తెలుగువారి జానపద కళారూపాలు/బడిపిల్లల దసరా వేషాలు

వికీసోర్స్ నుండి

బడిపిల్లల దసరా వేషాలు

పూర్వ కాలంలో విద్యను నేర్చుకునేందుకు వెళ్ళిన శిష్యులు, గురువుగారికి సకల పరిచర్యలు చేస్తూ విద్యాభ్యాసం చేసేవారు. ఆనాటి మాదిరి ప్రభుత్వం ఇచ్చే నెలజీతాలు మాదిరి జీతాలు వుండేవి కావు. అందువల్ల శిషులిచ్చే గురుదక్షిణ మేదే గురువుల జీవనాధారం జరుగుతూ వుండేది. ఇది తరువాత కాలంలో రూపాంతరం చెంది ప్రభుత్వం వద్ద పుచ్చుకునే జీతాలతో పాడు ఈ దసరా మామూళ్ళను కూడా దండుకునే వారు.

ఒకప్పుడు గురువు గారిని భక్తితో పూజిస్తూ, ఆరాధిస్తూ, గురువు గారి వద్ద నుంచి విద్యాభ్యాసం, ఆశీర్వాదం పొంది, విజయోత్సాహంతో, నిజజీవితంతో ఎటు వంటి ఒడు దుడుకులు లేకుండా జీవనం గడిపేందుకు విద్యాస్వార్థం కోరుకుంటూ, శిష్యులు తమకు తోచిన రీతిలో ఫల పుష్ప, ధన, వస్తు, వాహన రూపాలలో గాని గురువు గారి అభీష్ట ప్రకారం, విద్యాభివృద్ధికి తోడ్పడ గలననే, హామీ రూపంలో గానీ, తమ చేతనైన రూపాలలో గాని ఇచ్చే గురు దక్షిణకు విజయదశమిని ఎంచుకునే వారని చారిత్రిక గ్రంథాలు తెలుపుతున్నాయి.

ఇంటింటా విజయీభవ:

నా చిన్నతనంలో దసరా పండుగకు ఆడ పిల్లలందరూ బొమ్మలు కొలువులు నిర్వహిస్తే ఉపాధ్యాయులు పిల్లల్ని తీసుకుని ప్రతి ఇంటికీ వెళ్ళి గురు దక్షిణను పుచ్చుకునేవారు. పిల్లలందరూ కొత్త బట్టలు కట్టుకుని కొంతమంది రంగు కాగితాల జండాలను పట్టుకుంటే కొంత మంది విల్లంబులను, మరి కొంతమంది ఆడించే హనుమంతుడి బొమ్మల్నీ పట్టుకుని ఒక దండుగా బయలు దేరి __ జయీభవా, దిగ్విజయీభవా అంటూ పాటలు పాడుకుంటూ, ఇంటింటికి తిరుగుతారు.

విల్లంబులు ధరించిన వారు; అంబుకు బదులు, అంబు చివర గులాముతో నింపటానికి వీలైన ఒక నాలుగు పలకల పెట్టెను అమర్చి, అందులో గులాము నింపి, ఇంటి యజమానుల మీద సంధించేవారు. మరి కొందరు హనుమంతుని చెక్క బొమ్మల్ని ఒక పుల్లకు అమర్చి, బొమ్మ కొక తాడును కట్టి లాగుతూ వుంటే హనుమంతుడి బొమ్మ గుప్పి గంతులు వేసినట్లు అందర్నీ నవ్వించేవి. ఇలా ప్రతి ఇంటి ముందూ పిల్లలందరూ విన్యాసం చేస్తే ఇంటి యజమాని అయ్యవార్లకు పారితోషికం ఇచ్చేందుకు వెళ్ళబోతూండగా పిల్లలందరూ ఎక్కువ మొత్తాన్ని రాబట్టేందుకు ఇలా మొదలెట్టే వారు.

పావలా బేడైతే, పట్టేది లేదు
అర్థరపాయిస్తే అంటేది లేదు.
మూడు వరహాలిస్తే ముట్టేది లేదు,
అయ్యవార్లకు చాలు అయుదు వరహాలు,
పిల్లలకును చాలు పప్పు బెల్లాలు.
జయీభవ జయీభవ,
దిగ్వి దిగ్విజయీభవ.

అంటూ అయ్యవార్లకు ఎక్కువ మొత్తాన్ని రాబట్టే వారు. ఇలా ఊరిలో పిల్లలందరి ఇళ్ళకూ వెళ్ళి, ఎక్కువ మొత్తంలో వసూలు చేసేవారు.

పిల్ల తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తోటి పిల్లలతో రావటం వల్ల ఘనంగానే దక్షిణ లిచ్చేవారు. ఒక ప్రక్క పిల్లలు ఎంతో ఉత్సాహంతో ముచ్చటపడుతుా వుంటే, గురు దక్షిణలు అందుకున్న ఉపాధ్యాయులు, పారితోషికాలతో సంతోషపడిపోయేవారు.

ఇలా ప్రారంభమైన దసరా మామూళ్ళు, రాను రాను గురు శిష్య సంప్రదాయాన్ని వదిలి ప్రభుత్వ శాఖలలో వున్న వారు సాంఘీక

ఆరాచక శక్తులు ఈనాడు మామూళ్ళు వసూలు చేస్తున్నారు. గురువుల స్థానంలో దుష్ట శక్తులు విజృంభించాయి ఈనాడు.