తత్త్వముల వివరము/3వ తత్త్వము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

---------------3. తత్త్వము--------------


చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరె చందమామ


1) కాయమను పుట్టలోను చందమామ, పాము మాయగానే మెలగుచుండు చందమామ ||చం||

2) జంట నాగ స్వరములూది చందమామ, పామును పాదు పెకలింపవలెను చందమామ ||చం||

3) తొమ్మిది వాకిల్లు మూసి చందమామ, పామును నెమ్మదిగ పట్టవలెను చందమామ ||చం||

4) భక్తియను కట్టుకట్టి చందమామ, పామును యుక్తిచేసి పట్టవలెను చందమామ ||చం||

5) దేహ దేహములందు చందమామ, పాము తెలియకుండ చుట్టుకొన్నది చందమామ ||చం||

6) అజప మంత్ర ద్యానము చేత చందమామ, పాము అఖండ కళలతో వెలుగుచునుండు చందమామ ||చం||

7) పామును బట్టే యోగి ఎవరు చందమామ, ఓహో అతని పేరు సిద్దగురుడు చందమామ ||చం||


వివరము :- ఈ తత్త్వము నేటికిని అక్కడక్కడ పల్లెజనము పాడుచునే ఉన్నారు. దీనిని వారందరికి అర్థమగులాగున వివరించుకొందాము. ఈ తత్త్వములో మొదటి వాక్యములోనే సంధి తెలిపే జ్ఞానులెవరే అని వ్రాయబడి ఉన్నది. ఇద్దరి మద్యన ఉండుదానిని సంధి అంటాము. ఉదాహరణకు పగలు రాత్రికి మద్యలో ప్రొద్దుక్రుంకు వేళను సంధికాలము అంటున్నారు దానినే సంధ్యవేళ అంటున్నాము. రాత్రి పగలును కలుపు కాలమును సంధికాలము అన్నట్లు ఇద్దరు మనుషులను కలుపు వ్యవహారమును సంధి చేయడము అని కూడ అనుచున్నాము. అలాగే జీవున్ని దేవున్ని కలుపుటకు మద్యలోనున్న జ్ఞానమును సంధి అని అనుచున్నాము. జీవుడు దేవునితో కలుసుటకు ముందు సంధి చేయవలసి ఉన్నది. ఆ సంధియను జ్ఞానమును తెలిపేవారు పూర్తి జ్ఞానపరులై ఉండవలెను. తనకు తెలియని జ్ఞానమును వాక్యము రూపముతో చెప్పుచు ఈ జ్ఞాన వివరము తెలిపే వారెవరు అని అడిగినట్లు ఈ తత్త్వములో గలదు. పూర్వము ఒక వ్యక్తి పున్నమిరోజున ఆరుబయట పడుకొని తనకు కల్గిన జ్ఞానసంశయములను గూర్చి చందమామను అడగడమును తత్త్వరూపములో గలదు. చందమామ ఏమి వివరించుతాడో క్రింద చూచెదము.


  1) కాయమను పుట్టలోను చందమామ, పాము మాయగానే మెలగుచుండు చందమామ ||చం||

పాముల నివాసము పుట్టలని చాలామంది అనుకొనుట గలదు. పాముపుట్టలో ఉంటుందని పుట్టకు పూజలు చేయువారిని కూడ చూచునేయున్నాము. పుట్టలో పాము నివాసము చేయునట్లు మన శరీరము అను పుట్టలో ఆత్మ అను పాము నివాసము చేయుచున్నది. కావున కాయమను పుట్టలోన అన్నారు. పాముకు బుసకొట్టు స్వభావము ఉన్నట్లు ఆత్మకు కూడ శ్వాస ద్వార సోహం అను బుసకొట్టు స్వభావము ఉన్నది. మాయం అయిపోయిందని అంటే కనిపించకుండ పోయిందని అర్థము. మాయగా అంటే ఇక్కడ కనిపించకుండ అని అర్థము. శరీరములో ఆత్మ కనిపించకుండ ఉన్నది. కావున పాము మాయగానే మెలగుచుండు అని పై వాక్యములో అన్నారు, శరీరములో ఆత్మ కనిపించకుండ నివాసము చేయుచున్నదను వివరము మొదటి వాక్యములో గలదు.


 2) జంట నాగ స్వరములూది చందమామ, పామును పాదు పెకలింపవలెను చందమామ ||చం||

శరీరములో గల ఆత్మను పాముగ పోల్చుకొన్నపుడు ఆ పామును పట్టే దానికి కూడ ఉపాయముగలదు. సహజముగ పాములవారు నాగస్వరమును ఊది చుట్టచేసుకొని పాదుగపడుకొన్న పామును లేపి పట్టుకొనుచున్నాడు. అలాగే శరీరములోని పామును పట్టుటకు రెండు ముక్కురంధ్రములలో ఆడుచున్న శ్వాసను నాగస్వరముగ ఉపయోగించు కోవలసియున్నది. ముక్కు రంధ్రములలో ఆడుచున్న శ్వాసవిూద ద్యాసను పెట్టకోవడము వలన ఇతర విషయముల మీదికి మనస్సు పోకుండ నిలచిపోవును. అలా మనస్సును శ్వాసద్వార ఒక స్థాయికి తెచ్చుకొన్న తర్వాత శూణ్యస్థాయికి చేర్చి ఆత్మ మీదికి సులభముగ మల్లించుటకు వీలుకల్గును. ఈ విధముగ శ్వాస ద్వార ఆత్మను తెలియవచ్చునన్న ఉద్దేశముతో జంట నాగస్వరము ఊది పామును పాదు పెకలించవలెను అని అన్నారు.


