తెలుగువారి జానపద కళారూపాలు/దొమ్మరోళ్ళ దొమ్మరాటలు

వికీసోర్స్ నుండి

దొమ్మరోళ్ళ దొమ్మరాటలు

దొమ్మరాటలు పూర్వ కాలం నుంచీ వున్నట్లు 13 వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో

అమరాంగనలు దివి నాడేడు మాడ్కి
నమరంగ గడలపై నాడేడు వారు

పై రెండు పాదముల వర్ణన ప్రకారం, దొమ్మర సానులు వెదురు గడల పైన ఆకాశంలో అప్సరసలు ఆడుతున్నారంత భ్రమను కలిగించేవారట. అంటే వారు వుపయోగించే ఎదురు గడలు అంత పొడవైన వన్నమాట.

దొమ్మర సానులు పురుషులతో పాటు భూమి మీద వివిధ రకాల పిల్లి మొగ్గలు మొదలైన చిత్ర విచిత్ర ప్రదర్శనాలతో ప్రేక్షకుల్ని దిగ్భ్రమలో ముంచేవారు. చూసే వారికి ఆటలు భయాన్ని కలిగించేవి. వారి ఆటలు పాతిన గడమీదనే కాక, గడను పురుషులు ఎదురు రొమ్ము మీద, నొసటి మీద నిలబెట్టి, ఆ గడలపై దొమ్మర సానులతో తమ తమ విద్యల్ని ప్రదర్శింప చేసేవారు.

దొమ్మరి సానుల ఆటను శ్రీ హర్షుడు సంస్కృత నైషధంలో అలంకారికంగా వర్ణించినట్లు శ్రీనాథుడు శృంగార నైషధంలో ఈ విధంగా వర్ణించాడు.

గడసాని గరడీలు:

ఈ సకలావనీ తలము వెక్కటి దాన పరిభ్రమించి య
భాస పరంపరా పరత నభ్రమునన్ విహరింప గోరియో
తాసిక కీర్తి విభ్రమ కలంగరి మన్నటి యంచు చుండు నీ
రాసుతు వంశ రత్నము దిరంబుగ జెంది యమందలీలన్

(శృంగార నైషధం. 5 అశ్వాసము, 118 పేజీ)

అలాగే

సంత నెన్నడో జవ్వన మమ్ము
కొన్న గడసాని ననుంగవ యందలంచితీ

అని ఊర్వసి పేర్కొన్న గడసాని ఇటువంటిదే అని నాచన సోముని ఉత్తర హరి వంశ 1-74 పద్యంలో ఉదహరింప బడిందని.... (పి.యస్.ఆర్. అప్పారావు గారు, సూత్ర ధారి పత్రికలో వుదయరించారు. )

విజయనగర రాజుల కాలంలో మహర్నవమీ వుత్సవాలలో దొమ్మరాటలు మొదలైన చిత్ర విచిత్రాలను ప్రదర్శించడంతో పాటు ఏనుగులు, పులులు, సింహాలు మొదలైన క్రూర మృగాలతో సర్కసు పనులు చేయించే వారని విదేశీ యాత్రీకుడైన అబ్దుల్ రజాక్ వర్ణించి నట్లు భావరాజు కృష్ణారావుగారు (విదేశీ యాత్రికులు -- ప్రాచీనాంధ్ర దేశం 191 - 192 పేజీలలో) ఉదహరించారు.

అంతే కాక బాపల విద్య లేవీ కూడ దొమ్మరి విద్యలతో సరిపోవని చంద్ర శేఖరుడు తన శతకంలో ఈవిధంగా వర్నించాడు.

మెడ్డుగ దొమ్మరెక్క, గన
మించిన యిద్దమ రేడ లేదు, నా
తెడ్డొక బాప నిద్దెలని
తిట్టును మూర్ఖుడు చంద్ర శేఖరా.

ఈ విధంగా దొమ్మరాటలు చరిత్రలో స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ నాడు పెద్ద పెద్ద సర్కసులని చెప్పుకోబడే వాటికి ఆధారం ఆనాటి దొమ్మరాటలే __

నేటి దొమ్మరాటలు:

ఆయా కాలాలలో చారిత్రకంగా ప్రచారం పొందిన దొమ్మరాటలు, ఈ నాటికీ ఆంధ్ర దేశంలో అక్కడక్కడా దేశ దిమ్మరులైన దొమ్మరుల ద్వారా చూస్తూ వుంటాం. ఒకప్పుడు ప్రజ్ఞ విశేషాలను ప్రదర్శించే సమూహాలుగా వున్న ఈ దొమ్మరి వారు కేవలం ఒకే కుటుంబంలో వున్న వ్వక్తులే. వారి జీవనాధారం కోసం చిన్న చిన్న ప్రదర్శనాల నిచ్చి వచ్చిన డబ్బుతో కడుపు నింపు కుంటూ, ఒక వూరి నుంచి మరో వూరికి పోతూ వుంటారు. ఒకప్పుడు రాజాస్థానాలలో ప్రభువుల సమక్షంలో ప్రతిభా విశేషాలను చూపించిన వీరు బిక్కు బిక్కు మంటూ దిక్కులేని యాచకుల్లాగ బ్రతుకు తున్నారు. ఈనాడు - వీరి ఆలనా, పాలనా చూసే వారే లేరు. వీరిని గురించి అలోచించే వారే లేరు. పట్టించు కోవాల్సిన ప్రభుత్వం సంగతి చెప్ప వలసిన అవసర మేమి లేదు.

