తెలుగువారి జానపద కళారూపాలు/బంధం - అనుబంధం

వికీసోర్స్ నుండి

బంధం - అనుబంధం

ఆ యా రాష్ట్రాల జానపద కళా విన్యాసం

తరతరాలుగా ప్రజల నుర్రూతలూగించిన జానపద కళా రూపాలు ప్రజలలో ఎంతటి సంచలనాన్ని కలిగించాయో, అవి ప్రజా జీవితంలో ఎలా పెనపేసుకుపోయాయో, వారి వినోద విజ్ఞాన వికాసాలకు ఎంతగా తోడ్పడ్డాయో, క్రమానుగతంగా ప్రజాదరణ లేక ఎంతగా శిధిలమై పోయాయో ఈనాడున్న కళా రూపాలు ఎలా కృశించిపోతున్నాయో పైన వివరంగా తెలుసుకున్నాం.

అలాగే ఆయా సోదర రాష్ట్రాలలో ఆయా జాతుల, మతాల, భాషల, సాంస్కృతిక వ్వవహారాల కనుగుణంగా, ఆదిమ కాలం నుండి ఆధునిక కాలం వరకూ ఎన్నో జానపద కళా రూపాలు అభివృద్ది పొందాయ్హి. ప్రజలను ప్రభావితం చేశాయి. మన కళారూపాలను గురించి తెలుసు కోవడంతో పాటు, ఇతర రాష్ట్రాల కళారూపాలను గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.

కర్ణాటక:

మన ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తమిళ, కన్నడ, మళయాళ, మహారాష్ట్రా కళారూపాలకూ ఎంతో సారూప్యముంది. మన రాష్ట్రంలో వున్న కళారూపాలు కొన్ని కన్నడ రాష్ట్రాలలో వున్నాయి. అలాగే తమిళ నాడులో వున్నాయి. ఒకప్పుడు ఈ రాష్ట్రాలన్నీ ఒకే రాజుల ఏలుబడిలో వుండటం వల్ల, ఒకే రకమైన కళారూపాలు కూడా అభివృద్ధి చెంది వుంటాయి. అలా చూసుకున్నప్పుడు మన తోలుబొమ్మలూ, యక్షగానాలు, బుట్ట బొమ్మలూ, పాముల వాడి నృత్యాలు, కీలుగుఱ్ఱాలూ, హరికథలూ మొదలైనవి అనేకం వున్నాయి.

ముఖ్యంగా కర్ణాటకలో అత్యంత ప్రాముఖ్యత వహించేవి యక్షగానం, పురవి అట్టం, నంది కోళ్ కుణితి, వీరభద్ర కుణితి, రంగద కుణితి, వీరముఖల్ కుణితి, తూరి కుణీతి మొదలైనవి ముఖ్యంగా వున్నాయి. కుణితి అంటే నృత్యం. అలాగే 'గారుడి బొంబె ' అన్న కళా రూపం చాల ముఖ్యమైనదంటారు ప్రొఫెసర్ ఎస్. గంగప్ప గారు నాట్యకళ, జానపద కళల ప్రత్యేక సంచికలో పౌరాణిక సంబంధమైన కళారూపాలలో భాగవత కాలజ్ఞాని, గమకి, కీర్తనకార, ప్రవచనకార, జంగమ, గొరవ, గొండలిగ, కథగార, హాస్యగార, నకలినట్టువ, బహురూపి, హగలు వేష ఆట. అంటే మన పగటి వేషాల మాదిరి. అలాగే కొలిబసవ (గంగిరెద్దాట), మారమ్మ, దాసరాట మొదలైన వన్నీ మన తెలుగుదేశంలో వున్నట్లే వున్నాయి.

