తెలుగువారి జానపద కళారూపాలు/కనికట్టు చేసే కాటిపాపల వాళ్ళు

వికీసోర్స్ నుండి

కనికట్టు చేసే కాటిపాపల వాళ్ళు

కాటి పాపల వారు ఆంధ్ర ప్రాంతంలో కూడా వున్నారు. ఈ కాటిపాపల వారు, మెదక్, జిల్లా జహీరా బాద్ తాలూకాలో వున్నారు. కాని ఈనాడు ఆంధ్రదేశంలో కాటి పాపల వారిని గురించి ఎవరికీ తెలుయదు.

వీరిని అందరూ కాటిపాపల వాళ్ళు అంటారు. ఇలా పేరు ఎందుకు వచ్చిందంటే ఎవరూ చెప్పలేరు. కానీ వీరి అసలు పేరు కాటికాపర్లు. వీరి అసలు వృత్తి (కాటిని) శ్మశాన్ని కాపలా కాయడమనీ అందువల్లే వారికా పేరు వచ్చిందనీ, లక్ష్మీకాంత మోహన్ గారు తెలియ జేస్తున్నారు. పూర్వం ఊరి కాపలా వారి మాదిరి కాటి కాపర్లు కూడ వుండే వారు. వీరికి ఊరు వుమ్మడిగా పారితోషికం ఇవ్వబడేది.

అయితే నా చిన్న తనంలో పిల్లల్ని భయ పెట్టటానికి తల్లి దండ్రులు అదుగో కాటి పాపల వాళ్ళు వచ్చారంట అనేవారు. కాటి పాపల వాళ్ళు పిల్లల్నీ పాపల్నీ ఎత్తుకు

పోతారని ఆ రోజుల్లో ప్రతీతి. పాపల్ని ఎత్తుకు పోతారు కనుక, కాటి పాపల వాళ్ళు అనే పేరు వచ్చిందేమో తెలియదు.

వీరిది కూడ ఇంద్రజాల ప్రదర్శనమే. ప్రజలను భయ కంపితులుగా చేసే కళారూప మిది. వీరి వేష ధారణ అతి గంభీరమైనది. ఈ ప్రదర్శకుడు రంగు రంగుల దుస్తులు ధరిస్తాడు. రెండు మూడు పెద్ద గంటలను వ్రేలాడ దీస్తాడు... నడుస్తూ వుంటే ఈ గంటలు చప్పుడు ఏదో ఏనుగు నడుస్తునట్లుగా భీతి పుడుతుంది. నొసటన పెద్ద బొట్టు, వడి తిరిగిన బుర్ర మీసాలు, ఈకల మాదిరిగా చిత్రించిన రేకుల కిరీటం... చంకలో జోలె... చేతిలో ఎముకలు పుచ్చుకొని భూత వైద్యుడిలా ప్రవేసిస్తాడు. వీరి నిత్తి మీద ఇత్తడి రేకుల కిరీటం మినహాయిస్తే, బుడబుక్కల వారి వేష ధారణకూ, వీరికి పెద్ద తేడా కనిపించదు.

వీరు కొన్ని మాయలూ, మంత్రాలు కూడ చేస్తారు. కాటి కాపర్లు అవడం వల్ల కొన్ని అతీంద్రియ శక్తులు కలిగి వుంటారనే నమ్మకం కూడావుండి.

ఈనాడు కాటికాపరి తనం ఎక్కడా లేదు. ఒకనాడు సత్య హరిశ్చంద్రుడు కాటికాపరితనం చేయడం అందరికీ తెలిసిందే.

వీరు ఇంటింటికి తిరుగుతారు. ఎవరికీ ఈ అపాయాన్ని కలిగించరు. యాచిస్తూ పొట్ట పోసుకుంటారు.

అయితే వీరు ప్రేక్షకులను సమీకరించటానికి ఇంద్ర జాల విద్యల్ని ప్రదర్శిస్తారు. మూజిక్ చేసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తారు.

వీ భుజానికీ ఒక జోలె వుంటుంది. అందులో నుంచి గవ్వలతో పసుపు కుంకాలతో అలంకరించిన ఒక బొమ్మను అమ్మవారి బొమ్మంటూ తీసి అందరి ఎదుట పెడతారు.

చేతిలో ఒక ఎముక వుంటుంది. ఆ ఎముకతో ఆ బొమ్మను తాకిస్తూ, ఓం మహంకాళీ శాంభవీ అంటూ క్షణంలో మండ్ర గబ్బల్నీ, తేళ్ళనీ, ఎలుకల్నీ పుట్టిస్తాడు. ఆ పుట్టిన ఎలుక చేత కీచు కీచు మనిపిస్తాడు. నోటిలో నుంచి ఇనుప గోలీల్నీ, మేకుల్నీ తీస్తాడు. అలా యాచిస్తూ పొట్టపోసుకుంటూ యాచకులై, దేశ దిమ్మరులై తిరుగుతూ వుంటారు

... ఆనాడూ వీరి ఇంద్రజాల విద్యల్నీ తిలకించటానికి ప్రజలు గుంపులు గుంపులుగా ఎగబడి చూసేవారు. ఇదీ ఒక కళారూపంగానే వర్థిల్లింది.