కార్తీక మహా పురాణము/ఇరువదియవ రోజు

వికీసోర్స్ నుండి

పృధు చక్రవర్తి అడుగుతున్నాడు: దేవర్షీ! తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని 'హరిప్రియా - విష్ణువల్లభా' వంటి పేరులతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసీ మహాత్మ్యాన్ని వినిపించు.' నారదుడు చెబుతున్నాడు 'శ్రద్ధగా విను. పూర్వమొకానొకసారి, ఇంద్రుడు సమస్త దేవతాప్సరసమేతుడై శివదర్శనార్ధం కైలసానికి వెళ్లాడు. ఆ సమయానికి శివుడు బేతాళరూపియై వున్నాడు. భీత మహాదంస్ట్రా నేత్రాలతో మృత్యు భయంకరంగా వున్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక 'ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?' అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కాని, ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా 'నిన్ను శిక్షిస్తున్నాను. ఎవడు రక్షిస్తాడో చూస్తాను' అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయ్యిందిగాని ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో, దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి = ఇంద్రుడి చేత అతనికి మ్రొక్కింది. తానీ విధంగా శాంతి స్తోత్రం చేశాడు.

       బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోత్రం.
       శ్లో|| నమో దేవాది దేవాయ త్ర్యంబకాయ కపర్దినే
            త్రిపురఘ్నాయ శర్వాయ సమో2 ౦ధ కనిషూదినే ||
       శ్లో|| విరూపా యాదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే  
            యజ్ఞ విధ్వంసక్రర్త్రేవై యజ్ఞానాం ఫలదాయినే ||
       శ్లో|| కాలాంత కాలకాలాయ కాలభోగి ధరాయచ
            నమో బ్రహ్మ శిరోహంత్రే, బ్రహ్మణ్యాయ నమోనమః ||



Karthika Puranam, Sampoorna Karthika Maha Purananamu, Karthika Masa Vratam, Sampoorna Karthika Maha Purananamu 20th Day Parayanam



బృహస్పతి ఈ విధంగా ప్రార్ధించడంతో శాంతించిన శివుడు - త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించేందుకు నిశ్చయించి - 'బృహస్పతీ! నా కోపం నుంచి ఇంద్రుణ్ని బ్రతికించినందుకుగాను ఇక నుంచి నువ్వు 'జీవ' అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ని చేసింది. ఏదైనా వరం కోరుకో' అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి - 'హేశివా! నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను - త్రిదివేశునీ త్రిలోకాలనూ కూడా నీ మూడోకంటి మంటనుంచి రక్షించు. నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి. ఇదే నా కోరిక' అన్నాడు.



Karthika Puranam, Sampoorna Karthika Maha Purananamu, Karthika Masa Vratam, Sampoorna Karthika Maha Purananamu 20th Day Parayanam



సంతసించిన సాంబశివుడు - 'వాచస్పతీ! నా మూడోకంటి నుండి వెలువరించిబడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్ధనను మన్నించి, అగ్నిలోక దహనం చేయకుండా వుండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను' అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి - బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది, ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. అ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి - 'ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడ'ని అడిగాడు. అందుకు సముద్రుడాయనకు నమస్కరించి - 'గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే. దయ చేసి వీనికి జాత కర్మాది సంస్కారాలను చేయు'మని కోరాడు. ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకొని ఊగులాడసాగాడు. వాడి పట్టునుంచి తన గెడ్డం వదిలించుకొనేందుకు బ్రహ్మకు కళ్లనీళ్ళ పర్యంతమైంది. అందువల్ల విధాత ' ఓ సముద్రుడా నా కళ్ళను నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త, వీరుడూ అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు' అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరుడికి, కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్ళిచేశారు. రూప, వయో, బలవిలాసుడైన జలంధరుడా బృందను భార్యగా గ్రహించి, దానవాచార్యుడయిన శుక్రుని సహాయ్యంతో సముద్రము నుండి భూమినాక్రమించి స్వర్గంలా పాలించసాగాడు.

       నవమోధ్యాయస్సమాప్తః (తోమ్మిదవ అధ్యయము సమాప్తము)
                        దశమాధ్యాయము



Karthika Puranam, Sampoorna Karthika Maha Purananamu, Karthika Masa Vratam, Sampoorna Karthika Maha Purananamu 20th Day Parayanam



నారదుడు చెబుతున్నాడు: పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలోదాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి, నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడోకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి - 'వీడికి తల లేదేమిటి?' అని ప్రశ్నించిన మీదట శుక్రుడు, గతంలో జరిగిన క్షీరసాగర మధనం అమృతపు పంపకం. ఆ సందర్భంగా విష్ణువతని తల తెగవేయడం - ఇత్యాదిగాగల ఇతిహాసమంతా చెప్పాడు. అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు - మండిపడ్డాడు. తన తండ్రియైన సముద్రుని మధించడం పట్ల చాలా మధనపడ్డాడు. ఘస్మరుడనేవాణ్ణి - దేవతల దగ్గరకి రాయబారిగా పంపాడు. వాడు - ఇంద్రుడి వద్దకు వెళ్ళి 'నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను - ఇంద్రా! నా తండ్రియైన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలనన్నింటినీ వెంటనే నాకు అప్పగించు.' అది విన్న అమరేంద్రుడు - 'ఓ రాక్షసదూతా! గతంలో నాకు భయపడిన లోక కంటకాలయిన పర్వతాలనీ, నా శత్రువులయిన రాక్షసుల్నీ ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్రమధనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్రనందనుడు కూడా అహంకారంచి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్రమధన కారణాన్నీ దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్నీ కూడా మీ నాయకుడికి విన్నవించుకో...' అని చెప్పాడు. ఘస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు.



Karthika Puranam, Sampoorna Karthika Maha Purananamu, Karthika Masa Vratam, Sampoorna Karthika Maha Purananamu 20th Day Parayanam



మండిపడ్డ జలంధరుడు - మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ - నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు .ఉభయ సైన్యాలవారూ ముసల పరిఘబాణగదాద్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రధ, గజ, తురగాదిక శవాలతోనూ, రక్తప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ 'మృత సంజీవనీ విద్యతో బ్రతికిస్తూండగా - దేవ గురువైన బృహస్పతి అచేతనాలైన దేవ గణాలను ,ద్రోణగిరి మీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రములో పార వేయించాడు.

ఎప్పుడయితే ద్రోణపర్వతం అదృశ్యమయిందో - అప్పుడు బృహస్పతి, దేవతలను చూచి, 'ఓ దేవతలారా! ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు గాబట్టి, మనకు జయింప శక్యం కాకుండా వున్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరిదారిన వాళ్లు పారిపోండి' అని హెచ్చరించాడు. అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహంతరాళాలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు - ఇంద్ర పదవిలో తను పట్టాభిషిక్తుడై, శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం - కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు.

       ఏవం శ్రీ పద్మ పురాణా౦తర్గత కార్తీక  మహత్మ్యమందలి
                  తొమ్మిదీ, పదీ అధ్యాయములు



Karthika Puranam, Sampoorna Karthika Maha Purananamu, Karthika Masa Vratam, Sampoorna Karthika Maha Purananamu 20th Day Parayanam



20 వ రోజు

నిషిద్ధములు  :- పాలుతప్ప - తక్కినవి

దానములు  :- గో, భూ, సువర్ణ దానాలు

పూజించాల్సిన దైవము  :- నాగేంద్రుడు

జపించాల్సిన మంత్రము  :- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం

ఫలితము  :- గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి