తెలుగువారి జానపద కళారూపాలు/మొక్కుబడుల గాలపు సిడి ఉత్సవాలు

వికీసోర్స్ నుండి

మొక్కుబడుల గాలపు సిడి ఉత్సవాలు

గాలపు సిడి అతి ప్రాచీనమైనది. తరతరాలుగా భారత దేశంలో ఆయా రాష్ట్రాలలో ప్రసిద్ధి వహించి నటువంటిది. గాలపు సిడి వుత్సవం, జాతరల లోనూ, అమ్మవారి మొక్కు బడుల లోనూ, తిరునాళ్ళలోనూ ప్రాముఖ్యం వహించినా, గాలపు సిడి వుత్సవంలో, పాడే పాటలూ, ఆడే ఆటలూ, నృత్యాలూ, సాము గరిడీలూ, వీరణ వాయిద్యాలూ, కొమ్ము బూరల కోలాహలం కళా రూపాలను ప్రదర్శిస్తారు. ఎంతో ఆసక్తితో ప్రజలు వీటిని తిలకిస్తారు.

ఈ నాటికీ ఆంధ్ర దేశంలో, సూళ్ళూరు పేట మొదలైన చోట్లా, తమిళ నాడులో కొన్ని చోట్లా ఈ ప్రదర్శనాలు మరో రూపంలో జరుగు తున్నాయి.

గాలపు సిడి:

వారి వారి నమ్మకాల ప్రకారం, సిడి తిరుగుతా మని మొక్కు కున్న వారికి సంబంధించింది ఈ గాలపు సిడి.

సిడి మ్రాను కొయ్య అనేది, సిడుల జాతర కోసం, అమ్మవారో లేక వారు నమ్ముకున్న మరో దేవతో ఆ ఆలయాల ముందు నాటిన స్థంభం.

మ్రొక్కుకున్న వారి వీపులో నుంచి ఇనుప గాలమును గుచ్చి, సిడి మ్రాను కొయ్యకు కట్టి తిప్పేవారు. దీనిని గాలపు సిడి అనేవారు.

గంప సిడి:

పై విధానాన్ని కొనసాగించ లేని వారిని గంపలో కూర్చుండ బెట్టి, అలాగే త్రిప్పే విధానాన్ని "గంప సిడి" అనేవి కూడా ఒకటి వుండేది. సిడి అంటే మొద్దు లాంటి ఈటి అని బ్రౌణ్య నిఘంటువులో ఉదహరింపబడింది.

అంబోధరము క్రింద నసిమాడు
నైరావతియు బోలె సిడి ప్రేలెఁదెఱవయోర్తు

అని పాండురంగ మహాత్య ములో మూడవ అశ్వాసం, 77 వ పద్యంలో అమ్మవారి జాతరలో ఒక స్త్రీ సిడి తిరుగుటను గూర్చి వ్రాయబడి వున్నది.

క్రీ.శ. 15 వ శతాబ్దంలో దక్షిన హిందూ దేశంలో పర్యటించిన పోర్చు గీసు చరిత్ర కారుడైన బర్బోసా గ్రామ దేవతల కొలువులో జరిగే సిడి ని చూసి ఇలా వర్ణించాడు. ఈ దేశపు స్త్రీలు, దేవతల్ని కొలవడంలో అతి ఘోరమైన సాహసాలు చేస్తారని ఈ విధంగా వివరించాడు.

ఒక స్త్రీ ఏ పురుషుడినైనా ప్రేమించి అతణ్ణి పెళ్ళి చేసుకో తలచి నట్టైతే, అతనిని తకకు భర్తగా ప్రసాదిస్తే తాను ముందుగా వచ్చి, ఒక గొప్ప మ్రొక్కుబడి చెల్లిస్తానని దేవతకు మ్రొక్కు కుంటుంది.

ఆమె వరించిన పురుషుడు ఆమెను వివాహమాడడానికి అంగీకరించి నట్లైతే, తాను అతనిని వివాహ మాడడానికి ముందుగా తన రక్తాన్ని ఫలానా దేవతకు ధార పోస్తానని తాను మ్రొక్కు చెల్లించి రావాలనీ చెపుతుంది.

ఆ తరువాత ఆ అమ్మాయి మ్రొక్కు తీర్చడానికి ఒక ముహూర్తాన్ని ఏర్పరుస్తారు. ఆ రోజు ఒక సిడి మ్రానును తయారు చేస్తారు.

ఒక పెద్ద మ్రాను లాంటి స్థంభానికి ఏతము లాంటి ఒక వాసాన్ని కట్టి దాని చివర ఇనుప కొక్కెము లాంటి రెండు గాలాలను తగిలిస్తారు.

సిడి బండి:

ఒక పెద్ద ఏతంలాగ కనబడే ఈ విచిత్రపు యంత్రాన్ని ఒక రెండెడ్ల బండి మీదికి ఎక్కించి గుడి దగ్గరకు తోలుకొని వెళతారు. ఆ మ్రొక్కుకున్న అమ్మాయి తన బంధువులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, భాజా భజంత్రీల తోనూ ఊరేగుతూ గుడి దగ్గరకు వస్తుంది.రకరకాల అంగళ్ళూ, ఆటగాళ్ళూ, వాయిద్య గాళ్ళూ, పాట గాళ్ళూ, నృత్యం చేసేవారూ, భజనలు చేసే వారూ, కోలాటాలు వేసేవారూ కోలాహలంగా మూగి వుంటారు.

గాలపు సిడిని ధరించే ఆ అమ్మాయి తలారా స్నానం చేసి, తల విరయ బోసుకుని వుంటుంది. ఒంటిమీద కట్టుకున్న వస్త్రం తప్ప ఇతర అలంకారా లేమీ వుండవు. గుడి దగ్గర సిడి మ్రాను పెట్టి వున్న బండి దాగ్గరికి ఆవిడ రాగానే ఏతాము కొయ్యను క్రిందికి దింపుతారు. దాని చివరనున్న గాలపు కొక్కెమును ఆ అమ్మాయి వీపు చర్మానికి గ్రుచ్చి పైకి లేవనెత్తి నపుడు, కండ పూడి రాకుండా, దిగివున్న గాలపు కొక్కెము పైభాగాన్ని ఆవిడ నడుముకు చీర చెంగును గట్టిగా బిగించి కడతారు. ఒక ప్రక్క రక్తం కారుతూనే వుంటుంది ... ఆ అమ్మాయి ఎడమ చేతి కొక పొట్టి కత్తి నిస్తారు. కుడి చేతిలో నిమ్మ పళ్ళు వుంటాయి. ఆ తరువాత ఆ సిడి మ్రాను కొయ్యను పైకి వేవనెత్తుతారు. దానితో పాటు ఆ అమ్మాయిని కూడ పైకి లేవనెత్తుతారు. ఈ దృశ్యాన్ని చూసిన జన సందోహమంతా జయ జయ ధ్వానాలు చేస్తూ అరుస్తారు. సిడి మ్రాను త్రిప్పుతూ వుంటే, ఆ అమ్మాయి గాలానికి తగులుకున్న చేపలాగ ప్రేలాడుతూ వుంటుంది. చూసే వారికీ దృశ్యం చాల భయంకరంగా వుంటుంది. ఆ అమ్మాయి మాత్రం ఎంత భాధ వున్న కిక్కురు మనదు. పైగా తన్మయత్వంతో తన చేతిలో వున్న కత్తిని అటూ ఇటూ ఝుళిపిస్తుంది. కాబోయే తన భర్త మీదికి తన చేతిలోని నిమ్మకాయలను విసురుతుంది.

ఇలా కొంత సేపు ఆ సిడి మ్రాను కొయ్యను గిరగిరా త్రిప్పి, ఆ తరువాత ఆవిడను క్రిందికి దింపుతారు. ఆ రక్తపు గుడ్డలతోనే, ఆవిడ ఆ గుడిలోనికి వెళ్ళి దేవతా దర్శనం చేస్తుంది. తరువాత ఆమె గాయానికి కట్టు కడతారు. ఆ అమ్మాయి తాహతును బట్టి, ఆ గ్రామ దేవతకూ అక్కడ చేరిన బ్రాహ్మణులకూ దానాలు ఇస్తుంది. పేద వాళ్ళకు అన్నదానం చేస్తుంది. అక్కడికి వచ్చిన పెద్దలను సత్కరిస్తుంది. ఇలాంటి సిడుల వుత్సవాలు సాధారణంగా దుర్గ గుడి దగ్గర జరుగుతాయి. వుత్సవానంతరం మ్రొక్కుబడి తీర్చిన ఆ అమ్మాయి ఎంతో సంతృప్తిని పొందుతుంది.

వంగ రాష్ట్రంలో:

వంగ రాష్ట్రంలో (అంటే ఈనాటి బెంగాల్) దుర్గా దేవికి ప్రీతి పాత్రంగా చేసే చరత్కుపూజ యనే వుత్సవాలలో ఇలాగ సిళ్ళు తిరిగటం అనాదిగా జరుగుతూ వుంది. 1823 -26 మధ్య కలకత్తాలో ప్రధాన (క్రైస్తవ మతాధికారిగా వున్న బిషప్ హెబస్రు గారు దేశంలో తాను చూసిన విషయాలన్నిటినీ తన దినచర్యా గ్రంథంలో ఇలా వర్ణించారు. 1824 వ సంవత్సరం, ఏప్రిల్ 9 వ, తేదీన తాను చూసిన "చరత్కుపూజ" జాతరలో తాను చూసిన ఒక సిడిని వర్ణించాడు.

ఏనుగుల వీరాస్వామయ్య:

దక్షిణ భారత దేశానికి చెందిన ఏనుగుల వీరాస్వామయ్య గారు కాలి నడకను కాశీ యాత్ర చేస్తూ ఆయన చూసిన విషయాలను గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథంలో పైన హెబరు గారు ఉదహరించిన చరత్కుపూజా భానుపొడా అనే ఉత్సవ సందర్బంలో సిడు లాడడం తాను చూసినట్లు తమ కాశీ యాత్రలో వుదహరించారు.

ఈనాటికీ తమిళనాడులో:

ఈనాటికీ తమిళనాడులో ఆయా జిల్లాలలో ఇలాంటిగాలపు సిడి అక్కడక్కడ జరుగునేనే వుంది. అయితే అధికారులు దీనిని నిషేధిస్తూ వుంటారు. ఈ నాడు గాలపు సిడి మార్పు చెందింది. చేతిలో కత్తి వున్న ఇల కొయ్య బొమ్మను తయారు చేసి రంగు రంగుల హంగులతో అలంకరించి, అమ్మవారి తీర్థాల సమయంలో ఊరేగిస్తారు.

సిరిబొమ్మ తీర్థం పేరిట పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సంక్రాంతి పండుగ దినాలలో అమ్మవారి గుడి యెదుట అయిదు రోజులు ఆడిస్తారు. కొయ్య బొమ్మను త్రిప్పుతూ వుంటే చూసే ప్రజలు బొమ్మ మీదికి ఆరటి పళ్ళను విసురుతారు.

సిడి బండి, సుడి బండి:

నా చిన్న తనంలో సిడి వుత్సవాన్ని సుడి బండి వుత్సవంగా కృష్ణజిల్లా వుయ్యూరు వీరమ్మ తిరునాళ్ళలో చూసాను. సుడి బండి అంటే ఎడ్లు లేకుండా మనుషులే బండి వెనుక ప్రక్కను అదిమి పట్టి ముందు పోలును పైకి ఎత్తేవారు. ఇలా ఎత్తడాన్ని సుడి వేయడ మనేవారు. పైకి ఎత్తబడిన ముందు ప్రక్క పోలులుకు ఒక తట్టను కట్టి, ఆ తట్టలో మ్రొక్కు కున్న వారిని కూర్చో పెట్టి మనుషులే ఆ బండిని వూరంతా త్రిప్పి చివరికి

గుడి చుట్టూ త్రిప్పేవారు. ఈ సమయంలో, పండ్లూ పూలు ఆ బండి మీద విసిరేవారు. వాద్యకాండ్రు వీరంగం వేస్తే ప్రేక్షకులు అందుకు అనుగుణంగా నృత్యం చేసేవారు. ఈ దృశ్యాన్ని ప్రజలు విరగబడి చూసేవారు.