తెలుగువారి జానపద కళారూపాలు/చెంచులు చెప్పే శ్రీరంగ నీతులు

వికీసోర్స్ నుండి

చెంచులు చెప్పే శ్రీరంగ నీతులు

 ఏ వూరు ఏ భామ..........॥నందానా॥
ఎవ్వారి భామవేవై భామా ......॥నందానా॥
వినరో నరసిమ్మ.........................॥నందానా॥
ఉండు గూడెం మాది....................॥నందానా॥
చేతిడే ముద్దమ్మ........................॥నందానా॥
చెయ్యెత్తి దానాలు.......................॥నందానా॥
వడ్డిచ్చే తల్లి వడ్డిచ్చె తల్లి.

అంటూ భద్రాచల ప్రాంతాల నుండి ఆంధ్ర దేశానికి అప్పుడప్పుడు వచ్చి యాచించి వెళ్ళిపోతూ వుంటారు చెంచులు. వెంట తెచ్చిన నెమలి ఈకలు, పులి గోరులు, మూలికలు అమ్ముకుని డబ్బు చేసుకుంటారు.

వీరు పాడే పాట బెంబీత పాట అంటారు. వీరు ముగ్గురు నలుగురు కలిసి జట్లుగా వస్తారు. ఒకరు చరణం పాడితే మిగిలిన వారు చరాణంలో జెంబీతా అనీ, తందానా అనీ శృతి కలుపుతారు. అందరూ చిన్న జేగంటలను చేత పట్టుకుని, ఒక పుల్లతో పాడే పాటకకు తాళంగా ఉపయోగిస్తారు. వీరి వేషధారణ, కాళ్ళకు చాలీచాలని తొడిగిన లాగులు యాచలలో సంపాదించిన చొక్కాలూ, పూల దండలూ, తల పాగాలూ, పాగాలపై నెమిలి ఈకలూ, పులి గోరులూ, పంది కోరలూ మొదలైన వాటిని ధరిస్తారు. ఈ చెంచు పాటల ద్వారా రెండవ ప్రపంచ యుద్ధకాలంలోఫాసిస్టు మూకల క్రూరకృత్యాలను ప్రజానాట్య మండలి కళాకారులు, నాజరు దళంలోని, రామకోటి, పురుషోత్తం మొదలైన వారు ఎంతో వుత్తేజంగా పాడి ప్రజలకు ఫాసిస్టు ప్రమాదాన్ని గురించి, యుద్ధ ప్రమాదాన్ని గురించి వివరించారు.

ఇదే చెంచు పాటల్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాడించిన అల్లూరు సీతారామరాజు మన్యంలో జరిపిన పోరాట చరిత్రను మిక్కిలినేని, మాచినేని, మొదలైన వారు ఉత్తేజంగా పాడి ప్రజలను వుత్తేజపర్చారు.

అదే చెంచు పాట బాణీలో విజయవాడ తాలూకా, నంది గామ వాస్తవ్యులు అయ్యపు వెంకట కృష్ణయ్య గారు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమర వీరుల త్యాగాలను గురించి ఈ విధంగా వివరించారు. చెంచుల పాట బాణీలో

మనది భారత దేశమమ్మా
మనది భార జాతి తల్లీ.............॥నందానా॥
భారతీయులము మనమమ్మ..........॥నందానా॥
బానిసలమైనాము తల్లీ..............॥నందానా॥
భోగాల పుట్టినిల్లమ్మ
భూలోక స్వర్గమే తల్లీ
మన ఖడ్గ తిక్కనా
మన్యంపు వీరులూ
మన రెడ్డి రాజూలూ
రాణా ప్రతాపుడూ
రసపుత్ర వీరులూ
తమ శౌర్యమయ రక్త
ధారా స్రవంతిలో
తడిపి మెదిపిన వీర
ధాత్రీ ఇది మాతల్లి. ॥మనది॥

ఇలా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులందరినీ, స్మరిస్తూ చెంచు పాటలతో ఉర్రూతలూగించే వారు ప్రజానాట్యమండలి కళాకారులు.

చెంచు నాటకాలు:

ఆ కాలంలో చెంచు నాటకాలను గొల్ల వారే ప్రదర్శిస్తూ వుండే వారు. వీరి నాటకాలనూ అనాటి పల్లెటూళ్ళలో చాల పేరు పొందాయి. ప్రతి గ్రామంలోనూ వీరు నాటకాలను ప్రదర్శిస్తూ వుండేవారు. ఆ వీధిలో వారు నాటకం ఆడించారని వీరూ, వీరు ఆడించారని వారు, ఇలా ప్రతి వీధిలోనూ ప్రదర్శించటంతో,ఎక్కువ రోజులు ఒకే గ్రామంలో వుండి, తగిన పారితోషికాలను సంపాదించుకుని మరో గ్రామానికి తరలి వెళుతూ వుండేవారు.

చెంచు నాటకాలలో ముఖ్యమైన ఇతివృత్తం అహోబల నారసింహ స్వామి చెంచీతను, అంటే చెంచువారి కన్యను మోహించి వివాహం ఆడటం.

ఈ ఆహోబల క్షేత్రం కర్నూలు జిల్లాలో చెంచు వారు నివశించే అడవి మధ్య ఒక కొండ వుంది. ఆ కొండ మీద నరసింహ స్వామి దేవాలయం వుంది. స్వామి ఉత్సవ సమయంలో చెంచు పడుచులు విల్లంబులు చేతపట్టుకుని చురుకుగా యాత్రికుల మధ్య స్వేచ్ఛగా చకచకా తిరుగుతూ స్వైర విహారం చేస్తూ వుంటారు. ఆ చెంచీత కథనే గరుడాచల మహత్యం అని పూర్వ కవి యక్షగానంగా వ్రాశాడు. దాని ననుసరించి అనేక మంది ఆ యక్షగానాన్ని ప్రదర్శించారు.