3) తొమ్మిది వాకిల్లు మూసి చందమామ, పామును నెమ్మదిగ పట్టవలెను చందమామ ||చం||

శరీరమునకు కళ్లు రెండు రంధ్రములు, చెవులు రెండురంధ్రములు, ముక్కు రెండురంధ్రములు, నోరు ఒక రంధ్రము, అలాగే క్రింద గుదము, గుహ్యము అను రెండు రంధ్రములు మొత్తము కలిపి తొమ్మిది రంధ్రములు గలవు. అందువలననే శరీరమును తొమ్మిది రంధ్రములుగల పుట్ట అని అన్నారు. తొమ్మిది రంధ్రముల విషయములను మనస్సు యొక్క ఆలోచనకు తెచ్చుకోకపోతే లోపలయున్న ఆత్మవిూద మనోధ్యాస ఏర్పడును. దానివలన ఆత్మ తెలియును. కావున తొమ్మిది వాకిల్లు మూసి పామును నెమ్మదిగ పట్టవలెనన్నారు. ఒక్క మారుగ మనస్సు ఆత్మ విూదికి పోదు అందువలన కొంత సాధన ద్వార అది సాధ్యపడును. కావున పామును నెమ్మదిగ పట్టవలెను అన్నారు. సాధన ద్వార బయటి విషయముల విూదికి మనస్సును పోనీయక లోపలనున్న ఆత్మ విూద నిలుపడమును చెప్పుచు తొమ్మిది వాకిల్లు మూసి చందమామ పామును నెమ్మదిగ పట్టవలెను చందమామ అని మూడవ చరణములో అన్నారు.


 4) భక్తియను కట్టుకట్టి చందమామ, పామును యుక్తిచేసి పట్టవలెను చందమామ ||చం||

శరీరములోని ఆత్మను దర్శించుకోవాలంటే మనిషికి భక్తియనునది ముఖ్యము. భక్తికి ఆత్మవశమై పోతుంది కావున భక్తికలవారికి ఆత్మయందైక్యము లభించును. బయట పాములవాడు మంత్రము చేత కట్టుకట్టి పామును కదలకుండచేసి పట్టుకొనుచున్నాడు. అదే విధముగ లోపలగల ఆత్మయను పామును భక్తియను మంత్రముచేత యోగము అను యుక్తిచేత పట్టవలెనని నాల్గవచరణములో చెప్పారు.


 5) దేహ దేహములందు చందమామ, పాము తెలియకుండ చుట్టుకొన్నది చందమామ ||చం||

అన్ని శరీరములలో ఆత్మ తెలియకుండ నివాసము చేయున్నది. కావున దేహదేహములందు పాము తెలియకుండ చుట్టుకొన్నది అని ఐదవ చరణములో అన్నారు.


 6) అజప మంత్ర ద్యానము చేత చందమామ, పాము అఖండ కళలతో వెలుగుచునుండు చందమామ ||చం||

మన శరీరములో ఆడుచున్న శ్వాసయందు ఒక శబ్దము కలదు. శ్వాస ముక్కురంధ్రముల ద్వార లోపలికి పోవునపుడు "సో" అను శబ్దముతో పోవుచున్నది. బయటికి వచ్చునపుడు "హమ్‌" అను శబ్దముతో వచ్చు చున్నది. శ్వాస ఒకమారు లోపలికిపోయి బయటికి రావడములో "సోహమ్‌" అను శబ్దము ఏర్పడుచున్నది. ఈ సోహమ్‌ శబ్దములో "ఓం" శబ్దము ఇమిడి ఉన్నది. అదేవిధముగ అనగ లోపలికి పోవునపుడు 'సో' అను శబ్దముతో పోవుచున్నది కదా! 'సో' అను శబ్దములో చివరిగ 'ఓ' అను శబ్దము వచ్చుచున్నది. అట్లే శ్వాస లోపలినుండి బయటికి వచ్చునపుడు 'హమ్‌' అను శబ్దముతో వచ్చుచున్నది కదా! 'హమ్‌' అను శబ్దములో చివరిగ 'మ్‌' అను శబ్దము వచ్చుచున్నది. శ్వాస లోపలికి పోవునపుడు చివరిగ వచ్చు 'ఓ' అను శబ్దమును, శ్వాస బయటికి వచ్చునపుడు చివరిగ వచ్చు 'మ్‌' శబ్దమును కలిపితే 'ఓమ్‌' అగుచున్నది. ఒక్కమారు శ్వాసలోపలికి పోయి బయటికివస్తే అందులో 'ఓమ్‌' కారము ఇమిడియున్నది. శ్వాస ప్రతినిత్యము ఎల్లవేళల ఆడుచున్నది కావున 'ఓమ్‌' శబ్దము ఎల్లవేళల మనయందు జపించపడుచున్నది. మనము ప్రయత్న పూర్వకముగ జపించకనే తానంతటికదే జపించ పడుచున్నది కావున ఓంకారమును అజపమంత్రము అన్నారు. ముక్కు రంధ్రములలో జపించబడుచున్న 'ఓమ్‌' శబ్దము ఎల్లపుడు అఖండముగ సాగుచున్నది కావున ఆ మంత్రమును స్వయముగ ఆత్మ ధ్యానించుచున్నదని ఆ ధ్యానములో అఖండముగ అందరిలో నిలిచియున్నదని ఆరవచరణములో అన్నారు.


 7) పామును బట్టే యోగి ఎవరు చందమామ, ఓహో అతని పేరు సిద్దగురుడు చందమామ ||చం||

అటువంటి పామును అనగ ఆత్మను పొందగలిగినవాడు యోగియై సిద్ధిపొందగలడని తెలుపుచు పామును పట్టేయోగి సిద్దగురుడు అన్నారు.

-***-