ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/సైదాపేట చదువు

వికీసోర్స్ నుండి

49. సైదాపేట చదువు

విద్యార్థిదశయంతటిలోను ఈతుదివత్సరమే నా యారోగ్య విషయమున నధమకాలము. సైదాపేటలో నే నుండినయేఁడాది పొడుగునను, నేను రోగపీడితుఁడ నగుచునేయుంటిని. దీనివలన నావిద్య కెంతో భంగము కలిగెను. రెండవ యర్ధసంవత్సరమున కుటుంబముతో నుండిన లాభము నే నంతగఁ బొందలేదు. నా వ్యాధిగ్రస్తతఁ జూచి, నామీఁద జాలిగొని, నాచదువుచెప్పుపని తేలికచేసినప్రథమోపాధ్యాయునిసాయమే నాకు విషమించెను ! ఆంధ్రవిద్యార్థుల కావిద్యాలయమున చదువు చెప్పుట కొప్పగింపఁబడు తెలుఁగుబాలురతరగతులు చిన్నవిగ నుండెను. ఇంగ్లీషు చెప్పుటకు నా కీయఁబడిన మూఁడవతరగతిలో నైదారుగురే విద్యార్థు లుండిరి. పిమ్మట నాకు పని కలిగిన చిన్న పాఠశాలలో నిద్దఱు విద్యార్థులే కలరు. ఆవేసవియెండలకో, నాబోధనమహిమముననో, వీరిద్దఱును తరగతిలో నిద్దురపోయెడివారు ! రెండవ యర్ధసంవత్సరమున వ్యాధి ముదురుటచేత నొకవిద్యార్థి మాత్రమే కల తెలుఁగుతరగతి నా కీయఁబడెను. ఆరోగ్యము చేకూరినపిమ్మటఁ గూడ, నాకు కొలఁదిమందిగల చిన్న తరగతులే సంప్రాప్త మయ్యెను. ఇట్లు నే నాకళాశాలలోఁ గడిపిన యేఁడాదియు తగినంత విద్యాబోధనానుభవమును సమకూర్చుకొన లేకపోయితిని. బోధించుటకు అధిక సంఖ్యగల పెద్దతరగతులు తమ కీయుఁ డని తోడిబోధకవిద్యార్థులు గురువులను బీడించుచుండఁగా, నాకోరిక యెపుడును స్వల్పసంఖ్యగల తరగతులు గావలయు ననియే !

ఈకారణములవలన నేను విద్యాబోధన కౌశలమునందు వెనుకఁ బడియుంటిని. కావుననే సంవత్సరమునందు రెండుమూఁడు సారులు నే నిచ్చిన విమర్శనపాఠములందు నేను గురువులయొక్కయు సహాధ్యాయులయొక్కయు సదభిప్రాయమును బడయనేరకుంటిని. శరీరము నందలి నీరసము దీనికిఁ దోడుపడుటచేత, నాబోధన మెవరికిని నచ్చ కుండెను. సహజమగు వేగిరపాటునకు సభాకంపము, శరీరదుర్బలతయుఁ దోడై, పలుకునకు తొట్రుపాటును, దేహమునకు వణఁకును అట్టిసమయములందు గలిగించెడివి ! ఒకప్పుడు కళాశాలాధ్యక్షుఁడు విమర్శనము చేయుటకై కూర్చుండిన నా సహపాఠులకు నన్నుఁ జూపించి, "గుడికిఁ గొనిపోవు మేఁకపోతువలె నీబోధకుఁ డెట్లు భయమందుచున్నాఁడో పరికింపుఁడు !" అని పలుకునపుడు, నాయలజడి మఱింతహెచ్చెను. అంత నాసహాధ్యాయులలో పెద్దవాఁ డొకఁడు లేచి, "ఇతనికి జబ్బుగా నున్నది. మీ ఱెఱుఁగరు కాఁబోలు !" అని నిర్భయముగఁ జెప్పఁగా, నే నానాఁడు చెప్పవలసిన పాఠము మఱుసటివారమునకు వాయిదావేయఁబడెను. రెండవమాఱుకూడ నే నిట్టి దుస్థితినే యుండుటఁ జూచి, వెనుకటి సహాధ్యాయుఁ డొకయుపాయము చేసెను. నే నపుడు బోధించిన పాఠము బాగుగ లేదని యందఱికిని దెలిసియె యుండెను. ఈయభిప్రాయ మధ్యక్షుఁడు పుస్తకమున లిఖించినయెడల నా కపకారము కలిగెడిది. తమతమ యభిప్రాయము లీయుఁ డని యధికారి సదస్యుల నడిగెను. నాయాశ్చర్య మేమి చెప్పను ! నాపాఠము మిక్కిలి చక్కగ నుండెనని కొందఱును, మార్గప్రదర్శకముగ నుండెనని కొందఱును జెప్పివేసిరి ! ఈశ్లాఘనము వినిన యధ్యక్షుఁడు తనయభిప్రాయమునే మార్చుకొని, నాపాఠము మొత్తముమీఁద బాగుగనే యుండె నని నిర్ణయించెను !