కేరళ

కేరళలో ప్రసిద్ధి గాంచిన నృత్యాలలో కథకళి చాల ముఖ్యమైంది. దానిని శాస్త్రీయ నృత్యంగానే బావిస్తారు. అలాగే పూజా సమయంలో 'పులయనులు ' పూనకం అనే నృత్యాన్నీ, ఓనం పండుగ సమయంలో 'కై కొత్త కళి ' అన్న నృత్యాన్ని, కుమ్మి నృత్యాన్ని చేస్తారు. తెలుగు దేశంలో వున్నట్టే ఇక్కడ కూడ తోలుబొమ్మలాటలు, కోలాటం, హరికథ మొదలైన కళారూపాలున్నాయి. అలాగే పాలఘాట్ అడవులలో గిరిజనులు చేసే 'ఎవేలకరడి ' అనే వేట నృత్యముంది. మలబారు ప్రాంతంలో కఱ్ఱ ముక్కలు పట్టుకుని చేసే 'మొప్లాహ్కళి' వీరనృత్య ముంది. అలాగే మహాభారత యుద్ధ గాథలకు సంబంధించిన 'వెలక్కలి' వీర నృత్యముంది. కేరళలో అందరినీ ఆకర్షించే పడవ పందాలు వున్నాయి. పందాలు అయిన తరువాత పల్లెల్లో యువతులు 'అట్టపూ' అనే నృత్యం చేస్తారు.

తమిళనాడు

తమిళనాడులో శాస్త్రీయ నృత్యంగా భరతనాట్యం అధిక ప్రాముఖ్యం వహిస్తూ వుంది. అయితే తమిళ ప్రాంతంలో అధిక ప్రచారంలో వున్న నృత్యం తెరుకూత్తు. ఇది సంగీత ప్రధానమైన జానపద బయలు నాటకం. ద్రౌపదీ హరణం ప్రధాన ఇతి వృత్తం. ముఖ్యంగా దేవాలయాలలో దీనిని ప్రదర్శిస్తారు.

అలాగే 'కొరవంజీ' కీలు గుఱ్ఱాల ఆట వుంది. అలంకరించిన ఇత్తడి బిందెను నెత్తి మీద పెట్టుకుని చేసే చిందు నృత్యం కన్నుల పండువుగా వుంటుంది. అలాగే కోలాటం, కుమ్మి, గరగ మొదలైన స్త్రీలు చేసే నృత్యాలు అధిక ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాయి. ఇవి ఆంధ్రదేశంలో కూడా ప్రచారంలో వున్నాయి.

మహారాష్ట్ర

ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరే మహారాష్ట్రంలో తోలుబొమ్మలాటలు, యక్షగానం, హరికథ వున్నాయి. మహారాష్ట్ర ప్రజలు చూచి ఆనందించే జానపద నాట్యం.

తమాషా, ఆరుబయలు రంగస్థలంలో మూడు వైపుల తెరువబడి వుంటుంది. విఘ్నేశ్వర ప్రార్థనానంతరం వాద్య బృందం వారు మంచి కోపులో పాటలను వినిపిస్తారు. తరువాత గోపీ నృత్యం వుంటుంది. ఇందులో సంవాదంతో కూడిన నృత్యాలు కొంతవరకు అసభ్యంగా వుంటాయి. సంగీత బాణీలు మంచి రక్తి నిస్తాయి. ఈ నాట్య బృందాన్ని 'ఫడ్ ' అంటారు. డప్పు తుం తుం న్యా, అనే వాయిద్యాలను వాయిస్తారు. మధ్య మధ్య లావణీకి సంబంధించిన శృంగార, వీర గీతాలను ఆలాపిస్తారు.

మహారాష్ట్రలో దీపక్ నృత్యమూ, లేజిక్ నృత్యమూ బహుళ జనాదరణలో వున్నట్లు డా॥డి.వై. సంపత్ కుమార్ నాట్యకళ జానపద కళల ప్రత్యేక సంచికలో ఉదహరించారు.

గోకులాష్టమి నాడు 'దహిబండి ' అనే నృత్యం చేస్తారట. దహి అంటే పెరుగు. పాలు, పెరుగుల దొంగిలించే శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన నృత్యాలు చేస్తారు.

లలిత ముద్ర అనే నృత్యాన్ని మధ్య యుగం నుంచి సంప్రాదాయంగా ప్రదర్శిస్తున్నారు. ఒకనాడు పౌరాణిక గాధలకే ప్రాముఖ్యం వున్నా, ఈనాడు దైనందిన జీవితంలో తారసిల్లే పాత్రలను దృష్టిలో పెట్టుకుని వ్వంగ్యంగా చిత్రిస్తున్నారు. లలిత మంటే నవ రాత్రికి జరిగే వుత్సవాలలో చేసే సంగీత కీర్తనలు.