నిజానికి పజ్ఞ, ప్రతిభా విశేషాలతో కూడు కొని వున్న ఇలాంటి కళా రూపాలు చచ్చి పోకూడదు.

వాటిని బ్రతికించు కోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందు కంటే, అవి జాతీయ క్రీడా విశేషాలకు సంబంధించిన కళారూపాలు గనుక.

సహజంగా ఈ నాటి దొమ్మర్లు, పంటలు బాగా పండిన తరుణంలో, సంక్రాంతి మొదలైన పర్వదినాలలో దొమ్మరాటల వారు వస్తూ వుంటారు. వంశ పారంపర్యంగా కుల వృత్తిగా స్వీకరించి కుటుంబంలో వున్న వారందరూ చిన్న తనం నుంచే వీటిని అభ్యసించడం వల్ల, కుటుంబ సభ్యులందరూ ఆరితేరినవారై వుంటారు. ముఖ్యంగా వీరి ఆటల్లో మంచి వయసులో వున్న స్త్రీలు ఇద్దరు ముగ్గురుంటారు. ఈ ఆటలకు వీరే ముఖ్య ఆకర్షణ.

వీథిలో ఎదురుగడ:

వీరు ఒక గ్రామంలో ప్రవేశించి పెద్దలందర్నీ కలుసుకుని ప్రదర్శనానికి అనుమతి తీసుకుని, వారిని ప్రదర్శనానికి ఆహ్వానించి, ఊరి మధ్య ఒక పెద్ద ఎదురుగడను పాతుతారు. దానిని నాలుగు ప్రక్కలా నాలుగు బలమైన త్రాళ్ళతో లాగి నిలబెడతారు. వారి దగ్గరున్న డోలును ఉధృతంగా వాయిస్తూ వుంటే, చిన్న పిల్లలు రక రకాల పిల్లి మొగ్గలు వేస్తూ వుంటారు. ఒక్క పదినిముషాల్లో ఊరిలోని వారందరూ గుమి కూడతారు. అప్పుడు ప్రదర్శనం ప్రారంభిస్తారు. ఇది చూడడానికి ఒక వ్వాయామ ప్రదర్శనంగా కనిపించినా, దీనిని ఒక కళా రూపంగానే భావించి ప్రజలు ఆనందం పొందుతారు.

యవ్వనంలో వున్న యువతుల పిల్లి మొగ్గలకూ, చేసే విన్యాసాలకూ, యువకులు తల్ల క్రిందులై పోతారు. ఆట ప్రారంభానికి వంతగా నున్న డప్పు, డోలూ ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. కేరింతలతో, కేకలతో, ఆడా, మగా, గోచీలు పెట్టి దండాలూ, జబ్బలూ, చరుస్తూ అందరూ రకరకాల మొగ్గలు వేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తారు; గారడీ నాయకుడు కొట్టే డోలుకూ, వేసే కేకలకూ అనుగుణంగా రకరకాల విన్యాసాలు చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఎత్తుగా వున్న తీగ మీద ఎదురుగడ బ్యాలెన్సుతో ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్కకు, ప్రథమంలో నెమ్మదిగా నడుస్తూ, తరువాత వేగంగా నడుస్తూ, తీగ మీద నుండి క్రిందికి పడి పోతుందేమో నన్నంత భయాన్ని కలిగిస్తూ తమ తమ నైపుణ్యాన్ని చూపిస్తారు.

గడమీద గిరికీలు:
ఆ తరువాత ఎత్తుగా వున్న స్త్రీ, పురుషుడూ కూడా గబగబా పైకి ఎగ బ్రాకి, శిఖరాగ్రం మీద నిలబడీ, కూర్చునీ, పడుకునీ రకరకాల ఆశ్చర్యకరమైన విన్యా

సాలను చేస్తూ చూపరుల్ని, సంభ్రమాశ్చర్యాలతో ముంచుతారు. అక్కడనుండీ పల్టీ కొట్టి ఎదురుగడకు కట్టిన త్రాటి మీద నుండి ఒక్క నిముషంలో వేగంగా జారి క్రిందికి వస్తారు. అఖరి సారిగా గడ మీదకు స్త్రీ ఎగబ్రాకి గిర్రున తిరుగుతూ, తన చాతుర్యాన్ని చూపిస్తుంది. చుట్టూ చేరిన ప్రేక్షకులందరూ, తలలు పైకెత్తి ఈలలతో చప్పట్లుతో, గడసానిని మరింత ఉత్సాహపరచి ఆనందంలో, ఓలలాడి పోతారు. ఇలా ముగ్దులై పోయిన ప్రేక్షకులను గారడి బృందంలో వున్న పిల్లలూ, పెద్దలూ బాగా డబ్బు దండు కుంటారు. ఇలా ఒకనాడు దొమ్మరాటలు , ఆంధ్ర ప్రజా సామాన్యాన్ని ఉర్రూత లూగించాయి. ఈనాటికీ అక్కడక్కడా చిన్న చిన్న బృందాలను చూడగలం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక చిన్న తరహా సర్కసు, అయినా గడ సాని గడ నెక్కడం ఊరికి మంచిదనే నమ్మకం పల్లె ప్రజలలో వుంది.