బోధనాభ్యసనకళాశాలలోని పని సామాన్యముగ బూటక మని యందఱు నెఱిఁగినదియె ! ఐనను, నాటకరంగమున కేతెంచిన నటుఁడు, పాత్రానురూపమగు నభినయము చేయకతీఱునా ? బ్రదుకు తెఱవెఱిఁగిన నాసహపాఠులలోఁ బలువురు, బోధనసమయమున లేని వికాసమును చుఱుకుఁదనమును దెచ్చుకొని, మృదుమందహాసములతో బోధనకార్యము నెఱపి, కృతకృత్యు లగుచువచ్చిరి. ఇట్టి కపటనటన మయోగ్యమని యెంచిన నేను, నాబోధనమును తగినంత సొగసుగను సారవంతముగను జేయ ప్రజ్ఞానుభవములును, కనీసము వాంచాబలమైనను లేక, బోధనకార్యమం దపజయము గాంచుచుంటిని ! ఈకారణముననే, అదివఱ కే పరీక్షలోఁగాని పరాజయ మెఱుంగని నేను, యల్. టీ. పరీక్షలోని బోధనభాగమున పిమ్మట ముమ్మాఱు తప్పి, వృత్తిలో నాకుఁ జేకూరెడి లాభమును జాలభాగము గోలుపోయితిని !

50. పత్రికాయౌవనము

ద్వితీయసంవత్సరప్రారంభముననే సత్యసంవర్థనికి యౌవన దశాసంప్రాప్త మయ్యెను. దీని కొకచిహ్నముగ, రెండవసంపుటము నుండియు మాపత్రిక, ముప్పదిరెండుపుటలు రంగుకాగితపు ముఖపత్రమునుగల రమ్యపుస్తకరూపమున విలసిల్లెను. బాహ్యవేషముతోనే పత్రికమిసమిసలు తుదముట్టలేదు. నా యాంగ్ల వ్యాసములందును, కనకరాజునియాంధ్రరచనములందును, చక్కని యభివృద్ధి గాన వచ్చెను. 1892 సంవత్సరము జూలైనెలసంచికలో నే నాంగ్లమున వ్రాసిన "మానవజీవితమందలి త్రివిధశోధనముల"లోనె పత్రికయౌవనపుఁబోకడలు గనఁబడెను. అప్పటినుండియు నా సత్యసంవర్థనీ వ్యాసములు వెనుకటివానివలె మొండిముక్కలు గాక, నిడుదలై, భావవిస్ఫురణ వాక్యసౌష్ఠవములతో విరాజిల్లుచుండెను. ఆ సెప్టెంబరుసంచికలోని నా "అనుష్ఠానికధర్మము"నం దీసంగతి విస్పష్ట