అలాగే "గోంఘళ్" నృత్యాన్ని చేస్తారు. ఈ నృత్యాన్ని ప్రదర్శించే వారు 'గోంఘల్ ' అంటూ పాట పాడుతూ నృత్యం చేస్తూ, అంబా దేవిని ప్రార్థిస్తారు. వివాహ సమయాల్లో ఈ ప్రదర్శనాలను ఏర్పాటు చేస్తారు.

"ధోలానాచ్ " "దశావతార ", "తరవ", "కోలయానాచ్"(జాలరి నృత్యం) "రాధా నృత్యం", "దిండి" , "కూట", "తిప్రి", "గోప నృత్యం", "గౌరీ గణ పతీనాచ్", "బోహడ" అఏ జానపద నృత్యనాటకాలు, బాలికలు చేసే "పుంగడి"నృత్యాలు మొదలైనవి మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందాయి.

రాజస్థాన్

జానపద కళారూపాలకూ, జానపద నృత్యాలకు రాజస్థాన్ ప్రముఖ స్థానం వహించింది. రాజస్థాన్‌లో వివాహ సందర్భాలలో ఝోరియా అనే నృత్యం పేరు పొందింది. ఝోరియా అంటే కొయ్య కఱ్ఱలు పట్టుకుని వలయాకారంగా ఏర్పడి కఱ్ఱలు కొడుతూ లయబద్ధంగా నృత్యాలు చేస్తారు. ఈ నృత్యం ఎంతో ఆకర్షణీయంగానూ, ఉత్తేజ కరంగానూ వుంటుందంటారు సంపత్ కుమార్. అలాగే దేవీ నవరాత్రి సమయాలలో "గర్భా" నృత్యం చేస్తారు. రాజపుత్ర స్త్రీలు పాటలు పాడుతూ చేసే "మౌహులో" , "ఫండారో" నృత్యాలు సాంప్రదాయ నృత్యాలుగా వర్థిల్లాయి. ముఖ్యంగా ఈ నృత్యాలను వివాహ సందర్భాలలో చేస్తారు.

తర్ తల్వార్ కత్తి సాము నృత్యాన్నీ , డోలు నృత్యాన్నీ హోలీ పండుగలో గీర్ నృత్యాలను పురుషులు అత్యద్భుతంగా చేస్తారు.

అంతే కాక అజ్మీరులోని "సస్సేల" జానపద నృత్యాలనూ మౌంటు అబూ లోయలో గిరిజనులు చేసే గరాసియాలనూ, 'ఖయాల్ ' అనబడే నృత్య నాటకాలను రాజస్థాన్ ప్రభుత్వం గుర్తించి వాటిని పోషిస్తూ వుంది. భవాయి అనే కులంవారు అయిదు వందల సంవత్సరాలుగా ఈ నృత్య నాటకాలను ప్రదర్శిస్తూ వున్నారు. వారి జీవితాలను అందుకే అంకితం చేసి ఆ కళారూపం ద్వారానే జీవిస్తున్నారు.

రాజస్థాన్ జానపద నృత్యాలకు పేరెక్కిన గన్న రాష్ట్రం. నెత్తిమీద బిందెలు పెట్టుకుని ఆడే "తేరాతావీ" నృత్యమూ, వెదురు కఱ్ఱలతో తయారు చేసిన గుఱ్ఱాన్ని భుజాలకు తగిలించుకుని ఆడే "కుచ్చిఘోరి నృత్యం" పూజా సందర్భాలలో ఆడే గౌరి నృత్యం ప్రశంసించ తగ్గవి.

