కార్తీక మహా పురాణము/పందొమ్మిదవ రోజు

వికీసోర్స్ నుండి

నారదుడు చెబుతున్నాడు: పృథు భూపాలా! కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను.

       కార్తీక వ్రతస్థులకు నియమములు

ఈ వ్రతస్థుడు - మాంసము, తేనె, రేగుపండ్లు, నల్లావాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. పరాన్న భుక్తి - పరద్రోహం - దేశాటనలు త్యజించాలి. తీర్ధయాత్రలు మాత్రం చేయవచ్చును. దేవ బ్రహ్మ గురు రాజులును, స్త్రీలను, గోవ్రతస్థులను దూషించకూడదు. అవిసెనూనెను, నువ్వులనూనెను, విక్రయాన్నమును, నింద్యవ్యంజనే యుక్తభోజనమునూ, దూషితాహారమునూ విసర్జించాలి. ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలనూ, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొఱ్ఱలవంటి హీనదాన్యాలనూ, చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు - వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలనూ స్వీకరించకూడదు. బ్రహ్మణులచే అమ్మబడే రసాలను భుజాతలవణాలను విసర్జించాలి. రాగిపాత్రలలో వుంచిన పంచగవ్యం, చిన్న చిన్న గుంటలలో వుండే కుళ్లు దైవానికి నివేదించబడని అన్నం - ఈ మూడూ మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి. గనుక వాటిని విసర్జించాలి. బ్రహ్మచర్యాన్నీ భూశయనాన్నీ పాటించాలి. ఆకులలోనే భోజనము చేయాలి. నాలుగవ ఝామున భుజించడమే శ్రేష్ఠం. ఈ కార్తీక వ్రతస్థుడు, ఒక్క నరక చతుర్దశినాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగనం చేయకూడదు. విష్ణువ్రతం చేసేవారు - వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. బహిష్ఠలతోనూ, మ్లేచ్చులతోనూ, వ్రతబ్రష్ఠులతోనూ వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు. అటువంటి వారి ఎంగిలికాని, కాకులు తాకిన ఆహారాన్నిగాని, ఆశౌచ సంబంధితాహారంగాని, ఒకసారి వండి మరల ఉడికించినది గాని, మాడుపట్టిన అన్నాన్నిగాని తినకూడదు.



Sampoorna Karthika Maha Purananamu 19th Day Parayanam



తన శక్తి కొలదీ విష్ణు ప్రీతికై కృచ్చాదులను చేయాలి. గుమ్మడి, వాకుడు సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదుపొట్ట, రేగు, వంకాయ, ఉల్లి - వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి. కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు. ఇవేగాక, ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి. మరి కొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. ఈ కార్తీక మాసంలో చేసినట్లే, మాఘమాసంలో కూడా చేయాలి. కార్తీక వ్రతాన్ని యధావిధిగా ఆచరించే భక్తులను చూసి - యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు. వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు. కాని కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు. కాబట్టి - యజ్ఞ యాగాదులకన్న కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా భూలోకంలో వున్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా, కార్తీక వ్రతస్థుని శరీరమందే వుంటాయి. విష్ణ్వాజ్ఞావశవర్తులైన ఇంద్రాదూలందరూ, రాజును సేవకులు కొలిచినట్లుగా, ఈ వ్రతస్థుడినీ సేవిస్తారు. విష్ణు వ్రచారణపరులు ఎక్కడ పూజింపబడుతూంటారో ,అక్కడి నుంచి గ్రహ, భూత పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి. యధావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకుగూడా సాధ్యముకాదు. ఈ కార్తీక వ్రతాన్నివిడువకుండా ఆచరించేవాడు తీర్ధయాత్రలు చేయవలసిన అవసరమే లేదు.

       సప్తమోధ్యాయ స్సమాప్తః (ఏడవ అధ్యాయము సమాప్తము) 


           అష్టమాధ్యాయము

ప్రజారంజనశీలా! పృధునృపాలా! ఇక, ఈ కార్తీక వ్రతోద్యాపనా విధిని సంగ్రహంగా చెబుతున్నాను విను.

       ఉద్యాపనావిధి



Sampoorna Karthika Maha Purananamu 19th Day Parayanam



విష్ణు ప్రీతి కోసమూ వ్రతసాఫల్యత కోసమూ - కార్తీకశుద్ధ చతుర్దశినాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ _ తోరణాలు గలది, నాలుగు ద్వారాలు కలదీ, పుష్ప వింజామరలచే అలంకరింపబడినదీయైన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. నాలుగు ద్వారాల వద్దా - సుశీల, పుణ్యశీల - జయ, విజయులనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరచి -వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో నాలుగు రంగుల గల ముగ్గులతో 'సర్వతోభద్రం' అనే అలంకారాన్ని చేయాలి. దానిపై పంచరత్న సమన్వితము - నారికేళ సంయుక్తమూ అయిన కలశమును ప్రతిష్ఠించి - శంఖ చక్ర గదా పద్మథారీ పీతాంబరుడూ, లక్ష్మీసమేతుడూ అయిన నారాయణుని పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి, త్రయోదశినాడు దేవతలకు దర్శనమిచ్చి, చతుర్దశినాడు పూజనీయుడై వుంటాడు కనుక, మానవుడు ఆ రోజున నిర్మలచిత్తుడై ఉపవాసముండి, విష్ణుపూజను విధివిధానంగా ఆచరించాలి.


Sampoorna Karthika Maha Purananamu 19th Day Parayanam



గురువుయొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణరూపమందు ఆవాహన చేసి, షోడశోపచారాలతోనూ పూజించి, పంచభక్ష్య భోజ్యాలనూ నివేదించాలి. గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతఃకాలకృత్యాలు నెరవేర్చుకొని, నిత్యక్రియలను నాచరించాలి. పిదప - నిష్కల్మషాంత రంగుడై హొమం చేసి, బ్రాహ్మణ సమారాధన చేసి, యధాశక్తి దక్షిణలు ఇవ్వాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్దశినాడు ఉపవసించిన వాడూ, విష్ణుపూజ చేసిన వాడూ తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు.

'ఓ బ్రాహ్మణులారా! మీరు సంతోషించుట చేత నేను విష్ణ్వనుగ్రహమును పొందెదను గాక! ఈ వ్రతాచరణ వలన - గత ఏడు జన్మలలోని నా పాపములు నశించును గాక! నా కోరికలు తీరునుగాక. గోత్రవృద్ధి స్థిరమగును గాక" అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి. వారిచేత 'తథాస్తు' అని దీవింపబడి - దేవతోద్వాసనలు చెప్పి, బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన - గోవును గురువు దానమియాలి. అటు తర్వాత - సజ్జనులతో కూడినవాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి.

       ఏవం శ్రీ పద్మ పురాణా౦తర్గత కార్తీక మహత్మ్యమందలి
           సప్తమి, అష్టమి అధ్యాయములు

19 వ రోజు

నిషిద్ధములు  :- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి

దానములు  :- నువ్వులు, కుడుములు

పూజించాల్సిన దైవము  :- వినాయకుడు

జపించాల్సిన మంత్రము  :- ఓం గం గణపతయే స్వాహా

ఫలితము  :- విజయం, సర్వవిఘ్న నాశనం