తెనాలి రామకృష్ణకవి చరిత్రము/ధూర్జటికవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాఁటగోలె పెద్దనకవీశ్వరుఁడు రామకృష్ణునివిషయమై రాయలతోఁ జెప్పి యాస్థానకవిగా బరిగణింప వలసినదాని కోరెనని చెప్పుదురు. కొందఱు నందితిమ్మనకవీంద్రు నుద్దేశించి రామకృష్ణుడు.

క. 'నీకవితామాధుర్యం
    బేకవులకు గలుగ నేర్చు నే కూపనట
    ద్బేకములకు నాకధునీ
    శీకరములచెమ్మ ! నందిసింగయతిమ్మా'

యని చదివెనట. అంత నా నందితిమ్మన్న కవీంద్రుడు పరమానందభరితాత్ముండై తనకు శ్రీకృష్ణ దేవరాయలు బహుమానముగ నొసంగిన శాలువ నిచ్చెను. ఆశాలువ ధరించి, రామకృష్ణు డాస్థానమునకుఁ బోయెను, రాయలు రామకృష్ణుడు ధరించియున్న శాలువా చూచి ‘కవిచంద్రమా! నీ కియ్యది యెట్లు లభించినది?” అని ప్రశ్ని౧పగా తన పద్యమునకు సంతోషించి, నందితిమ్మన్న యా పచ్చడము నొసంగెనని చెప్పి యాపద్యము జదివెను, రాయలు సంతసించి రామకృష్ణుని సన్మానించెనట,

4 ధూర్జటి కవి

ఆస్థానకవులందరిలో కృష్ణదేవరాయలకు ధూర్జటికవిపై నత్యధికమగు ప్రీతిఁగలిగియుండెను. కవితాగోష్ఠి సలుపునపుడు రాయలు తఱచుగా ధూర్జటి కవిత్వమును గూర్చియే ప్రశంసించు చుండెను. ధూర్జటి పైకి పరమశ్రోత్రియుడుగా గన్పట్టుచు రహస్యముగా వారాంగనాలోలుఁడై మెలగుచుండెను. అట్టి మహాకవి యవినీతివర్తను డై మెలగుచు భార్యమోము చూడకుండుటచే నెట్లయిన యాతని వేశ్యానురక్తి తొలగజేయవలయునని పెద్దనాదులందరు నిశ్చయించుకొని, రామకృష్ణకవితో 'ఇది నీవల్ల జరుగవలసిన పనిగాని మావలన జరుగదు అని చెప్పిరి. సరేయని రామకృష్ణుడు తగిన యదనుకై నిరీక్షించుచుండెను,

రాయలొక నాఁడు కొలువుకూటమున నున్న కవుల నందరను దిలకించి యిట్లు సమస్యనిచ్చి పూరించుమనెను.

'చ. స్తుతమలియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో
     యతులిత మాధురీమహిమ........

రామకృష్ణకవి లేచి యిట్లు పద్యములోని మిగిలిన భాగము పూర్తిచేసెను.

     ......హా తెలిసెన్ ! భువనైక మోహనో
     ద్ధతకుమారవార వనితాజనతా ఘనతాపహారిసం
     తతమధురాధరోదితసుధారసధారలఁ గ్రోలగాజుమీ!

వారాంగనపాన మొనరించుటచేతచే ధూర్జటి కవిత్వ మంత రసవంతమై యున్నదను భావము నలుగురకు బోధపడుటనే ధూర్జటి సిగ్గుపడి వికటకవి నేమియు ననఁజాలక యూరకుండెను. రాయలు ధూర్జటిని కొన్నిరోజులలైనపిదప నంతఃపురమునకుఁ బిలిపించి, వేశ్వ సహవాసము మానుమని మందలించెను.

5 దొంగలచే నీరు తోడించుట

శ్రీకృష్ణదేవరాయ లొకప్పుడు కైదీలను బరీక్షించుటకై కారాగృహమున కేగెను. అపరాధులందరును దమతమ యపరాధములను రాయల కెరింగించుచుఁ దమకు నిర్బంధవిమోచనముఁ గలిగింపుమని ప్రార్థించుచుండిరి. ఇరువురు దొంగలు రాయలు తమ్ము “మీరు చేసిన యపరాధములఁ దెలుపు' డనినంత నే యిట్లు చెప్పిరి. మహారాజా! మాకు చౌర్యమున నద్భుతము ననుపమానము నగు నేర్పు కలదు. మేము గజదొంగలము. ఈవృత్తిని మానుదుము


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.