అస్సాం:

ఎక్కడో ఈశాన్య సరిహద్దు రాష్ట్రమైన సౌరాష్ట్రంలో నాగ నృత్యాలు ఎంతో పేరు పొందాయి. ఋతువులకు సంబంధించిన "వైశాఖి నృత్యం", "బిహు నృత్యం" . "ఖాశీ నృత్యం". పగలంతా కష్ట పడి సాయం సమయంలో చేసే బగురుంబ నృత్యాలు, పంటల సమయంలో "మెయ్ గెనెయ్" నృత్యాలు లూషై కొండల్లోనూ, బ్రహ్మ పుత్ర లోయలలో చేసే వెదురుగడల నృత్యం, మిజో జాతి గిరిజనులు చేసే "భౌల్ల నృత్యం" , "గారో నృత్యం" , "మిరిహుషారీ నృత్యం" బోడో జాతి వారి యుద్ధ నృత్యాలు, జైత్య జాతి వారి "లాహా" అనబడే మత సంబంధమైన నృత్యాలు, నాగా జాతి వారి త్రిశూల నృత్యాలు, కోడి పుంజుల పోట్లాట నృత్యాలూ, యుద్ధ నృత్యాలూ ఎంతో ప్రఖ్యాతి వహించాయి.

మణిపురి

భారతీయ శాస్త్రీయ నృత్యాలలో మణిపురి లాలిత్య నృత్యం ఎంతో ప్రఖ్యాతి వహించిన నృత్యం. అలాగే భక్తి సంబంధమైన "రాస నృత్యం", లాయ్ హెరోబ, ఈబల్ చోంన్ భీ - ఖంబడోయంబి (శివ పార్వతుల నృత్యం) "పుంగ్ చోలం నృత్యం" హోలీ పండుగలో చేసే ధాబల్ చోబీ నృత్యం, గిరిజనుల నృత్యమైన హెలోయ్ నృత్యం , "ముఖోరిళా" నృత్యం, కబయ్ నాగ జాతి వారు చేసే "ఫైచర్" పోన్ సాలం, "టెండన్ ఫెయ్ బోక్" మొదలైన జానపద నృత్యాలు ఎంతగానో ప్రాముఖ్యం వహించాయి.

అలాగే బర్మా సరిహద్దు కొండలలో అడవులలో వున్న "సంగ్ తం" నాగజాతివారు ఒకరికి గౌరవార్థం చేసే విందులో "నెరిచుంగ్టి" నృత్యమూ, వేటకు బయలు దేరే సమయంలో చేసే "సంగ్ ఫా నృత్యం" గ్రామాలను దాడి చేసే ముందు "బయక్ సుట్ సుక్" నృత్యాలను చేస్తారు.

భూటాన్ ప్రాంతంలో బౌద్ధ మత సాంప్రదాయా నృత్యాలు చేస్తారు. ఇవే "లేపాచ్", "షాప్ ధో" నృత్యాలుగా ప్రసిద్ధి పొందాయి.

మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ లో గోడులు చేసే "కర్మా నృత్యం" భిల్లులు చేసే "జబురియా నృత్యం" , "లడా లడీ" నృత్యాలూ ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి.

"కట్ పుత్లీ" అనే బొమ్మల నృత్య ప్రదర్శనం, మధ్యప్రదేశ్ కు చెందిన జానపద కళారూపాలలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. భారత రామాయణగాథల్ని బొమ్మల చేత అభినయం చేయిస్తూ నృత్యం చేయిస్తూ ప్రదర్శిస్తూ వుంటారు.

బస్తరు జిల్లాలో గిరిజనులు పౌర్ణమి నాటి రాత్రి "నవరాణి" నృత్యాన్ని, మాఘ మాసంలో "దేవరీ" నృత్యాన్ని, చైత్ర మాసంలో "చైత్ర దండ" నృత్యాన్ని శ్రావణ మాసంలో "ఘోంగా" నృత్యాన్నీ చేస్తారు.

బెంగాల్

బెంగాల్‌లో ఆదిమ వాసులు చేసే "సంతాల్" నృత్యమూ, వివాహ సమయాలలో చేసే "గులేరియా" నృత్యమూ, దసరా సందర్భంలో దుర్గాపూజలనాడు చేసే "బత్రా" నృత్యమూ, పంట కోతల ముగిసిన తరువాత చేసే "బౌలు" నృత్యమూ చూడ ముచ్చటగా వుంటాయంటారు సంపత్ కుమార్ గారు.

