఖాన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, చేతి దండలకు దండ కడియాలు ధరించి, చేతిలో జనపనారతో పేన బడిన పసుపు పూసిన పొడగాటి కొరడాను చేత బట్టి, వీరణం వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, మధ్య మధ్యన కొరడా చివరి భాగంతో దండ చేతికి గాయం చేస్తూ, రక్తాన్ని స్రవింప జేస్తూ, ఆ రక్తాన్ని పెట్టెలో వున్న దేవర ముందు తర్పణ చేస్తూ, చుట్టు మూగిన ప్రజలను ఆశ్చర్య చకితుల్ని చేస్తూ, పెట్టె లో నున్న దేవర తనమీద ఆవహించి నట్లు నటిస్తూ, ఒక అతీంద్రియ శక్తిగా భీతావహాన్ని సృష్టించి, కొద్ది సేపట్లో

తన చుట్టూ వందలాది మంది జనాన్ని మూగేలా నానా హంగామా చేస్తాడు. అందర్నీ ప్రసన్నుల్ని చేసుకుంటాడు. ఇక అప్పుడు ప్రదర్శనం ప్రారంభిస్తాడు. ఇది దేవర పెట్టెండి, పెట్టెలో అమ్మోరు సత్తెం చూడండి, అంటూ కొన్ని మాయలను చూపిస్తాడు. వేప మండలను దూసి తేళ్ళను సృస్టిస్తాడు. అమ్మవారిని అందరికీ తెర తీసి చూపిస్తాడు. బొమ్మైన అమ్మవారి చేతుల నిండా గాజులు లుంటాయి. అందర్నీ చూడమంటాడు. తెరను దించేస్తాడు. భార్య వీరణాన్ని ఉధృతంగా వాయిస్తూ వుండగా తాను కొరడాతో ఛెళ్ ఛెళ్ మనిపిస్తూ పెట్టె చుట్టూ నృత్యం చేస్తూ అమ్మారి ముందున్న తెర ఎత్తుతాడు. అంతకు ముందు అందరూ చూసిన గాజులు మాయమై పోతాయి. ప్రేక్షకు లందరూ ఆశ్చర్య చకితులై అమ్మవారు సత్యం గలదనీ, భక్తి భావాన్ని పెంచుకుంటారు. ఇలా కొన్ని మాయలూ,

మంత్రాలతో, కనికట్టు విద్యను ప్రదర్శించి, ప్రేక్షకుల నాకర్షించి, అందరివద్దా చందాలు దండు కుంటాడు. ఈ ప్రదర్శనం పగటి ప్రదర్శనం. ఈ ప్రదర్శనానికి ప్రజలు ముగ్దులై పోతారు.