పంజాబు

పంజాబు జానపద కళారూపాలలో పేరెన్నిక గన్నదీ, ప్రజల నెక్కువగా ఆకర్షించేది భాంగ్రా నృత్యం. గోధుమ విత్తనాలను చల్లే సమయంలో ఎంతో ఆనందంగా సామూహికంగా ఈ భాంగ్రా నృత్యాన్ని దేస్తారు. ఈ నృత్యాన్ని భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు మెచ్చుకోవటమే కాక విదేశీయుల మన్ననలను కూడ అందుకుంది. అలాగే "కులూ లోయ"లో చేసే "ఖడ్గ నృత్యం" కూడా చెప్పుకో తగిందే. పంజాబులో ప్రత్యేకంగా చేసే "గిడ్డ" నృత్యమూ, పురుషులు చేసే మరో నృత్యం "ఝమర్" నృత్యమూ చెప్పుకోతగివవి. అలాగే "జామీర్" , "ధృన్" , "సమ్మి లోధి" , "దమల్" అన్న నృత్యాలు కూడ చెప్పుకోతగినవి.

బీహారు

బీహారులో "హో" అనే తెగవారు దేవ పూజ సమయాల్లో చేసే "మాఘే" నృత్యమూ అలాగే వేటలోనూ, యుద్ధ సమయాల్లోనూ చేసే "బౌ" నృత్యమూ, వ్వవసాయ తరుణంలో చేశే "గోంనామా" మొదలైన నృత్యాలు చెప్పుకోతగినవి.

అలాగే ఛోటా నాగ పూర్ ప్రాంతంలో ఒరియన్ జాతి వారు "జదుర్" నృత్యాన్ని, రాంచీ ప్రాంతపు గిరిజనులు "ఖరియాలా" నృత్యాన్నీ, "జిటియా" నృత్యాన్ని చేస్తారు.

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్ లో ఎక్కువ ప్రచారంలోని వచ్చిన "జరాదినటి" నృత్యం ముఖ్యమైంది. ఈ నృత్యంలో బాలబాలికలు పళ్లెములను అత్యంత చమత్కారంగ సుందరంగా వ్రేళ్ళ మీద త్రిప్పుతూ వయ్యారంగా నృత్యాలు చేస్తారు. అలాగే అల్లోరా కొండల్లో, "భోటియా" గిరిజనులు చేసే "రంగ్ భంగ్" నృత్యమూ టెహ్రీగార్వాల్ గిరిజనులు చేసే "ఛౌఫలకేదార" నృత్యమూ శౌర్య ప్రతాపాలను ప్రదర్శించే పాండవ నృత్యమూ బహుజనాదరణ పొందినవంటారు సంపత్ కుమార్ గారు.

సౌరాష్ట్ర

శ్రీ కృష్ణ భగవానుని జీవిత గాథలైన "దాండియా", "రాస నృత్యాలూ", "కోలాట నృత్యాలు", "వల్లీ నృత్యాలూ' అలాగే జాలరుల చేసే "పదర మల్హరి నృత్యాలూ" "హుటాషాని" అనబడే హోలీ నృత్యమూ ఎంతో ప్రఖ్యాతి వహించాయి.

కాశ్మీరు

కాశ్మీరు ప్రాతంలో స్త్రీలు చేసే "క్రజీ" నృత్యమూ, బరెడ్వాలో వున్న కైలాస సరస్సు వద్ద జరిగే ఉత్సవాలలో "గద్దీ" నృత్యమూ సాంప్రదాయ నృత్యాలుగా వర్ధిల్లాయి.

ఒరిస్సా

ఒరిస్సా మయూర్ భంజ్ సంస్థానంలో ప్రపంచ ఖ్యాతి పొంది అనాదిగా వస్తున్న "చౌ" నృత్యాలు, గ్రామీణ నృత్యాలైన "పైర్" గురుద్వాహన్ మాయా "శబరి" నృత్యాలు ప్రసిద్ధి పొందాని. చౌ నృత్యం ప్రత్యేకత, ముఖాలకు మాస్కులు తగిలించుకుని నృత్యం చేస్తారు.

ముఖ్యంగా ఒరిస్సాలో గోండులు దున్న పోతు నృత్యం చేయడం చాల ప్రసిద్ధి అంటారు ఎస్. గంగప్పగారు.